సృష్టిలో ప్రతి జంతువు తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. తిండి తినడం
అలవాటయ్యే వరకూ పాలతోనే బిడ్డకు జీవం పోస్తుంది. మరి పిల్లలకు పాలిచ్చే విషయంలో మనందరం ఒకేలా ఆలోచించలేకపోవడమే దురదృష్టకరం. మనిషికైనా, జంతువులకైనా తల్లిపాలే జీవామృతం. తల్లి పాలలో ఉండే పోషకాలు ఈ సృష్టిలో మరే పదార్థంలోనూ లభించవంటే అతిశయోక్తి కాదు. బిడ్డకు పూర్తి జీవిత కాలం ఉపయోగపడే వ్యాధి నిరోధక శక్తిని అమ్మ పాలు అందిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం ఓ వారం రోజుల పాటు 'తల్లి పాల వారోత్సవాలు' జరుపుకుంటూ అమ్మ పాల ప్రాధాన్యత గురించి నెమరువేసుకుంటున్నాం.
బిడ్డ పుట్టగానే గంట వ్యవధిలో తప్పనిసరిగా తల్లి పాలు పట్టించాలి. ప్రసవం తర్వాత అంటే బిడ్డ జన్మించాక తల్లికి వచ్చే పాలను ముర్రు పాలు అంటారు. ఇవి బిడ్డకు ఎంతో బలవర్దకమైనవి. వీటిని తప్పనిసరిగా తాగించడాన్ని ప్రతి తల్లి తన బాధ్యతగా స్వీకరించాలి. పుట్టగానే పాలు తాగించడం ద్వారా బిడ్డలో ఉత్తేజిత శక్తి ప్రేరేపితమవుతుంది. పాలివ్వగానే హై స్టెరాయిడ్స్ ఉత్పత్తి అయ్యి న్యూరాన్స్ మొత్తం విచ్చుకుంటాయి. తద్వారా అవయవాలన్నీ శక్తివంతమై క్రమ పద్దతిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. బిడ్డకు తల్లిపాలే మొదటి టీకాగా పని చేస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పుట్టగానే బేబీకి ఎలాంటి పోషకాలు కావాలో అవన్నీ తల్లి పాలలోనే లభిస్తాయి. బిడ్డకు యాంటీ యాక్సిడెంట్స్, ఇమ్యునో గోగులిన్స్ అధిక మొత్తంలో అందే అవకాశం తల్లి పాలివ్వడం ద్వారా కలుగుతుంది. ప్రస్తుతం పాలిచ్చే తల్లుల సంఖ్య 45 శాతంగానే ఉండటం దురదృష్టకరం. 2025 నాటికి ఈ సంఖ్యను 65 శాతంగా పెంచగలగాలి. మహిళలకు ప్రసవ సెలవులు ఇవ్వకపోవడం, కుటుంబంలో పెద్దలు సహకరించకపోవడం వంటి కారణాల వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గిపోతుంది. తల్లిపాల వారోత్సవాల సాక్షిగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఈ సంఖ్యను నూరు శాతానికి పెంచేందుకు కృషి చేయాలి. శ్వాసకోశ వ్యాధులు, విషతుల్య ఆహారం వల్ల కలిగే ప్రభావం, సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడం, చీటికీ మాటికీ రోగాల బారిన పడటం వంటి ఇబ్బందులను తల్లి పాలు తాగిన పిల్లలుసమర్దవంతంగా ఎదుర్కొంటారనడంలో ఆశ్చర్యం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత తొలి ఆర్నెల్ల కాలం సంపూర్ణంగా తల్లిపాలు తాగించడం ఉత్తమం. ఆ తర్వాత ఎలాంటి ఆహారం తినిపించినప్పటికీ పాలివ్వడం మాత్రం మరవద్దు. కనీసం రెండేండ్ల వయసు వచ్చేవరకూ బిడ్డకు తల్లిపాలివ్వడం వల్ల పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక శక్తిని కూడగట్టుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగామారతాడు.
పాలిచ్చే తల్లుల్లో..
బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి కూడా ఎవరూ ఊహించలేనంత మేలు జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భ సంచి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పాలిచ్చిన తల్లుల్లోచాలా వరకూ తగ్గుతుందని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇన్ని ప్రయోజనాల రీత్యా ఇంట్లో ఉండే పెద్దలు శ్రద్ద తీసుకుని బ్రెస్ట్ ఫీడింగ్ను ప్రోత్సహించాలి. కనీసం తల్లి పాలను ఒక కంటెయినర్ (ఉగ్గిన్నె) పట్టి ఉంచి తర్వాతైనా తాపించే అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తల్లికి ఫీడింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. విధులు నిర్వర్తించే ప్రదేశాల్లో తల్లులు తమ పిల్లలకు పాలివ్వడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలి.
