ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట 'గుండెకు స్టెంట్ వేశారు' గుండె పోటు బారిన పడిన వారిలలో ఎక్కువ మందికి స్టెంట్ అమర్చుతున్నారు. స్టెంట్ అమర్చటమనేది గుండెకు రక్తసరఫరా మెరుగుపడటానికి చేసే చికిత్స. గుండెలో రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. గుండె సజావుగా పనిచేయటానికి తోడ్పడుతుంది. స్టెంట్ వేయడం వల్ల సమస్య కుదురుకుంటుంది. అయితే గుండె రక్తనాళాల్లో మరోచోట అడ్డంకులు లేదా పూడిక ఏర్పడే ప్రమాదాన్ని ఇది తగ్గించదు. 'స్టెంట్ వేసిన తర్వాత సమస్య పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటూ కొందరు మందులు వేసుకోవటం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. క్రమం తప్పకుండా డాక్టర్ సూచింనంత కాలం మందులు వేసుకోవటం చాలా ముఖ్యం. ఇవి స్టెంట్ బాగా పనిచేయటానికి, కొత్తగా వేరేచోట పూడికలు ఏర్పడకుండా ఉండటానికి తోడ్పడతాయి. మందులను మానేస్తే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి గుండెపోటు వంటి ముప్పులు ముంచుకురావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు మానెయ్యరాదు. మధుమేహం ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మధుమేహుల్లో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, హైబీపీ కూడా ఉండే అవకాశముంది. కాబట్టి ఆహారంలో కొవ్వులు, ఉప్పు తగ్గించుకోవటం మంచిది. బాగా పాలిష్ పట్టిన పదార్థాలతో చేసి మార్కెట్లో అమ్మే ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. వీటిల్లో ఉప్పు, చక్కెర, ట్రాన్స్ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు, గ్లూకోజు పెరిగేలా చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరింత ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. రక్తంలో గ్లూకోజు స్థాయ అదుపులో ఉంటే గుండె పనితీరు మెరుగవుతుంది. ఆరు నెలలకు ఒకసారైనా డాక్టర్ను సంప్రదించి... రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయి, బీపీ పరీక్షించుకోవాలి.