ప్రతి ఏటా ఆగస్టు మొదటివారాన్ని తల్లిపాల వారోత్సవంగా నిర్వహిస్తాం. ప్రకృతిలో ఎంతో సహజమైన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేకించి ఈ ఉత్సవాలు ఎందుకని చాలా మందికి అనుమానం రావచ్చు. కానీ నాగరికత పెరిగి కొద్దీ, ప్రపంచీకరణ ప్రభావంతో, ప్రచార సాధనాల ప్రోద్భలంతో పోతపాలను, దబా పొలను ప్రోత్సహించే వ్యాపార దృష్టి పెల్లుబుకుతోంది, దాని వల్ల పిల్లలకి ఎంతో నష్టం జరుగుతోంది, అందుకే తల్లి పాలు చేసే మేలు గురించి పదేపదే గుర్తుచేసుకోవలసి వస్తోంది. శిశువుల ప్రాణరక్షణ విధానాల్లో తల్లిపాలని ప్రోత్సహించడం ఒక విధానం. ఎందుకంటే శిశు మరణాలని నియంత్రించడానికి అదొక మేలైన సాధనం. ఈ సందర్భంగా మరోసారి అమ్మ పాల గురించి ఉన్న అపోహలు తొలగిస్తూ, తల్లి పాల విశిష్టత గురించి..
తల్లిపాలు పాపాయికి ఎప్పుడు ఇవ్వాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. తేలిక కాన్పు అయితే అరగంటలో పాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. సిజేరియన్ కాన్పు అయితే నర్సు సహాయంతో రెండు గంటల తర్వాత పాలు ఇవ్వాలి. పాపాయి పాలు చీకటం వల్ల తల్లి మెదడుకి తగిన సంకేతాలు అంది పాలు తేలిగ్గా విడుదలవుతాయి. అంతేకాక, పాపాయికి ముర్రుపాలు అందుతాయి. ఈ పాలలో రోగనిరోధకశక్తి పుష్కలంగా ఉంటుంది. అలర్టీని అరికట్టే అనేక పదార్థాలు అమ్మపాలలో ఉంటాయి. అంతేకాక, ఈ ప్రక్రియ వల్ల విడుదలయ్యే హార్మోన్లు తల్లి పేగు ముడుచుకోవడానికి తోడ్పడతాయి. దీనితో గర్భసంచి యధాస్థితికి చేరుకుని, రక్తస్రావాన్ని నియంత్రించగలుగుతుంది. కాన్పు తర్వాత వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. పైగా, త్వరగా పాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డల మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది.
మొదటి ఆరునెలలు..
పాపాయి పుట్టిన తర్వాత మొదటి ఆరునెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలి. పోతపాలు గాని, . తేనెగాని, గూకోజు నీళ్ళు గాని, పళ్ళ రసాలు గానీ ఇవ్వకూడదు. ఆరు నెలలు నిండాక, రెండేండ్ల వరకు తల్లిపాలతో పాటు ఉగ్గు మొదలు పెట్టాలి. అప్పటికీ ఘనాహారం అరిగించుకునే విధంగా జీర్ణాశయం పరిపక్వమవు తుంది. తొందరపడి ఆరునెలల ముందే ఘనాహారం పెట్టినా, పోతపాలు పట్టినా అరుగుదల దెబ్బతిని, రకరకాల వ్యాధులు సంభవించే అవకాశం పెరుగుతుంది. అందుకే ఆరునెలలు నిండేవరకు తల్లిపాలు తప్ప ఏమీ ఇవ్వకూడదు. రెండేండ్ల వరకు ఇతర ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వాలి.
పాలు సరిపోకపోతే ..
కోటిమందిలో ఒకరికి తప్ప తల్లి పాలు చాలకపోవడం అనేది ఉండదు. తన పాలే బిడ్డకు ఇవ్వాలని తల్లి గట్టిగా అనుకుంటే, ఆమెకి తగిన ప్రోత్సహం ఉంటే, ఆమె మెదడుకు అనుకూలమైన సంకేతాలు అందుతాయి. పాలువృద్ధి చెందుతాయి. బిడ్డను తలుచుకోగానే పాలు ఉప్పొంగడమే ఇందుకు నిదర్శనం.ఇంట్లోవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆమె సంకల్పానికి ఆటంకం కలిగించే విధంగా మాట్లాడ కూడదు. 'అయ్యో పాలు సరిపోలేదు'. 'నీ పాలు చాలవు' అనేమాటలు ఎవరూ అనకూడదు. ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప పోతపాలు ఇవ్వకూడదు. ఒకవేళ పోతపాలు ఇచ్చినా, ఉగ్గు గిన్నెతోనో, చెంచాతోనో ఇవ్వాలే కాని, సీసాని, పాలపీకని వాడకూడదు.
