వర్షాకాలం వచ్చిందంటే రోగాలు వ్యాప్తి చెందుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలు పట్టి పీడిస్తాయి. దాంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనికి కారణం వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వృద్ధి చెందడమే. మనం తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ వర్షాకాలంలో మాత్రం పచ్చి కూరగాయలు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో ఉండే తేమ వాతావరణం వలన వాటిపై బ్యాక్టీరియా, వైరస్లు అధికంగా చేరతాయి. అలాంటి కూరగాయలు తింటే ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. మనం పచ్చిగా తినే క్యారట్, టమోటా, బీట్రూట్, బెండకాయి వంటి కూరగాయాలను ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.