వర్షాకాలం వచ్చింది. నాలుగు చినుకులు కురిసి మురిపించి పోయేయి. కాసేపు విపరీతమైన ఎండ.. విపరీతమైన ఉక్కపోత... మరికాసేపు నల్లని మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా చల్లబడుతుంది. వాతావరణంలో వచ్చే ఈ మార్పులు ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మన శరీరం ఆ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో శరీరంలోని వ్యాధినిరోధక శక్తి కాస్త బలహీన పడే అవకాశం ఉంటుంది. ఇలా బలహీనపడినపుడు ఇన్ఫెక్షన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలా చేరిన ఇన్ఫెక్షన్లు ఫ్లూ రూపంలోనో... విషజ్వరంగానో మారే అవకాశం ఉంది. అది మన శరీరంలోని నిరోధక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసిన విషజ్వరాలు రెచ్చిపోయాయి. జ్వరబాధితులతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఈ సీజన్లో ఎక్కువగా కనిపించే విషజ్వరాల గురించి ఈ వారం తెలుసుకుందాం...
కొద్దిపాటి అవగాహన, ముందు జాగ్రత్త ఉంటే ఈ విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చు. విషజ్వరాలు కొన్ని వైరస్ల వల్ల, కొన్ని బాక్టీరియా వల్ల వస్తాయి. వీటిలో ముఖ్యమైనవి డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్ ముఖ్యమైనవి.
డెంగ్యూ
డెంగ్యూ చాలా సాధారణమైన జ్వరం. ఇది ఓ వైరస్ ప్రభావంతో వస్తుంది. ఈ వైరస్ ఏడిస్ ఈజైప్టె అనే దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని ఈ దోమ కుట్టినపుడు ఈ వైరస్ దోమలోకి చేరుతుంది. తర్వాత ఈ దోమ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత 2 నుంచి 7 రోజుల్లోపు లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ ఇన్ఫెక్షన్ సాధారణంగా అదే తగ్గిపోతుంది. కొంత మందిలో ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు కూడా తెలియకుండానే తగ్గిపోతుంది. రోగనిరోధకత ఎక్కువగా ఉన్న వారిలో ఇలా ఇన్ఫెక్షన్ సోకిన విషయం తెలియకుండానే తగ్గిపోతుంది. దీనిని రెండు రకాలుగా చెప్పవచ్చు. డెంగ్యూ హెమరాజిక్ షాక్ ఫీవర్ ఇందులో రక్తస్రావంతో పాటు బీపీ పడిపోయి షాక్లోకి వేళ్లిపోతారు. ఇది ప్రమాదకరమైన స్థితి.
లక్షణాలు: జ్వరం, తలనొప్పి ముఖ్యంగా కళ్ల వెనుక నొప్పి, ఒళ్లు నొప్పులు, శరీరం మీద ఎర్రని మచ్చలు ఏర్పడడం, తీవ్రమైనపుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం, రక్తంలో తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పై ఎర్రని మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజక్షన్ ఇచ్చిన చోట నుంచి లేదా ఇతర భాగాల నుంచి రక్తస్రావం అవుతున్నా, మూత్రం, మలంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో రక్తస్రావం జరుగుతుందని అర్థం. ఇది ప్రాణాపాయానికి కారణం కావచ్చు. దీనికి వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. సాధారణంగా జ్వరం వచ్చి తగ్గిన ఏడు రోజుల్లోపు రక్తంలోని ప్లేట్లెట్లు తగ్గిపోవడం, రక్తస్రావం కావడం, బీపీ పడిపోవడం, మూత్ర విసర్జన సరిగ్గా జరగక పోవడం, షాక్కి గురవడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స: డెంగ్యూ జ్వరానికి ప్రత్యేక మందులేమీ లేవు. లక్షణాలు తగ్గించడానికి చేసే చికిత్స మాత్రమే అందుబాటులో ఉంది. లక్షణాలు తగ్గించడానికి డాక్టర్లు అందించే చికిత్సతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ, శరీరంలో నీటి శాతం తగ్గకుండా డీ హైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. అయితే కొంత మందికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోవడంతో తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్య ఎంత ఉన్నపుడు ఈ అవసరం పడుతుందనేది ఒకొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మందిలో 50-75 వేల మధ్య ఉన్నప్పటికీ రక్తస్రావం అవుతుంది. అలాంటి వారికి వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య 10-25 వేల మధ్య ఉన్నపుడు తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
మలేరియా
మలేరియా కూడా దోమల ద్వారా వ్యాపించే మరో విషజ్వరంగా చెప్పవచ్చు. ప్లాస్మోడియం జాతికి చెందిన ఒక సూక్ష్మజీవి అనాఫిలిస్ దోమ కాటుతో మన శరీరంలో ప్రవేశించి మలేరియాకు కారణమవుతుంది.
