మనం తీసుకునే ఆహారం గురించి చాలామందిలో సందేహలు ఉంటాయి. వాటిలోని నిజానిజాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడం మంచిది. ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయి అంటుంటారు. ఇందులో వాస్తవం ఏమిటో తెలుసుకుందాం. నిజానికి పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు రావు. కానీ రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఒక్సాలేట్స్ వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. సరైన మోతాదులో నీటి పదార్థాలు తీసుకోనివారు, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇలాంటివారు వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆహారంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరల్లో ఉన్న పోషకాలు పూర్తిగా అందాలంటే వాటిని వండే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకుకూరను కట్చేయకముందే ఐదు నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచాలి. ఆ తర్వాత మంచినీటిలో మూడుసార్లు కడగాలి. దీని వల్ల ఆకు కూరలపై ఉన్న రసాయన అవశేషాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత కట్ చేయాలి. ఆకుకూరలు వండేటప్పుడు నీళ్లు పోయవద్దు. అందులో ఉన్న నీటితోనే కూర మగ్గుతుంది. ఇలా వండుకున్న ఆకుకూరల్లో అన్ని పోషకాలు ఉంటాయి. ఉడికించి నీళ్లు పారబోస్తే చాలా విటమిన్లు పోతాయి.