పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. కొన్ని నిమిషాల కిందట చేతిలోని వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుకు రాని పరిస్థితి. దీనినే మతిమరుపు అంటారు. ఇది ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్కీ, మానసిక ఒత్తిడికీ అవినాభావ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మతిమరపు రావడానికి మానసిక ఒత్తిడితో పాటు చాలా కారణాలు దోహదం చేస్తాయి.మెదడు కుచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జీమర్స్గా గుర్తించవచ్చు.
అల్జీమర్ ఎక్కువగా వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. మంచి పోషకహారాన్ని అందిస్తే కొంత మేర మార్పు చేయవచ్చు. పక్షవాతాన్ని, డయాబెటిస్ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జీమర్స్ను నివారిస్తాయి.
మతిమరుపు - కారణాలు
నిత్య జీవితంలో ఎందరో పిల్లలూ, పెద్దలూ, పదే పదే చెప్పే సమస్య మతిమరుపు. పిల్లలైతే స్కూలులో చెప్పింది గుర్తుపెట్టుకోలేకపోవడం, చదివింది పరీక్షలో గుర్తుకు రాకపోవడం, పెద్దలైతే ఆఫీసు విషయాలు, ఇంటి విషయాలు మరచిపోవటం సర్వసాధారణం. దీనికి నివారణ కోసం దగ్గరుండే డాక్టర్లను కలిసి సలహాలు తీసుకుంటూ ఉంటారు కొందరు. మతిమరుపు ఉంది అని చెప్పుకునేవారిలో, నిజమైన మతిమరుపు ఉండదు. ఇది తాత్కాలికమైన మతిమరుపు.
మెదడు ఆలోచనలు ఎక్కువ భాగం టెన్షన్తో నిండిపోవటంమెదడుకు సరైన రిలాక్సేషన్ లేకపోవడంపిల్లలకు ఇంట్లో, స్కూల్లో ఒత్తిడి ఎక్కువ కావడం వలన, పెద్దలకైతే కుటుంబ సమస్యలూ, ఆఫీస్ సమస్యల వల్ల ఇటువంటి తాత్కాలికమైన మతిమరుపు వస్తుంది.
చికిత్స
ఇటువంటి తాత్కాలికమైన మతిమరుపు విషయంలో చక్కని అవగాహన వచ్చేట్లు కౌెన్సిలింగ్ ఇచ్చి, వ్యాయామం, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ఒత్తిడికి గురికాకుండా చదువుకునే పద్ధతులు, ఒత్తిడికి గురికాకుండా ఆఫీసులో ఎన్ని గంటలైనా పనిచేసే పద్ధతులు చెప్పటం వల్ల మతిమరుపు పూర్తిగా పరిష్కారమవుతుంది.
నిజమైన మతిమరుపు అంటే ఏమిటి?
దీన్ని వైద్య శాస్త్రపరంగా డిమెన్షియా అంటారు. ఈ మతిమరుపు 98 శాతం మందికి 50 ఏళ్ల తరువాత వస్తుంది. మతిమరుపును రెండు విధాలుగా చెప్పుకోవచ్చు.
1. మందులతో నయం కాని మతిమరుపు
2. మందులతో నయమయ్యే మతిమరుపు
మందులతో నయం కాని మతిమరుపు లో అల్జీమర్స్ డిమెన్షియా, లెవీ బాడీ డిమెన్షియా, ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా, పిక్ డిసీజ్, మల్టీ ఇన్ఫార్క్ట్ డిమెన్షియా వున్నాయి. డిమెన్షియా వచ్చిన రోగులలో 50-60 శాతం మందికి, ముందు చెప్పిన మూడు జబ్బుల్లో ఏదో ఒకటి ఉంటుంది. అన్నింటికంటే అల్జీమర్స్ డిమెన్షియా ఎక్కువ మందికి వస్తుంది.
మందులతో నయమయ్యే మతిమరుపు
దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎక్కువగా థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల వచ్చే , ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, మిటమిన్ బి 12 లోపం వల్ల ఈ విధమైన మతిమరుపు వస్తుంది. కొన్నిసార్లు జబ్బుల కారణంగా ముఖ్యంగా ఎయిడ్స్ , మూత్రపిండాల జబ్బు, లివర్ సమస్య వల్ల కూడా వస్తుంది.
మెదడులో ఉండే నీరు ఎక్కువ కావడం
మెదడులో గడ్డలు ట్యూమర్స్ కారణంగా కూడా మతిమరుపు వస్తుంది.
