శరీరానికి కావల్సిన ప్రోటీన్స్, పోషకాలు అందాలంటే మాంసాహారం తీసుకోవాలని కొందరు సూచిస్తే, ఆరోగ్యంగా ఉండాలంటే శాఖాహారం తీసుకోవాలని మరి కొందరు సూచిస్తున్నారు. ఇటీవల తైవాన్లోని ఒక యూనివర్సిటీ పరిశోధకులు ఆరోగ్యం మీద కూరగాయల ప్రభావం పై అధ్యయనం చేశారు. వారి పరిశోధనల్లోని కొన్ని అంశాలు.. - నాన్వెజ్ తినేవారితో పోల్చితే వెజిటబుల్స్ తినేవారిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు 16 శాతం తక్కువ ఉంటాయట, ఇందుకు కారణం కూరగాయల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ ఈకోలి బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుందని పరిశోధకులు గుర్తించారు. జీర్ణాశయంలో ఉండే ఈకోలి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి చేరి మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరును దెబ్బతీస్తుంది. వెజిటబుల్స్లో ఎక్కువగా ఉండే ఫైబర్ ఈ బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. - వెజిటబుల్స్ తినేవారిలో అసిటిడీ సమస్య తక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం నాన్వెజ్ తిన్నప్పుడు ఆ ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ జీర్ణరసాలు విడుదల అవుతాయి. దీని వల్ల కడుపులో మంట వస్తుంది. మాంసాహారంలో లభించే ప్రోటీన్స్ కొన్ని రకాల పప్పుల్లోనూ, కూరగాయల్లోనూ లభిస్తాయని, ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.