మేనరికం సంబంధాలు వద్దు..
మన సమాజంలో మేనరికం సంబంధాలు ఒక అవాంఛనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కుటుంబాల మధ్య బంధాలు తెగిపోకుండా ఉంటాయన్న ఉద్దేశంతో మేనరికపు సంబంధాలను పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది పిల్లల జీవితాలకు చేటు తెచ్చే పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. మేనరికం సంబంధాల వల్ల పిల్లల్లో 50 శాతం వరకూ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. భార్యా భర్తలిద్దరిలోనూ ఒకే రకమైన జీన్స్ ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. భవిష్యత్తులో మేనరికపు సంబంధాలను పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ స్థానంలో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం ఉత్తమం.
గర్భిణికి వ్యాయామం అవసరం..
సాధారణంగా గర్భిణీలు విశ్రాంతి తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. గర్భందాల్చిన మహిళలు కనీస వ్యాయామం చేయడం వల్ల పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఉదాహరణకు జంతువులు కడుపుతో ఉన్నప్పుడు కూడా ఒకే చోట కూర్చొని ఉండవు. అవి తరచూ ఒక చోటి నుంచి మరో చోటికి సంచరించడం వల్లే ఆరోగ్యంగా ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎంతో మేధస్సు పెరిగినమనిషి మాత్రం ఒకే చోట కూర్చుని పని చేస్తూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇలా కదలకుండా గంటలతరబడి కూర్చుని పని చేయడం వల్ల గుండె జబ్జుబు వచ్చే ప్రమాదం అధికమవుతుంది. వయసుని బట్టి కనీస శ్రమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భవతులు తేలికపాటివ్యాయామం చేయడం వల్ల ప్రసవం సులభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ ప్రసవానికి వీలు కలుగుతుంది.
మత్తు పదార్థాల కంటే సెల్ ఫోనే ప్రమాదం..
మత్తు పదార్థాలను వాడటం కంటే సెల్ ఫోన్ను వాడటమే అత్యంత ప్రమాదం అనడంలో ఆశ్చర్యం లేదు. మత్తు పదార్థాలు సేవించడం ప్రమాదం అన్నదే మనం అందరి నోటా వింటుంటాం. కానీకంటికి కనిపించని, ఒక్కసారిగా నష్టం తెలియని ప్రమాదాన్ని సెల్ ఫోన్ సృష్టిస్తుంది. అందుకే కొకైన్, ఆల్కహాల్ కంటే ఫోనే ప్రమాదకరమని అభివర్ణించుకోవచ్చు. ప్రధానంగా చిన్న పిల్లల మస్కిష్కాలను ప్రభావితం చేసే సెల్ ఫోన్ వాడకం వారి అలవాట్లను సైతం తీవ్రంగా మార్చేస్తుంది. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటైతే ఆ అలవాటును మాన్పించడం చాలా కష్టతరంగా మారుతుంది. అందుకే ఇంట్లో పెద్దలు దృష్టిసారించి చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఎక్కువ సేపు ఇవ్వకుండా ఉండాలి. అన్నం తినకుండా మారాం చేస్తున్నారని, స్కూల్కి వెళ్లడంలేదని సెల్ ఫోన్ని అలవాటు చేయడం సరైన విధానం కాదు. సాధారణంగా ఐదేండ్లలోపే పిల్లలకు నూటికి 90 శాతం మెదడు ఎదుగుదల జరుగుతుంది. ఈ వయసులో సెల్ ఫోన్ చేతికిస్తే వారి ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. సెల్ ఫోన్లో వీడియోలు, టీవీలో వీడియోలు చూసి నిజ జీవితంలో కూడా అలా చేయాలని ప్రయత్నించి కొందరు పిల్లలు ప్రమాదాల బారిన పడిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందుకే పిల్లలను వాస్తవికత ధృక్పదంతోనే పెంచాలి. సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్దాలను ఓ పాఠ్యాంశంలా చేరిస్తే బాగుటుంది. సెల్ ఫోన్లో గేమ్స్కి ప్రాధాన్యత ఇవ్వకుండా శారీరక, మానసిక ఎదుగుదలకు ఉపకరించే పాత కాలపు ఆటలను అలవాటు చేయడం మంచిది.
- డాక్టర్ వై.నాగమణి,
చిన్న పిల్లల వైద్య నిపుణులు
ఎంబీబీఎస్, డీసీహెచ్
యలమంచిలి పాలీ క్లినిక్, ఖమ్మం.
Authorization