పొందికగా కింద కూర్చోని భోజనం చేసే రోజులు ఇప్పుడు లేవు. ఆదరాబాదరగా నిలబడి నాలుగు ముద్దలు గబాగబా నోట్లో పెట్టుకుని పరుగులు తీసే రోజులు వచ్చాయి. పండగలకు, శుభకార్యాలకు కూడా బంతిభోజనాల స్థానంలో బఫేలు వచ్చాయి. నిలబడి తినడమే ఫ్యాషన్గా మారిపోయింది. అయితే నిలబడి తినడం వల్ల వచ్చే అనారోగ్యసమస్యలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మాత్రం నిలబడి తినకండి అని సూచిస్తారు. ఎందుకంటే.. నిలబడి తింటే ఆరోగ్యానికి ప్రమాదమేనంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చుని తినడం వల్ల శరీరం మీద ఒత్తిడి పెరిగిపోతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పొందికగా కింద కూర్చొని తినడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. తమ అధ్యయనంలో భాగంగా 350 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించారు. 'నిల్చుని భోజనం చేసేప్పుడు శరీరంలోని కింది భాగాల నుంచి పైభాగాల వరకు రక్తం సరఫరా కావాల్సి ఉంటుంది. పై భాగాల వరకు రక్త సరఫరా కావడం కోసం గుండె పంపు చేయాల్సిన వేగం పెరుగుతుంది. తద్వారా గుండె స్పందన రేటు పెరిగి, శరీరంపై ఒత్తిడి పడుతుంది.' అని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే నిల్చుని తినడం వల్ల రుచికి సంబంధించిన కణాలు సరిగ్గా పనిచేయవని, తద్వారా భోజనం అంత రుచిగా అనిపించదని పేర్కొన్నారు. బఫేల కన్నా బంతి భోజనాలే మంచిదని ఇకనైనా గుర్తించాలి.