నీటి కొరత సమస్య వేగంగా తరుముకొస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడకపోతే ముప్పు తప్పదు. ప్రపంచ జనాభాలో భారత వాటా 18% కానీ వీరికి అందుబాటులో అన్ని రకాల నీటి వనరులు కేవలం 4 శాతమే ఏటా సకాలంలో వానలు కురవక ఆఖరి తడులకు నీళ్ళు అందక పంటలు పండుతున్నాయి. ఆరుతడి పంటలు వేస్తే సాగునీటి సమస్య కొంతమేర తగ్గుతుంది. కాని ఎవ్వరికీ ఇది అర్థం కావడంలేదు.
కేప్టౌన్ దుస్థితి భారత్కు కూడా రాబోతుందా!
ప్రపంచంలో తాగునీరు పూర్తిగా అడుగంటి పోయిన నగరంగా కేప్టౌన్ ప్రస్తుతం ఉంది. ఇలాంటి ప్రమాదం చాలా ప్రపంచ దేశాలకు దాపురించే పరిస్థితులు కనబడుతున్నాయి. దీర్ఘకాల అనావృష్టి, ప్రణాళిక లేకపోవడం, బాధ్యతారాహిత్యంగా మంచి నీటి వనరులను వాడటం ఈ దుస్థితికి కారణం కేప్టౌన్ మాదిరిగా 2040 కల్లా భారత్లో కూడా తాగునీటి కరువు రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే 16.3 కోట్లమంది భారత్లో సురక్షిత మంచి నీటిని పొందలేక పోతున్నారు. 21 శాతం అంటురోగాలు కలుషిత నీటి ద్వారానే వ్యాపిస్తున్నాయి. 2050 కల్లా 170 కోట్లకు చేరుతుందన్న భారత్ జనాభా ఒక పక్క, తరిగి పోతున్న నీటి లభ్యత మరో పక్క భారత్ను బెంబేలెత్తిస్తోంది. భారత్లో రుతుపవనాలు విఫలమైన సంవత్సరాల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రమౌతోంది. దేశంలోని 640 జిల్లాలకు 300 జిల్లాలు గత రెండు సంవత్సరాలలో వర్షభావం వల్ల తీవ్ర నీటి కొరతను ఎదుర్కొన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఉపరితల జలవనరుల తగ్గడమే కాదు భూగర్భజలాలు అడుగంటుతాయి.
పెరుగుతున్న నీటి వినియోగంతో ఆర్థిక వ్యవస్థకు చేటు
భారత్లో 60 కోట్లమంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. కానీ వీరు శాస్త్రీయ సేద్య పద్దతులు పాటించకపోవడం, నీటిని పొదుపుగా వాడుకొని గరిష్ట దిగుబడులు సాధించేలా కార్యాచరణ చేయడంలేదు. ఇది భూగర్భజల వనరుల తగ్గుదలకు ప్రధాన కారణమౌతున్నది. దీనితో పాటు ఈ మధ్య రుతుపవనాలు విఫలం కావడం నిత్యకృత్యమై నీటి కొరతకు కారణమౌతున్నాయి. మరోసమస్య పారిశ్రామిక కాలుష్యాలు, గృహవ్యర్థాలతో జలవనరులు విషతుల్యమౌతున్నాయి. ఇలాంటి పరిణామాలన్నీ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాయి.
నీటి వినియోగం భారీగా పెరుగుతున్నది
మన దేశంలో 2025 నాటికి సాగునీటికి 83.3%; ఇతర అవసరాలకు 10.2% నీటిని వినియోగించాల్సి ఉంటుంది. 2050 నాటికి గృహ విద్యుత్ పరిశ్రమలకు 20.4% నీటి అవసరాలు ఏర్పడనుండగా సాగుకు మిగిలేది 74.1% మాత్రమే మరోవైపు జనాభా వృద్దిరేటు ప్రకారం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగాలి. కానీ నీటి కొరత వల్ల ఆహారధాన్యాల దిగుమతి తప్పేలా లేదు. మనిషికి తాగడానికి రోజుకు 2 నుంచి4 లీటర్ల నీరు కావాలి. ఒక మనిషికి సరిపడే శాకాహార ఉత్పత్తికి 2 వేలనుంచి 5 వేలు లీటర్ల నీళ్ళు అలాగే 1 కిలో మాంసాహార ఉత్పత్తికి 10 వేల నుంచి 30 వేల లీటర్ల నీరు అవసరం అవుతాయి. భారత్లో ఒక కిలో బియ్యం పండించడానికి 1000 నుంచి 3000 వేల లీటర్ల నీరు వినియోగిస్తున్నారు. 2011 గణాంకాల ప్రకారం మనదేశ జనాభా 121 కోట్లు కాగా మన దేశంలో ఆహార ధాన్యాల వినియోగం 200 -250 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది 2016-17లో 272 మెట్రిక్ టన్నులు 2050కి దేశ జనాభా 164 కోట్లకు ఆహార పదార్థాల వినియోగం 450 మెట్రిక్ టన్నులకు చేరుకోనున్నది ఇలా ఆహార ఉత్పత్తితో పాటు నీటి వినియోగం భారీగా పెరుగనున్నది.
