వానకాలంలో ఎక్కువ మంది బాధపడే సమస్యలో ఒకటి పాదాల పగుళ్ళు. ఎక్కువ సమయం నీటిలో ఉండి పని చేసేవారిలోనూ ఈ సమస్య వేధిస్తుంది. పొలం పనులు చేసేవారు కూడా పాదాలు పగిలి ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి పాదాలకు సబ్బు నీళ్లు తాకినా సరే విపరీతంగా పగులుతాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఇబ్బంది పెడితే బాధపడాల్సిన అవసరం లేదు. వీటిని పగుళ్లను తగ్గించుకోవటానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. - వేడి నీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్తో రుద్దినట్లైతే పాదాల పగుళ్ళలో ఉన్న మురికి పోతుంది. శుభ్రమైన పాదాలకు కొబ్బరినూనె రాస్తే చాలు. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. - గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లు పూర్తిగా మటుమాయం అవుతాయి. - బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. - వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్ట్లా చేసుకొని ఆముదం నూనెలో కలుపుకొని పగుళ్లు ఉన్న చోట రాసినట్లైతే త్వరగా ఉపశమనం పొందుతారు. - ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు. - నాణ్యత గల స్లిపర్స్, షుస్ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు. - మధుమేహం ఉన్నవారు పాదాల పగుళ్ళను నిర్లక్ష్యం చేయవద్దు.