ప్రతి ఒక్కరిని అధికంగా వేధించే సమస్య ఎసిడిటీ. ఈ సమస్యకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, వేళకు సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోవటం వలన కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఎండా కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని నుంచి ఉపశమనం పొందాలంటే.. రోజూ పాలను తాగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ తగ్గుతుంది. పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉన్న ఆమ్లాలను పీల్చుకుని గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు కొబ్బరి నీటిని తాగితే మంచిది. దీని వల్ల కడుపులో తయారయ్యే యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో చెంచా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే ఎసిడిటీ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. తేనె కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా పని చేస్తుంది. యాలకులతో చేసే కషాయం గ్యాస్ సమస్యను తగ్గించటంలో బాగా పనిచేస్తుంది. రెండు గ్లాసుల నీటిని గిన్నెలో పోసి మరగపెట్టాలి. కొన్ని యాలకులను మరుగుతున్న నీటిలో వేసి మరికొంతసేపు మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇది ఎసిడిటీని నివారిస్తుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు సమయానికి ఆహారం తీసుకోవాలి. ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎక్కువగా తాగాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు మందులు వేసుకోవాలి.