ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న క్యాన్సర్ సంబంధ మరణాల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వాటా ఐదోవంతు ఉంది. ఈ రెండు రకాల క్యాన్సర్లను గుర్తించేందుకు సరికొత్త విధానాన్ని భారత పరిశోధకులు కనుగొన్నారు. ఐఐటీ- రూర్కీలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన కిరణ్ అంబటిపూడి నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం రక్త నమూనాలను సేకరించి రొమ్ము, అండాశయ క్యాన్సర్లను గుర్తిస్తున్నారు. అయితే క్యాన్సర్ సోకిన వారిలో లాలాజలంలోని కొన్నిరకాల ప్రొటీన్లను ఐఐటీ బృందం గుర్తించింది. అవి రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వ్యాప్తిని తెలియజేస్తున్నాయని వారు వివరించారు. రొమ్ము, అండాశయ క్యాన్సర్ నాలుగో దశలో ఉండి మూడు సైకిళ్ల మేర కీమోథెరపి చేయించుకున్న రోగుల లాలాజల నమూనాలను ఆరోగ్యవంతుల లాలాజలంతో పోల్చి చూసి, ఈ విషయాన్ని నిర్ధరించారు. క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన లాలాజలాన్ని పరీక్షించినప్పుడు అందులో కొన్ని రకాల ప్రొటీన్ల ఉనికి తెలిసిందని, వాటి మోతాదును బట్టి క్యాన్సర్ తగ్గుదలను తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరిగితే భవిష్యత్లో లాలాజలం పరీక్ష ద్వారా ఈ రెండు రకాల క్యాన్సర్లను గుర్తించడం సాధ్యమవుతుందని ఆశిద్దాం.