పాలు సరిపోతున్నాయో, లేదో...
పాలు తాగాక బిడ్డ రెండు, మూడు గంటలు హాయిగా నిద్రపోతే, 2-3 గంటలకి ఒకసారి మూత్రం పోస్తే, హాయిగా ఆడుకుంటూ ఉంటే, క్రమక్రమంగా బరువు పెరుగుతుంటే పాలు సరిపోతున్నాయని అర్ధం. పాలు తాగాక ఏడుస్తుంటే పాలు సరిపోలేదని అర్థం. బిడ్డ ఏడుపుకి ఎన్నో అర్థాలు ఉంటాయి. ఆకలి వేయడం, అసౌర్యం కలగడం వల్ల కూడా పాపాయి ఏడుస్తుంది. పాలు పట్టిన తర్వాత కూడా ఏడుస్తుంటే కారణాలు తెలుసుకోవాలి.
అమ్మ పాలతో..
తల్లి పాలని 'స్పీడీస్ స్పెసిఫిక్' అని, 'బేబీ స్పెసిఫిక్' అని అంటాం. అంటే, ఏ జాతి పాలు ఆ జాతికే మేలు చేస్తాయి. గేదెపాలు గేదె దూడకి, ఆవుపాలు ఆవు దూడకి, మేకపాలు మేకపిల్లకి మేలు చేస్తాయి. వాటి ఎదుగుదలకి దోహదపడతాయి. అలాగే, తల్లిపాలే బిడ్డకి మేలు చేస్తాయి. అందులో కూడా ఏ తల్లి పాలు ఆ బిడ్డకే మేలు చేస్తాయి. ఎందుకంటే, నెలలు నిండకుండా పుట్టే పిల్లల తల్లి పాలలో కొవ్వు మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. నెలలు నిండిన పిల్లల తల్లి పాలలో ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఏ బిడ్డకి అవసరమైన పాలు ఆ తల్లి ఉత్పత్తి చేయగల శక్తి ప్రకృతి ఇచ్చిన వరం. ఆ వరాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే పిల్లలకి ఎంతో మేలు. తల్లిపాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అవి పిల్లలని ఎలర్టీల నుంచి రక్షిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకనే వాటిని 'మొదటి టీకా' అంటాం, తల్లిపాలని తేలిగ్గా బిడ్డకు అందించవచ్చు. అవి పరిశుభ్రంగా ఉంటాయి. ఎలాంటి ఖర్చు ఉండదు. నీళ్ళ విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నించి బిడ్డల్ని రక్షిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లల తెలివితేటలు బాగా పెరుగుతాయి.
అమ్మలకు ఆరోగ్యం..
బిడ్డకు పాలిచ్చే అమ్మల్లో వయసు పెరిగే కొద్దీ వచ్చే డయాబెటిస్, స్థూలకాయం, ఉబ్బసం, ఉదరకోశ వ్యాధులు, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు నుంచి రక్షణ లభిస్తుంది. తల్లిలో హార్మోను సమపాళ్లలో విడుదల కావడం వల్ల గర్భసంచి తేలిగ్గా కుచించుకుని రక్తస్రావం నిలువరిస్తుంది. సహజంగా గర్భనిరోధక శక్తి ఏర్పడుతుంది.ముందు ముందు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిక్, కీళ్ళ నొప్పులు, ఎముకల ఆరుగుదల మొదలైన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
పాలిచ్చిన తర్వాత..
పిల్లలు పాలు తాగుతూ కొద్దిగా గాలి కూడా మింగుతారు. ఆ గాలి కడుపులోనే ఉండిపోతే కడుపునొప్పి వస్తుంది. అందుకని పాలిచ్చిన ప్రతిసారి బిడ్డని భుజం మీద వేసుకుని వెన్నుతటితే ఆ గాలి తేన్పు రూపంలో బయటికి పోతుంది.
