ఆస్ట్రేలియా జంతువు కంగారుని గమనించే ఉంటారు. అది తన శరీరం కింది భాగంలో ఉండే సంచిలాంటి నిర్మాణంలో పిల్లలను దాచుకుంటుంది. తల్లి ప్రేమను పంచడంతో పాటు బిడ్డల సంరక్షణకూ పూనుకుంటుంది. అలాగే మనిషి కూడా తమ పిల్లలను అక్కున చేర్చుకోవాలి. పొత్తిళ్లలో బిడ్డను పడుకోబెట్టుకుని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలి. కడుపులో వెచ్చని వాతావరణం నుంచి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన చిన్నారుల పరిరక్షణ పట్ల కుటుంబీకులు అత్యంత శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టి అనారోగ్య స్థితిని కలిగించే ప్రమాదాలున్నాయి.
అప్పుడే పుట్టిన పిల్లలు ఎంతో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ నవజాత శిశువులు(అప్పుడే పుట్టిన పిల్లలు) మృత్యువాత పడుతున్న సంఘటనలు మనసుని కలిచివేస్తుంటాయి. 1956 నుంచి వైద్య పరమైన సౌకర్యాలను పరిశీలిస్తే ఇప్పటికి నూరు శాతం అభివృద్ధిని సాధించాం. అయినా నాటి నుంచి నేటి వరకు నవజాత శిశు మరణాలను మాత్రం 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే తగ్గించగలిగాం.
పుట్టగానే తీసుకునే జాగ్రత్తలేంటి.?
ప్రసవం జరగ్గానే చిన్నారుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యంత కీలకమైనవి. అప్పుడే పుట్టిన పిల్లలను ఎలా సాకాలో తెలియని పరిస్థితుల్లోనే నవజాత శిశు మరణాలు సంభవిస్తుంటాయి. ఈ సమయం లో పెద్దలు చేసే తెలిసీ తెలియని పొరపాట్ల వల్లే పిల్లల ప్రాణాల మీదికి వస్తుంది. వాస్తవానికి పుట్టుకతోనే రోగాలతో పుట్టే పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పుట్టిన తర్వాత చుట్టుముట్టే రోగాలే అధికంగా ఉంటాయని కొన్ని వాస్తవాలు నిరూపిస్తున్నాయి. పిల్లల ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూనే ప్రాథమికంగా జాండీస్, ఫిట్స్ వంటివి గుర్తించడం ముఖ్యం. బేబీని ఎగ్జామిన్ చేస్తూనే తల్లి ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు తల్లి ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడిందనే అంశాలను పరిగణలోకి తీసుకుంటాం.
తల్లి అనారోగ్య సమస్యలు కూడా పుట్టిన పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. బీపీ, షుగర్లు ఉన్నాయా..? ఏవైనా ఇన్సులిన్లు వాడుతున్నారా..? అన్న అంశాల్ని గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలు సర్వసాధారణంగా 15 నుంచి 20 శాతం జన్మించిన మొదటి వారంలోపే రోగాల బారిన పడతారు. కళ్లకు పూసులు రావడం వంటివి ప్రధానంగా ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడతాయి. తల్లీ, బిడ్డలను ఉంచిన గదిలోకి బంధువులు వచ్చిపోవడం సహజంగా జరుగుతుంటుంది. చెప్పులతో లోపలికి ప్రవేశించడం, జలుబు, ఇతరత్రా అంటు వ్యాధులతో రావడం వంటి పరిణామాలు అటు తల్లితో పాటు ఇటు పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. ఇది ప్రమాదం అన్న సంగతిని కుటుంబీకులు గుర్తించాల్సి ఉంటుంది.
