Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
- మల్లాపూర్లో ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-సిటీబ్యూరో:
దేశంలోని ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బాలాపూర్ మండల పరిధిలోని మల్లాపూర్లో డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణాలకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో చక్కటి ఇండ్ల లో జీవించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ల ఇండ్ల నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే మల్లాపూర్లో దాదాపు 15 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిలో 2,700 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ. 234 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు. వీటిని 9 అంతస్తుల అధునాతనమైన సౌకర్యాలతో , రెండు లిఫ్ట్ల సౌకర్యం, ఆస్పత్రి, మోడల్ పాఠశాల, వ్యాపార సముదాయం, పార్కులు, కమ్యూనిటీ హాలు మొదలైన మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని అన్నారు.
ఇవే కాకుండా రంగారెడ్డి జిల్లాలో 12 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.