నాలుకు పగిలింది.. ఏమీ తినలేకపోతున్నాం అన్న పదం చాలామంది నుంచి వినిపిస్తుంది. ఇందుకు కారణం నాలుక పూత. ఇది చాలా మాములు సమస్యే అయినా ఆహారం తీసుకోవడానికి చాలలా ఇబ్బందిగా ఉంటుంది. నాలుక మధ్యలో కొంతభాగం ఎర్రగా అవటం (మీడియన్ రాంబాయిడ్ గ్లాసైటిస్).. అక్కడక్కడా తెల్లగా, ఎర్రగా అవుతుంది. దీనిని చాలామంది నాలుక పూతగా భావిస్తుంటారు. మంట వంటి ఇబ్బందులేవీ ఉండవు. అయితే అన్నం తింటున్నప్పుడు, కారం తగిలినప్పుడు మంట పుట్టటం వంటి లక్షణాలు కనబడితే చాలావరకు బి విటమిన్ల లోపం కారణం కావొచ్చు. రైబోఫ్లావిన్, నియాసినమైడ్ తగ్గితే నాలుక బాగా ఎర్రగా పూసినట్టుగా కనిపిస్తుంది. ఫోలిక్ యాసిడ్, బి12 తగ్గితే నాలుక నున్నగా కనబడుతుంది. మన నాలుక మీద రుచిమొగ్గలు ఉంటాయి. ఇవి తగ్గిపోతే నాలుక నున్నగా అవుతుంది (గ్లాసైటిస్). నాలుక ఎర్రగా పూసినట్టు కనబడుతుంది. అరుదుగా కొన్నిరకాల చర్మ సమస్యల్లోనూ నాలుక మీద గుల్లలు పడి నున్నగా అవ్వచ్చు. కొందరికి నాలుక చివర్లోనూ నంజుపొక్కులు తలెత్తి ఎర్రగా కనబడొచ్చు. సమస్య చిన్నదే అయినా కచ్చితమైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవటం ముఖ్యం. విటమిన్ బి లోపం మాత్రమే కాదు.. ఐరన్ లోపంతో తలెత్తే రక్తహీనత కూడా దీనికి దారితీయొచ్చు. దీర్ఘకాలం యాంటీబయోటిక్ మందులు వాడినపుడు పేగుల్లో మంచి బ్యాక్టీరియా చనిపోవటం మూలంగానూ నాలుక పూత రావొచ్చు. వేధించే విరేచనాలు, దీర్ఘకాల పోషణలోపం కూడా దీనికి కారణం కావొచ్చు. బాగా మంట పుట్టే కారం, మిరియాలు, అల్లం, మసాలాల వంటివి ఎక్కువగా తినేవారిలోనూ నాలుక నున్నగా అయ్యి ఎర్రగా కనబడొచ్చు. ఎన్ఎస్ఏఐడీ రకం నొప్పి మందులు వాడినప్పుడూ రావొచ్చు. బి విటమిన్లతోనే చాలావరకు నయమయ్యే అవకాశముంది. కారం, మసాలాలు తగ్గించటం.. తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం మంచిది. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినట్టు తేలితే ఐరన్ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. తరచుగా పూత వస్తుంటే డాక్టర్ను సంప్రదించాలి.