మనకు తెలియకుండానే మనం మన ఇళ్లను కాలుష్య కాసారాలతో నింపేస్తుంటాం. దానివల్ల చాలా ప్రమాదాలుంటాయి. అయితే మన ఇంటిని మనం కాలుష్య పదార్థాలతో ఎలా నింపుతున్నామో తెలిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మన ఇంటిని కుర్చీలు, సోఫాలు, డైనింగ్ టేబుళ్లతో నింపేస్తుంటాం. అంతేకాదు, అవి పాడుకాకుండా ఉడ్పెయింట్, వార్నిష్ లాంటి రసాయనాలతో కూడిన రంగుల్ని వేస్తుంటాం. ఫర్నీచర్పై కుషన్లు, పరుపులు వేస్తాం కదా, వాటిని కొన్ని ఏండ్లపాటు మార్చకుండా అలాగే ఉంచేస్తుంటాం. అందులో ఉండే దూదిలో కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి. ఏసీలు, కూలర్లు వాడుతుంటాం, వాటిని వాడేటప్పుడు ఆ నీటిలో ఉండే క్రిములు బయటకు వెలువడుతాయి. పెంపుడు జంతువులను ప్రేమగా చేరదీస్తాం. వాటిని యథేచ్చగా ఇళ్లలో తిరగనిస్తాం. వాటి బొచ్చు, ఒంటిపైనున్న పొట్టు మనింట్లో రాలినపుడు అది గాలిలో కలిసి కాలుస్యకారకమవుతుంది. అలాగే మన శరీర శుభ్రతకు వాడే సబ్బులు, చెమట వాసనను పారద్రోలే డియోడరెంట్లు, ఆఖరికి ఇంటిని, దుస్తులు, సింకుల్ని శుభ్రం చేసేందుకు యాసిడ్, డిటర్జెంట్ల వంటివి వాడతాం కదా, మురికి త్వరగా వదిలేందుకు వాటిని గాఢత కలిగిన రసాయనాలతో చేస్తారు. ఇకపోతే మనం వాడే ప్లాస్టిక్ వల్ల ఎన్ని రకాల ప్రమాదాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి వాటినుంచి మనం సురక్షితంగా బయటపడడానికి ఒకేమార్గం. అదేమంటే దుమ్మూధూళిని ఎప్పటికప్పుడు దులిపి శుభ్రం చేసుకోవాలి. వీలయితే వంటింట్లో, గదుల్లో లోపలి గాలిని బయటికి పంపే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. అన్నింటినీ మించి ధారాళంగా గాలీ, వెలుతురూ వచ్చేలా గృహనిర్మాణం చేయాలి. పరుపులు, కుషన్లు, పక్కబట్టలను ఎండల్లో వేస్తుండాలి. ఇంటిశుభ్రతకు, ఒంటి శుభ్రతకు సంప్రదాయకమైన మార్గాలను వాడటం ఉత్తమం.