ప్రపంచ తలసేమియా అవగాహనా దినోత్సవం
మన శరీరానికి సరిపోయే స్థాయిలో రక్తం లేకపోతే నీరసం వస్తుంది. బలహీనత ఆవహిస్తుంది. శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే రక్తం అవసరం. రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు వీటిలో ఏ ఒక్కటి సమాన స్థాయిల్లో లేకపోయినా ఆరోగ్యం క్షీణిస్తుంది. రక్తంలోని ఎర్ర కణాలు తగ్గిపోతుండడం, అవసరమైనంత రక్తం ఉత్పత్తి కాకపోవడమే తలసేమియా. జన్యుపరంగా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా కోట్లాది మంది బాధపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య కోట్లల్లో ఉంది. మనదేశ జనాభాలో దాదాపు పదిహేను శాతం మంది ఈ వ్యాధిబారిన పడ్డారు. వారిలో పిల్లలే అధికంగా ఉంటున్నారు. సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) లెక్కల ప్రకారం ఆసియా, మధ్య తూర్పు, ఆఫ్రికా, మధ్యధరా దేశాలైన గ్రీసు, టర్కీ ప్రజలకు తలసేమియా ఎక్కువగా సంక్రమిస్తోంది.
తల్లిదండ్రులనుంచే
జన్యుపరంగా సక్రమించే తలసేమియా తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి తలసేమియా లక్షణాలున్నా అది పిల్లలకు సంక్రమిస్తుంది. జన్యు పరివర్తన సరిగా లేకపోవడం, జన్యు కణాలు తగ్గిపోవడం వల్ల గానీ తలసేమియా వస్తుంది. ఈ వ్యాధి సోకడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. శరీరంలోని ఎర్ర రక్త కణాలకు హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్ అందుతుంది. ఇది తగినంతగా ేకపోవడంతో రక్తానికి ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది.
కారణాలు..
ఈ వ్యాధికి జన్యుపరమైన లోపాలే కారణం. పెండ్లికి ముందుగానే రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. గర్భిణులు సీవీసీ శాంప్లింగ్ పరీక్షలు చేయించుకుంటే శిశువుకు తలసేమియా ఉందా లేదా? అన్న విషయం తెలుస్తుంది. హెచ్బీ, ఎ2 స్థాయి రక్త పరీక్షలు చేయించుకోవాలి.హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫొరెసిస్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.
తలసేమియా వ్యాధి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. దీన్ని ఆల్ఫా తలసేమియా, బీటా తలసేమియా. ఈ రెండింటిలోనూ విభిన్న రకాలు ఉన్నాయి. ఇవి ఆయా శరీరాలలోని రక్తకణాల నిర్మాణాలను బట్టి వాటి లోపాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఏర్పడవచ్చు. ఈ తలసేమియా సోకిన కూడా రోగికి ఏమి తెలియకపోవచ్చు. కొద్దిగా సోకిన వారికి చాలా కాలం దాకా తెలియక పోవచ్చు. కానీ మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయిలో ఉన్న వారికి మాత్రంకొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మనిషిలో రక్తం క్షీణించిపోవడం, కాలేయం పెరిగిపోవడం, ప్లీహం (పి త్తాశయం) పెరిగిపోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవ డం, చిన్న పిల్లలైయితే ఎదుగకపోవడం, ఎముకలు వెలుసుగా సన్నగ తేలికగా విరిగిపోయేటట్లు తయారు కావ డం, గుండె జబ్బులు రావడం వంటివి జరుగుతాయి. వీటిలో బీటా తలసేమియా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇది సోకినప్పుడు రోగులకు తరచుగా రక్తాన్ని ఎక్కిస్తుండాలి.
ఆల్ఫా తలసేమియా
ఇది రెండు రకాలుగా ఉంటుంది. వాటిని హిమోగ్లోబిన్ హెచ్, హైడ్రాప్స్ ఫెటలిస్ (అవయవాల్లో ఎదుగుదల లేకపోవడం)గా చెప్పవచ్చు. హిమోగ్లోబిన్ హెచ్ వల్ల ఎముకల సంబంధింత సమస్యలు వస్తాయి. నుదురు, దవడల వద్ద ఎముకలు పెద్దగా ఉంటాయి. బుగ్గలు పెరుగుతుంటాయి. కామెర్లు సోకి చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. అలాగే కళ్లలోని నల్ల గుడ్డు పెద్దగా కనిపిస్తుంది. రోగులు సరిగా ఆహారాన్ని తీసుకోలేరు.
హైడ్రాప్స్ తలసేమియా శిశువు జన్మించడానికి ముందు సంక్రమిస్తుంది. ఇది సోకిన శిశువులు చాలావరకు కడుపులోనే, కొందరు శిశువులు పుట్టిన కొద్దిరోజులకే చనిపోతారు. కొంతమంది గర్భంలోనే చనిపోతారు.