ముందు సాగునీరు, తాగునీటికి చాలా కష్టాలు
వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ లాంటి కారణాలతో వర్షపాతం తగ్గుతున్నది. దీనివల్ల భూమిలో భూఉపరితలంపై కూడా నీటి వనరుల శాతం తగ్గుతున్నది. జనాభా పెరుగుదలకు తగ్గట్టు తాగునీటి వాటాను ఒంచడం తప్పనిసరి అయినందున, వ్యవసాయానికి వినియోగించే నీటిని తగ్గించాల్సిరావడం తప్పని సరి అవుతున్నది. భారత్లో ఉపరితల నీటి వనరుల ద్వారా ఏటా 690 మిలియన్ క్యూబిక్ మీటర్లు. భూగర్భజలాల ద్వారా 433 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. 1951 లో ఒక్కో వ్యక్తికి 5,200 కిలో లీటర్ల నీటి వనరులు అందుబాటులో ఉంటే 3100 కిలో లీటర్లు ఉపయోగించుకునేవారు. పైన చెప్పిన కారణాల వల్ల 2011లో ఒక వ్యక్తికి 950 కిలో లీటర్లు మాత్రమే ఉపయోగించుకునే స్థాయికి నీటి వనరులు తగ్గాయి. ఇది 2025 నాటికి 700 లీటర్లకు 2050 నాటికి 600 లీటర్లకు పడిపోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
జల నష్టాలకు విద్యుత్ కేంద్రాలు కూడా కారణమే
అణుశక్తి సహజ వాయు ఆధారిత విద్యుత్ కేంద్రాలను చల్ల బరచేందుకు చాలా నీరు కావాలి. మన దేశంలో ధర్మల్ కేంద్రాల వల్ల విద్యుదుత్పాదన జరిగే ప్రాంతాలలో నీటి కొరత ఇబ్బందులకు గురి చేసేలా ఉంది. 90 శాతం ధర్మల్ విద్యుత్ కేంద్రాలను చల్లబరచడానికి నీటినే వినియోగిస్తున్నారు. 40 శాతం ఇలాంటి కేంద్రాల వద్ద నీటి కొరత ఉన్నదని నీవేదికలు చెబుతున్నాయి. మితిమీరిన ప్రయివేటీకరణ, సరియైన నియంత్రణ లేకపోవడంతో దేశం నీటి కొరతలోకి వేగంగా నెట్టబడుతున్నది.
సింగపూర్ ఆదర్శం
చిన్న దేశమైన సింగపూర్లో రోజువారి నీటి వినియోగం 43 కోట్లు గ్యాలన్లు అందులో 45 శాతాన్ని గృహాలు వాడుకుంటే మిగతావి పారిశ్రామిక వాణిజ్య సంస్థలు వినియోగిస్తున్నాయి. సింగపూర్కు సొంత నీటి వనరులు లేకపోవడంతో మలేసియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. నీటి విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు సింగపూర్ పలుమార్గాలు అనుసరిస్తోంది. ఒకప్పుడు సింగపూర్లో సగభాగం నదీపరివాహక ప్రాంతంగా ఉంటే 2011 నుంచి దేశంలో మూడింట రెండింతలకు అది విస్తరించింది. కురిసిన నీటిని కురిసినట్లు జలాశయాల్లో ఒడిసిపట్టి శుధ్ధి చేసి తాగడానికి ఉపయోగించుకుంటున్నారు. సముద్ర జలాలను మంచి నీరుగా మార్చి మురుగునీటి శుద్ధి ద్వారా అదనపు నీటిని సమకూర్చుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరు బాధ్యత వహించి పొదుపుగా వాడుకొంటున్నందు వల్ల తలసరి నీటి వినియోగం 2003 నాటి 165 లీటర్ల నుంచి 2017లో 143 లీటర్లకు తగ్గింది. దీన్ని 2030 కల్లా 130 లీటర్లకు తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
నీటి సంరక్షణ ఆచరణీయ మార్గాలు
1. తుంపర బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలి.
2. నీటి సంరక్షణకు భారీ ప్రాజెక్టులకన్నా చిన్న నీటి వనరులతో బహుళప్రయోజనాలు పొందవచ్చు.
3. పౌరులు నీటి వనరులను పొదుపుగా వాడుకోవడం రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు పండించడంపై దృష్టి సారించాలి. ఆధునిక వ్యవసాయ రీతుల్లో రైతులకు తర్ఫీదునివ్వాలి.
4. దిగుబడికి నీటి వినియోగానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని శాస్త్రీయంగా పరిగణనలోకి తీసుకోవాలి.
5. ఆధునిక పారిశుద్ధ్య పద్ధతుల వల్ల నీరు ఆదాఅవుతుంది. వర్షాభావ ప్రాంతాల్లో విరివిగా పవన, సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాలి. నీటికి ధర్మల్ కేంద్రాల్లా భారీగా నీరు అవసరం లేదు.
6. ఎప్పటికప్పుడు మారే భూగర్భ జల మట్టాల గురించి స్థానిక సంస్థలకు ప్రజానీకానికి వివరంగా తెలపాలి.
7. వాటర్షెడ్ని అభివృద్ధి చేయాలి. చెక్డ్యాంలు మొదలుకొని పెద్ద ప్రాజెక్టుల వరకు నీటిని నిల్వచేయడానికి విరివిగా నిర్మాణాలు చేపట్డాలి.
8. గృహ పారిశ్రామిక వ్యర్ధాల వల్ల నీరు కలుషితం కాకుండా చర్య తీసుకోవాలి.
Authorization