గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలు ఉన్నాయి. భూతాపం ప్రభావంతో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయే తప్ప, తగ్గే అవకాశం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరం తన లోపలి వేడిని బయటకు తోస్తుంది. ఈ ప్రక్రియలో శరీరం ఎక్కువ శాతం రక్త ప్రవాహాన్ని చర్మానికి పంపిస్తుంది. అప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత చెమట రూపంలో బయటకు వస్తుంది. ఈ చెమట ఆవిరి అవ్వడంతో దేహం చల్లబడుతుంది.
- మనశరీర సాధారణ ఉష్ణోగ్రత 37-38డిగ్రీలు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రకారం మానవ శరీరానికి చుట్టూ గాలి ఉష్ణోగ్రత 18- 24డిగ్రీలు ఉంటే మంచిది.
- వాతావరణం ఒక్కసారి 39-43డిగ్రీలకు చేరిన వెంటనే కండరాలకు వేగం తగ్గించమని మనిషి మెదడు సందేశం పంపిస్తుంది, వెంటనే అలసట పెరుగుతుంది.
- ఎప్పుడైతే ఉష్ణోగ్రత 41C దాటుతుందో, శరీరంలో కీలక మార్పులు జరుగుతాయి.
శరీరంలోని రసాయన చర్యలు ప్రభావితం అవ్వడంతో పాటు ముఖ్యమైన కణాలు క్షీణించటం మొదలై కొన్నిసార్లు అవయవ వైఫల్యానికి దారితీస్తుంది.
చర్మానికి రక్తం చేరడం కష్టం అవ్వడం వల్ల చెమటలు పట్టడం కూడా ఆగిపోతుంది. దీంతో శరీరం చల్లబడిపోయి, మొద్దుబారిపోతుంది.
40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన తరువాత ఎప్పుడైనా వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలిన వారికి తక్షణం వైద్య సేవలు అందించాలి. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు.
జాగ్రత్తలు:
- ఎక్కువ మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం.
- శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాలు అసలు చెయ్యకూడదు.
- తేలికైన దుస్తులు, లేత రంగు దుస్తులు వేసుకోవాలి.
- అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చల్లని ప్రదేశంలో, నీడలో కూర్చోవాలి.
- ''పగలు రాత్రి తేడా లేకుండా ఉంటున్న ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి చల్లబడే అవకాశం దొరకదు. ఇటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్న ఎదో ఒక చల్లని ప్రాంతానికి చేరుకోవాలి. అది ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) కావచ్చు, చల్లని గాలి వీచే ప్రాంతం కావచ్చు'' అని 'శరీరం మీద వేడి ప్రభావం' అనే అంశంపై పరిశోధనలు చేసిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రొఫెసర్ వర్జీనియా ముర్రే అంటున్నారు.
- ఎండదెబ్బ తగిలితే తక్షణమే చేరువలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాలి.
- వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని నీటితో ముఖం, కాళ్ళుచేతులు కడగాలి, చంకలలో ఐస్ ప్యాక్ను పెట్టాలి. కీలకమైన శరీర భాగాలు చల్లబడతాయి.
- ''గాలిలోని ఉక్కపోత మన దేహం చెమట సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది'' అని లోవ్బోరొ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జార్జ్ హవినిత్ అంటున్నారు.
చెమట వల్ల కోల్పోయిన లవణాలను కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తీసుకోవడం ద్వారా భర్తీ చేసుకోవాలి.
Authorization