శరీరంలోని ఇన్సులిస్ పనితీరులో వచ్చే మార్పులో మధుమేహం వస్తుంది. ఇన్సులిన్ను ప్రభావితం చేసే అంశాలపై జరుగుతున్న పరిశోధనల్లో ఉప్పు ఎక్కువగా తినే వారిలో మధుమేహం వస్తుందని స్పష్టమైంది. ఉప్పు ఎక్కువగా తినేవారికి మధుమేహం వచ్చే అవకాశం గణనీయంగా పెరుగుతున్నట్టు తేలింది. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీర బరువు పెరగటం, మధుమేహం సమస్య రావటం తెలిసిందే. అయితే చక్కెరతోనే కాదు ఉప్పుతోనూ మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు స్టాక్హౌమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో స్పష్టమైంది. ఉప్పు ద్వారా లభించే సోడియాన్ని తక్కువగా తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు 1.25స్పూన్లు( 2,800 మిల్లీగ్రాములు), అంతకన్నా ఎక్కువగా తీసుకునేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 72శాతం ఎక్కువగా ఉందని స్పష్టమైంది. ఉప్పు కారణంగా ఇన్సులిన్ హార్మోన్ పనితీరులో మార్పు వస్తుందని, ఈ హార్మోన్ ప్రభావం శరీర కణాలపై తగ్గుతుందని వెల్లడైంది. ఈ కారణంగానే మధుమేహం వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉప్పు అధికంగా తినటం వల్ల రక్తపోటు, బరువు కూడా పెరుగుతాయి. ఇవీ మధుమేహానికి దారితీసేవే. అధిక రక్తపోటు మధుమేహం రెండూ జంట శత్రువులు. సాధారణంగా చాలామందిలో ఇవి రెండూ కలిసే కనబడుతుంటాయి. ఇక అధిక బరువు గలవారిలో రక్తంలో గ్లూకోజు స్థాయులు సరిగా నియంత్రణలో ఉండవు. ఇది మధుమేహం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు 1,500 మిల్లీగ్రాముల సోడియం మించకుండా చూసుకోవటం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2,300 మి.గ్రా.లకు మించరాదు. పచ్చళ్లు, చిరుతిళ్ల వంటి వాటిల్లో ఉండే ఉప్పు కూడా లెక్కలోకి తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకోవడం తగ్గించుకోవాలి. నెమ్మదిగా ఉప్పు వాడకం తగ్గించుకుంటే నాలుక మీది రుచి మొగ్గలు కూడా తక్కువ ఉప్పుకు అలవాటు పడతాయి. దీంతో మధుమేహాన్ని మాత్రమే కాదు.. ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.