మనం తీసుకునే ఆహారం ఎన్నో పోషకాల సమ్మేళనం. ఇందులో సూక్ష్మస్థాయిలో లభించే ఖనిజాలతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావల్సిన వాటిలో ఏ సూక్ష్మ మూలకం తగ్గినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వాటిలో పొటాషియం ఎందుకు ఉపయోగపడుతుంది.. ఇది తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. ఖనిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్పడుతుంది. నాడులను, కండరాలను నియంత్రించటం దగ్గర్నుంచి.. ఆహారం జీర్ణం కావటం వరకూ ఎన్నో రకాల శరీర క్రియల్లో ఇది ఉపయోగపడుతుంది. అందుకే పొటాషియం లోపిస్తే కండరాలు పట్టేయటం, గుండె కొట్టుకునే వేగం మారిపోవటం, చర్మం పొడిబారటం, మొటిమలు, అజీర్ణం వంటి సమస్యలెన్నో ముంచు కొస్తాయి. గుండె, కండరాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పొటాషియం పొట్టుతీయని ధాన్యాలు, మాంసం, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అరటిపండు, చిలగడదుంపలతో పుష్కలంగా లభిస్తుంది. పండ్లు, కూరగాయలు తక్కువగా తింటూ చిప్స్ వంటి చిరుతిళ్లు ఎక్కువగా తినేవారిలో పొటాషియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది.