ఇటీవల కాలంలో మధుమేహం, అధిక రక్తపోటు అనేవి సాధారణ సమస్యలుగా మారాలి. వీటి కోసం రోజూ మందులు వేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నవారికే కాదు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారందరికీ మేలు చేసే అనేక పదార్థాలు మన వంటింట్లోనే ఉంటాయి. వాటిలో ఒకటి మెంతులు. సర్వ ఆరోగ్య ప్రదాయిగా మెంతులను చెప్పవచ్చు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు రావడానికి కారణం శరీరంలో కొలెస్ట్రాల్ అతిగా పెరగడం. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం అనేక రుగ్మతలకు కూడా దారితీస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్, హైదరాబాద్) చేసిన ఒక పరిశోధనలో స్పష్టమైంది. మధుమేహం, రక్తపోటు అదుపులో ఉండేందుకు వేసుకునే మందులతో పాటు మెంతులు కూడా ఇస్తే రోగికి మరింత ఆసరా ఉంటుంది.
మెంతుల్లో పీచు (ఫైబర్) పదార్ధం ఎక్కువగా అంటే దాదాపు యాభై శాతం వరకు ఉంటుంది. ఈ కారణంగా ఇది రక్తం,మూత్రంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా కావడం వల్ల వచ్చే గుండె జబ్బులకు ఇది మంచి ఔషధం. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని మెంతులు బాగా తగ్గిస్తాయి.
మెంతులను ఏమోతాదులో ఉపయోగించాలనేది మధుమేహం వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే శరీరంలో కొలెస్టరాల్ స్థాయిని బట్టి ఎంత మేరకు మెంతులు వాడాలన్నది నిర్ణయించుకోవాలి. రోజూ ఒక స్పూన్ మెంతుల పొడి తీసుకుంటే మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంటుంది. మొదట్లో స్పూన్ మెంతిపొడి ఒకేసారి తినడం ఇబ్బందిగా అనిపిస్తే రెండు భాగాలుగా చేసి పొద్దున, రాత్రి తినాలి.
మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి గాని, లేదా పౌడర్ గా చేసి మంచినీళ్ళు లేదా మజ్జిగలో కలుపుకొని గాని భోజనానికి పావు గంట ముందు తీసుకోవాలి.
నానబెట్టిన మెంతులను గుజ్జుగా చేసిగాని పౌడరుగా చేసిగాని వివిధ రకాల వంటకాల్లో చేర్చి వాడుకోవచ్చు. ఉదాహరణకు రొట్టెలు,పెరుగు,దోశ,ఇడ్లి,ఉప్మా, వివిధ రకాల కూరలు తదితర వంటకాల్లో చేర్చినట్లయితే మెంతుల చేదును కొంతవరకు తగ్గించవచ్చు.
రక్తంలో,మూత్రంలో షుగర్ లెవెల్ అతిగా ఉన్నంత కాలం మెంతులను తీసుకుంటూనే ఉండాలి.
మెంతులను తీసుకోవడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నడవటం లాంటి వ్యాయామం చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే శరీర బరువు తగ్గటం వల్ల ఇన్సులిన్ చక్కగా పనిచేస్తుంది.
- మెంతులు రోజూ వారి ఆరోగ్యంలో వాడితే మంచిది.
Authorization