బీటా తలసేమియా
బీటా గ్లోబిన్ జన్యువులు ప్రభావితం అవుతాయి. కాబట్టి దీనిన బీటా తలసేమియాగా పిలుస్తారు. ఇది మేజర్ తలసేమియా (కూలేస్ ఎనిమియా) లేక తలసేమియా ఇంటర్మీడియా అని రెండు రకాలుగా ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వయస్సు రావడానికి ముందే మేజర్ తలసేమియా లక్షణాలు బయటపడతాయి. దీనివల్ల వారి ప్రాణానికి ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లక్షణాలు కనిపించగానే..
మేజర్ తలసేమియా సోకినప్పుడు ప్రధానంగా ఆరు లక్షణాలు బయటపడతాయి. వాటిని గమనించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.ముఖం పీక్కుపోయి ముడతలు పడినట్టుగా ఉంటుంది. పిల్లలు పాలిపోయినట్టుగా ఉంటారు. శరీర రంగులోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి.తరచుగా రోగాలు వస్తుంటాయి.ఆకలి సరిగా ఉండదు. ఎదుగుదల కనిపించదు. కామెర్లు సోకి చర్మం పసుపు రంగులోకి మారుతుంది. లేకపోతే కళ్లలోని తెల్ల గుడ్డు పసుపుగా కనిపిస్తుంది.
చికిత్స..
తలసేమియా వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి తరచుగా రక్తాన్ని ఎక్కిస్తుండాలి. కొంతమందికి ప్రతి ఇరవైఒక్క రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాలి. ఎముకల్లో ఉన్న ఉన్న కణాలను మార్పిడి చేసి వ్యాధిని నివారించవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో 'బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్' అని అంటారు. తలసేమియా ఉన్న రోగులందరికీ ఇది చేయడం సాధ్యం కాదు. రక్తం ఎక్కించిన రోగుల్లో ఐరన్ సాధారణ స్థాయికి మించి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి రోగులకు 'ఐరన్ కేలేషన్ థెరపీ' అవసరం అవుతుంది. ఈ థెరపీని ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో అదనంగా ఉన్న ఐరన్ కణాలను ఇది బయటకు పంపుతుంది.
రక్తం అత్యవసరం..
ఈ వ్యాధి సోకిన వారికి రక్తం ఎక్కించడం తప్పనిసరి. ఇలాంటి వారికి సహాయం చేయడానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. లయన్స్ క్లబ్ కూడా మానవతాదృష్టితో వీరికి ఉచితంగా రక్తం అందిస్తుంది.
- తలసేమియాను ముందస్తుగా గుర్తించినట్లయితే వ్యాధిని అదుపు లో ఉంచవచ్చు. ముఖ్యం గా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది. ఆయా ప్రాంతాల్లో ఉండేవారు ఈ వ్యాధి బారిన పడినవారిలో ఎక్కువ మంది ఉండడం కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు రక్త పరీక్షలు నిర్వహించుకోవాలి.
- పెద్ద పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించిన వెంటనే నాలుగు సార్లు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇప్పించాలి.
- వాటితో పాటు వ్యాధి నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్న అన్ని వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి.
- ప్రతి మూడు, నాలుగు వారాలకోసారి రక్తం ఎక్కించాలి. అది కూడా సెలైన్ వాష్డ్ ప్యాక్డ్ రెడ్సెల్ బ్లడ్, ప్రత్యేకంగా శుద్ధి చేసిన ఎర్రరక్తకణాలు గల రక్తాన్ని ఎక్కించాలి.
- శరీరంలో ఎప్పుడూ హిమోగ్లోబిన్ 9 గ్రాములు ఉండే విధంగా చూడాలి. కొత్తగా రక్తం ఎక్కించినప్పుడు 12 గ్రాములు ఉండే విధంగా చూడాలి.
- రక్తమార్పిడి కన్నా ముందు హెచ్బి 8 గ్రాములు శాతం తగ్గకుండా చూసుకుంటూ దానితో పాటు ఐరన్ కేలేషన్ థెరపీ తీసుకుంటూ సాధారణ జీవిత కాలం ఉండవచ్చును.
- తలసేమియా వ్యాధి ఉన్న వారికి మాంసకృత్తులు (ప్రోటీన్లు) కేలరీలు ఎక్కువగా ఐరన్ తక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి.
- పాల ఉత్పత్తులు, గ్రుడ్డులో తెలుపు, టీ, పప్పులు, నారింజలు, బత్తాయిలు, జామపండ్లు తీసుకోవాలి.
- ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దు
Authorization