కడుపులో బిడ్డ వెచ్చటి వాతావరణంలో ఉంటుంది. పుట్టగానే బయటి వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతంది. అందువల్ల బిడ్డ పుట్టగానే వెచ్చటి వాతావరణాన్ని కలిగించాలి. బయటికి రాగానే చిన్నారిని శుభ్రం చేసి డ్రైగా ఉంచాలి. చేతులు, కాళ్లు చల్లబడి హార్ట్ బీట్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మొదటి 12 గంటల్లో బిడ్డ టెంపరేచర్ కాస్త తక్కువగానే ఉంటుంది. రెండు రోజుల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. తల్లి తన బిడ్డను పొత్తిళ్లలో పడుకోబెట్టుకుని 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగించేలా జాగ్రత్త తీసుకోవాలి. తల్లి కదల్లేని స్థితిలో ఉంటే బిడ్డను 'వార్నర్'లో పడుకోబెట్టాలి. బిడ్డ పుట్టగానే యూరిన్ పాస్ చేస్తే మంచిది. కనీసం 24 గంటల్లోపైనా పాస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అప్రమత్తమవ్వాల్సిందే.
బేబీ తల్లి కడుపు నుంచి బయటికి రాగానే మొదటి 30 సెకన్లలోనే తప్పనిసరిగా ఏడ్వాలి. అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఏడుపు రానిపక్షంలో బిడ్డను ఏడ్పించేందుకు వైద్యులు ఒక నిమిషం పాటు తప్పనిసరిగా ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నం 1.30 నిమిషాలు దాటిందంటే ఇంక్యుబేషన్లో ఉంచడం అనివార్యం అన్న సంగతిని గుర్తించాలి. ఐదునిమిషాల వరకూ ఏడుపు రాలేదంటే ఇక పరిస్థితి విషమించినట్లే పరిగణించాలి. అలాగే ఇంటివద్ద ప్రసవం జరిగినప్పుడు పిల్లల బొడ్డు పేగును ఏదో ఒక బ్లేడుతో కత్తిరించడం పరిపాటి. ఇది అత్యంత ప్రమాదకరం. బ్లేడుకు తుప్పు ఉండి ఉంటే అది వెంటనే ఇన్ఫెక్షన్ను కలిగించి బిడ్డ ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో స్టెరైల్ ప్రొసీజర్ను తప్పక పాటించాల్సి ఉంటుంది.
పుట్టగానే విటమిన్ 'కె'..
ప్రసవం జరిగి చిన్నారి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే ప్రతి వైద్యుడు తప్పనిసరిగా బిడ్డకు ఇచ్చే ఇంజక్షన్ విటమిన్ 'కె'. తల్లిలో ఉండే విటమిన్ 'కె' బిడ్డకు వచ్చే సరికి 30 రెట్లు తగ్గిపోతుంది. అందుకే బిడ్డకు 'కె' విటమిన్ను తొడ భాగంలో ఇంజక్షన్ ద్వారా అందిస్తాం. పుట్టిన వెంటనే చిన్నారి లివర్ ఫంక్షనింగ్లోఉండదు. లివర్ తన పని తాను చేయాలన్నా, రక్తం గడ్డకట్టే గుణం బిడ్డ శరీరంలోకి రావాలన్నా 'కె' విటమిన్ తప్పనిసరి. పూర్వం 'కె' విటమిన్ని ఇచ్చేవారు కాదు. అందుకే బ్లీడింగ్ కారణంగా మరణాలు సంభవించేవి. కడుపులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా విటమిన్ 'కె' ఇవ్వడం ద్వారా వృద్ధి చెందుతుంది.
తల్లి పాలకు మించిన పోషకాహారం లేదు..
తల్లి పాలలో అత్యధికమైన పోషకాలు ఉంటాయి. మనిషి సృష్టించలేని గొప్ప పోషకాహారం తల్లి పాలు. ఈ ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయమైన పదార్థం మరోటి లేదు. కొందరు తల్లులకు పిల్లలు పుట్టగానేపాలు రాని పక్షంలో ఆసుపత్రిలో ఉండే తోటి తల్లుల ద్వారా వైద్యుల పర్యవేక్షణలో పాలను ఇప్పిస్తాం. ఏ తల్లి పాలైనా ఒక్కటే అని దీని అర్థం. ప్రసవం జరగ్గానే వచ్చే ముర్రు పాలలో హైలెవల్ గ్లూకోజ్ ఉంటుంది. ఇందులో అత్యధిక శక్తి దాగి ఉంటుంది. ఈ పాలలో విటమిన్ 'డి', 'కె' మినహా అన్నీ సమృద్థిగా లభిస్తాయి. బిడ్డ పుట్టిన తర్వాత 36 గంటల నుంచి 96 గంటల వ్యవధిలో ముర్రు పాలు సాధారణ పాలుగా మారిపోతాయి. విదేశాల్లో హ్యూమన్ మిల్క్ బ్యాంకుల ద్వారా తల్లి పాలను విక్రయించే సంస్కృతి వచ్చింది. ఇలాంటి వ్యవస్థ మన దేశంలో కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే తల్లి పాల ప్రాధాన్యతపై తల్లికి సరైన అవగాహన ఉండాలి. వక్షోజాల ఆకృతి మారిపోతుందని, వయసు మీరినట్టు కనిపిస్తారని కొందరు పిల్లలకు పాలివ్వడం మానేస్తుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు మూర్ఖత్వమే.
పుట్టు కామెర్లతో భయపడే పని లేదు..
పుట్టుకతో పిల్లల్లో కనిపించే కొద్ది మోతాదు జాండీస్(కామెర్లు)కి భయపడాల్సిన పని లేదు. పుట్టగానే సెల్స్ వృద్ధి చెందకపోవడం వల్ల ఎంతో కొంత జాండీస్ ఉంటాయి. ఇవి 72 గంటల తర్వాత బయటపడతాయి. 24 గంటల్లోపే జాండీస్ కనిపిస్తే వాటిని 'పాథలాజికల్ జాండీస్' అంటారు. తల్లి రక్తం, బిడ్డ రక్తం వేర్వేరు కావడం, ఇన్ఫెక్షన్లు కలగడం వంటి కారణాల వల్ల ఇవి కనిపించే అవకాశం ఉంది. సాధారణంగా అప్పుడే పుట్టిన కొందరు పిల్లలకు శరీరంపై ఎర్రటి మచ్చలు మొదటి మూడు రోజుల్లో కనిపిస్తాయి. దీన్ని 'ఎరిథిమా న్యూనెటారమ్' అంటారు. వాతావరణ మార్పు, శుభ్రత లేకపోవడం వంటివి దీనికి కారణాలవుతాయి. కొందరు శుభ్రత కోసం డెటాల్ను ఉపయోగించడం కూడా ఈ పరిస్థితిని కలిగిస్తుంది. అయితే ఈ మచ్చలకు భయపడాల్సిన పని లేదు. ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే అవే తగ్గిపోతాయి.
రొమ్ము వాపు సర్వసాధారణం..
కొందరు ఆడ పిల్లలు పుట్టుకతో రొమ్ము వాపుతో పుడతారు. ఇలాంటి సమయంలో మన పూర్వీకులు వాటిని పిండి పాలు తీయాలన్న మూఢ ధోరణితో ఆలోచిస్తారు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే రొమ్ము కింది భాగంలో ఉండే సున్నితమైన స్కిన్ దెబ్బతిని ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే రెండు నెలల కాలంలో వాటంతట అవే సాధారణ స్థితికి చేరతాయి. ప్రసవం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై తల్లి పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. అనునిత్యం బిడ్డ కదలికలను గమనిస్తూనే ఉండాలి. బేబీ ఆకలి, నిద్ర సమయాలను సరైన సమయంలో గుర్తించడంతో పాటు వారికి పొత్తిళ్ళలోకి ఆప్యాయంగా తీసుకోవడం ఎంతో అవసరం.
- డాక్టర్ సిహెచ్. రాకేష్
చిల్డ్రన్స్ స్పెషలిస్ట్,
అంకుర హాస్పిటల్స్,
ఖమ్మం.
Authorization