లక్షణాలు: ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టిన 7-14 రోజుల్లో మలేరియా లక్షణాలు బయట పడతాయి. చలి జ్వరంతో పాటు తలనొప్పి ఉండడం దీని ముఖ్యమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సార్లు ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. ముందుగా చలితో ప్రారంభమై తర్వాత జ్వరం వచ్చి తర్వాత విపరీతంగా చెమటలు వస్తాయి. ముందుగా ఏరకమైన మలేరియా అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మలేరియాను నిర్ధారించడానికి రక్త పరీక్ష చేస్తారు. ఇప్పుడు డిప్-స్టిక్ విధానంలో కేవలం 15 నిమిషాల్లో మలేరియాను నిర్ధారిస్తున్నారు.
చికిత్స: మలేరియా జ్వరాన్ని నిర్ధారించిన తర్వాత దాని తీవ్రతను బట్టి అది వైవాక్స్ తరహా జ్వరమా లేక ఫాల్సీఫెరమ్ తరహా జ్వరమా నిర్ధారణ చేసుకోవాలి. వైవాక్స్ మలేరియా అయితే ఇంటి నుంచే చికిత్స తీసుకోవచ్చు. మందులతో పాటు పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి ఉంటే త్వరగానే కోలుకోవచ్చు. పాల్సిఫెరమ్ మలేరియా అయితే మాత్రం హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాల మీద దీని ప్రభావం ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్య పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంటుంది.
టైఫాయిడ్
టైఫాయిడ్ కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇందులో జ్వరం, వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. నిర్ధారణ తర్వాత పూర్తి కోర్సు మందులు వాడాల్సి ఉంటుంది. మధ్యలో ఆపితే వ్యాధి తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి.
నివారణ చర్యలు
నిల్వ ఉండే నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి. కాబట్టి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
డెంగ్యూ జ్వరం వ్యాపింపజేసే దోమ మధ్యాహ్నం పూట మాత్రమే కుడుతుంది. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి దోమతెరలతో పెద్దగా లాభం ఉండదు. కాబట్టి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. మస్కిటో రిపెల్లెంట్లు ఇతర దోమలను నిర్మూలించే రసాయనాలను ఉపయోగించాలి.
- పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
- తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
స్వైన్ ఫ్లూ
మరో ప్రమాదకరమైన విషజ్వరం స్వైన్ ఫ్లూ. ఇది చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు తుమ్మినపుడు, దగ్గినపుడు వారి లాలాజల తుంపర్ల ద్వారా కూడా గాలిలోకి సూక్ష్మక్రిములు వ్యాపిస్తాయి. ఇందులో అన్ని ఫ్లూ జ్వరాలలో ఉండే లక్షణాలే ఉంటాయి. జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. మాములు ఫ్లూ అయితే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ స్వైన్ ఫ్లూ అయితే మాత్రం రెండో రోజు నుంచే తీవ్రమైన దగ్గు, ఆయాసం ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
మామూలు వైరల్ జ్వరాలైతే ఒకటి రెండు రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. అలా కాకుండా ఐదారు రోజులకు పైగా జ్వరం కొనసాగుతోందంటే సెకండరీ ఇన్ఫెక్షన్ మొదలై అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారిందని అనుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి విషజ్వరాలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది.