కొందరు ఎప్పుడు చూసినా నీరసంగా కనిపిస్తుంటారు. భూమి భారమంతా తమ నెత్తిననే మోస్తున్నట్లు నిస్సత్తువగా ఉంటారు. ఆహారంలో తీసుకోవడం బాగానే ఉన్నా వారిలో నీరసం మాత్రం తగ్గదు. ఇందుకు కారణం కొన్ని రకాల విటమిన్స్ లోపించడమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. అనేక అధ్యాయనాల ఫలితంగా కొద్దిపాటి పనులకే నీరసం, నిస్సత్తువగా అనిపించే అయ్యేవారిలో విటమిన్ బి12, విటమిన్ డి లోపం ఉంటుందని స్పష్టమైంది. విటమిన్ బి12: ఇది లోపిస్తే రక్తహీనత వస్తుంది. దాంతో నీరసంగా అనిపిస్తుంది. ఏ పనిచేయాలన్నా ఆసక్తి ఉండదు. చిన్నచిన్న పనులకే అలసిపోతుంటారు. కొద్ది దూరం నడవగానే నీరసం వస్తుంది. ఇలాంటివారి విటమిన్ బి12 ప్రధానంగా ఉండే మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ బి 12 లోపించడానికి మరోకారణం వయసు పెరుగుతున్నకొద్దీ మన శరీరం విటమిన్ బి12ను గ్రహించుకోవటమూ తగ్గుతుంది. పేగుల్లో పూత వంటి సమస్యలతోనూ ఈ సామర్థ్యం తగ్గుముఖం పడుతుంది. ఆహార అలవాట్ల మూలంగా లోపం తలెత్తితే- వాటిని మార్చుకోవటం, బి12 మాత్రలు తీసుకోవటం మేలు. ఇతరత్రా కారణాలతో లోపిస్తే- బి12 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ డి: ఇది లోపిస్తే ఎముకల, కండరాల పటుత్వం తగ్గి.. నీరసానికి దారితీస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు మన శరీరమే దీన్ని తయారుచేసుకుంటుంది. కాబట్టి రోజూ చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. టూనా, సాల్మన్ వంటి చేపలతోనూ ఇది లభిస్తుంది. ప్రస్తుతం విటమిన్ డిని కలిపిన పాలు, పళ్ల రసాలు, అల్పాహార త ణధాన్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. అవసరమైతే విటమిన్ డి మాత్రలూ వేసుకోవచ్చు.