కొందరిలో మెదడుకు దెబ్బతగలటం మతిమరుపు ఎందుకు వచ్చిందో తెలుసుకుని సరైన మందులు వాడితే తగ్గిపోతుంది.
సూడో డిమెన్షియా..
ఈ రెండు రకాల మతిమరుపులే కాకుండా ఇంకో రకం మతిమరుపు ఉంది. దీన్ని 'సూడో డిమెన్షియా' అంటారు. దీని గురించి కొద్దిగా ముందు చెప్పుకున్నాం. ఇది నిజమైన మతిమరుపు కాదు. ఇది మానసిక సమస్యల వల్ల వస్తుంది.
అల్జీమర్స్ డిమెన్షియా
ఇది అన్నిటికంటే ఎక్కువ మందిలో మతిమరుపు రావడానికి కారణం అల్జీమర్స్ డిమెన్షియా. ఇది చాలావరకు 55 ఏండ్లు పై బడిన వారిలో వస్తుంది. వ్యాధి బారిన పడిన వారిలో ఒక్క శాతం మందికి మాత్రమే వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. మగవారి కంటే మహిళల్లో మూడింతలు ఎక్కువగా అల్జీమర్స్ డిమెన్షియా వస్తుంది.
లక్షణాలు...
నిదానంగా మతిమరుపు లక్షణాలు వస్తాయి. మొదట రోజువారీగా జరిగే చిన్న విషయాలు మరచిపోతూ ఉంటారు. దూరబంధువుల పేర్లు, తక్కువగా ఉపయోగించే పదాలు మొదట మరిచిపోతారు. చెప్పిన మాటలే పదే పదే మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు 5-10 నిముషాల ముందు జరిగిన విషయాలు కూడా మరిచిపోతారు. రానురాను ఒకటి రెండు రోజుల ముందు విషయాలు మరిచిపోతారు. పాత విషయాలు మాత్రం చివరి వరకూ గుర్తుంటాయి. దీనినే 'రిబోట్ లా ఆఫ్ మెమోరీ' అంటారు. క్రమేపీ మాటలు రావడం తగ్గుతుంది. తమ ఇంటి, బాగా తెలిసిన దారి కూడా మరిచిపోతారు. ఉదయ సాయం కాలాలకు తేడా కనుక్కోలేరు. రోజూ ఉపయోగించే వస్తువులను వాడేవిధానం కూడా మరిచిపోతారు. ఉదాహరణకు అక్షరాలు రాయడం, సంతకం చేయడం మరచిపోతారు. రాను రాను తరచూ వాడే మాటలు కూడా మరచిపోతారు. ఆఖరి దశలో నడక కూడా మారిపోతుంది. కాకపోతే ఈ జబ్బుతో ప్రాణహాని ఉండదు.
నిర్ధారణ..
ఎవరైనా పేషెంట్లు మతిమరుపు వుందని నిర్ధారణ చేసిన తరువాత కొన్ని పరీక్షలు వెంటనే చేయించుకోవాలి. వాటిలో ముఖ్యంగా
1. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్స్ (అంటే థైరాయిడ్ ఏ విధంగా పనిచేస్తుందో కనుక్కునే రక్తపరీక్ష)
2. రక్తంలో విటమిన్ బి 12 లెవెల్స్
3. సిటి స్కాన్ బ్రైన్ లేదా ఎమ్ఆర్ఐ బ్రైన్
4. బ్లడ్ యూరియా
5. సీరమ్ క్రియేటినిన్
6. లివర్ ఫంక్షన్ టెస్ట్
చికిత్స..
ఏ కారణాల వల్ల మతిమరుపు వచ్చిందో తెలుసుకుని పూర్తిగా నయమయ్యేందుకు మందులు వాడాలి. ఉదాహరణకు థైరాయిడ్ లోపం ఉంటే థైయాక్సిన్ అనే మందు ఇస్తే సరిపోతుంది. అలాగే సిటి స్కాన్ బ్రైన్తో మెదడులో గడ్డలు కనపడితే ఆపరేషన్ వల్ల తీసేస్తే జబ్బు పూర్తిగా నయమవుతుంది. సిటి స్కాన్ బ్రైన్తో, మెదడులో నీరు వున్నట్లు కనిపిస్తే (హైడ్రో సిఫాలస్), ఆ నీరు తీసేస్తే జబ్బు పూర్తిగా నయమవుతుంది.
- డా. ఎం.చంద్రశేఖర్రెడ్డి,
సీనియర్ కన్సెల్టెంట్ న్యూరాలజిస్ట్,
కెపిహెచ్బి కాలనీ, హైదరాబాద్.
Authorization