పాలు సమృద్ధిగా రావాలంటే..
చాలామంది తల్లులు బిడ్డకు పాలివ్వకపోవడానికి కారణం ఆమెలో జంకు. 'నా పాలు చాలవేమో!' అన్న భయం. తల్లి ఆందోళన చెందితే పాలు తగ్గిపోతాయి. అందుకనే ముందుగా తల్లిలో విశ్వాసాన్ని పెంచాలి. 'రెండేండ్ల వరకు నువ్వు నీ బిడ్డకి తప్పకుండా పాలు ఇవ్వగలవు''అని గట్టిగా చెప్పాలి. తల్లికి నిద్రచాలక, పని ఒత్తిడి వల్ల అలసటగా ఉంటే కూడా పాలు తగ్గిపోతాయి. తల్లికి ఆహారం చాలకపోతే కూడా ఈ సమస్య వస్తుంది. కాన్పు తర్వాత కొందరు తల్లులు మానసిక అనారోగ్యానికి, డిప్రెషన్ కి గురవుతారు. అప్పుడు పాలు సరిగా ఇవ్వలేదు రొమ్ము వాచినా, చనుమొన పగుళ్ళు ఏర్పడినా పాలు ఇవ్వలేరు. చనుమొనలు లోపలికి పోయినా పాల్విడం కష్టమే. పాలు సమృద్ధిగా రావాలంటే తల్లికి మంచి ఆహారం ఇవ్వాలి. ఆమె ప్రశాంతంగా ఉండేలా చూడాలి.
పాలు పట్టే విధానం..
పాలు పట్టే విధానం సరిగా ఉంటేనే బిడ్డ పాలు సరిగా తాగగలుగుతుంది. బిడ్డతలని కొంచెం ఎత్తుగా ఉంచి, బిడ్డ శరీరం మొత్తాన్ని తల్లి చేతి మీద ఉంచే పట్టుకోవాలి. చనుమొన కాక దాని వెనుక ఉన్న నల్లభాగం బిడ్డ నోటికి అందాలి. అక్కడే పాల వాహికలు పాలని విడుదల చేస్తాం. చనుమొన మాత్రమే అందితే పాలు సరిగా రావు. పైగా, మొనల మీద పగుళ్ళు ఏర్పడి నొప్పి కలుగుతుంది. దీని వల్ల పాలు ఇవ్వలేక రొమ్ము వాయడం, చీము పట్టడం వంటి చికాకులు సంభవిస్తాయి.
బిడ్డ సరైన ఎదుగుదల..
తల్లి పాలతో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. మొదటి నెలలో వారానికి 200గ్రాముల చొప్పున తర్వాత ఆరు నెలల వరకు ప్రతి నెల కిలో చొప్పున, ఏడాది వరకు నెలకి అరకిలో చొప్పున పెరిగితే మంచిది. తల్లి నుంచి ముందు వచ్చే నీళ్ళ పాలలో పోషకాలు, వెనక వచ్చే పాలలో కొవ్వు శాతం ఎక్వువ ఉంటాయి. అందుకని ఒక రొమ్ము పూర్తిగా అయ్యాకనే రెండో రొమ్ము నుంచి పాలివ్వాలి.
తల్లి పాలు ఇవ్వకూడని సందర్భాలు..
తల్లికి మానసిక వ్యాధులు ఉంటే, హెచ్ ఐ వి, క్యాన్సర్, థైరాయిడ్, కీళ్ళ నొప్పుల మందులు వాడుతుంటే పాలు ఇవ్వకూడదు.
ఉద్యోగం చేసి తల్లులు...
తల్లి బయటికి వెళ్ళే ముందు పాలు ఇచ్చి తర్వాత అవసరమైన పాలని ఒక శుభ్రమైన చిన్న స్టీలు డబ్బాలోకి పిండి ఇంట్లో ఇవ్వాలి. ఈ పాలు ఆరు గంటల వరకు నిలువ ఉంటాయి. ఫ్రిజ్లో అయితే 24గంటల నిలువ ఉంటాయి. పాలు పిండే విధానాన్ని ఆరోగ్య కార్యకర్తల దగ్గర నేర్చుకోవాలి. ఆ పాలు విరిగినట్లు కనిపించినా వాటిని బాగా కదిపి మళ్ళీ వాడవచ్చు.
Authorization