ప్రతిఏడాది ఎండాకాలంలో పగటి ఉష్టోగ్రతలు పెరిగి పోతున్నాయి. రోజంతా ఎండల్లో బయట తిరిగేవారికి ఎండదెబ్బ, డీహ్రైడేషన్ వంటి సమస్యలు రాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పొద్దున బయటికి వెళ్లే ముందు కడుపునిండా తినాలి. దీనితో పాటు ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ తాగి వెళ్లండి. దీనివల్ల మీకు కావాల్సినంత శక్తి లభిస్తుంది. రోజంతా మధ్య మధ్యలో తాగడానికి సబ్జా గింజలు, నిమ్మరసం కలిపిన పల్చటి మజ్జిగ ఒక బాటిల్... మజ్జిగ కలిపిన పలుచటి రాగి జావా ఒక బాటిల్ తీసుకుని వెళ్లండి. ఈ పానీయాలు మీకు కావాల్సినంత శక్తిని ఇస్తాయి. మజ్జిగలో ఉన్న కాల్షియం కండరాలని బలహీనపరచకుండా చూస్తుంది. నిమ్మరసంలో ఉన్న పొటాషియం, మజ్జిగలో కలిపిన ఉప్పు... చెమట ద్వారా బయటకు పోయిన లవణాలను రిప్లేస్ చేస్తాయి. సబ్జాగింజలు డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. బయటి ఆహారం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నూనె ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. ఇడ్లీ లాంటివి తీసుకుంటే మంచిది. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. టీ, కాఫీ, కూల్డ్రింక్స్కు బదులుగా తాజా పండ్లరసాలు, మజ్జిగ, గ్లూకోజ్ వాటర్, కొబ్బరినీళ్లు తీసుకోవడం ఆరోగ్యకరం. నిద్రపోయే ముందు ఐదు నానబెట్టిన బాదాంలు, నాలుగు ఖర్జూరాలు, పది నల్ల ఎండు ద్రాక్షతో పాటు ఒక కప్పు పాలు తాగితే శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే, ఎండల్లో తిరిగినా అలసిపోకుండా, అనారోగ్యం పాలు కాకుండా ఉత్సాహంగా ఉండొచ్చు.