Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంటల్లో కాలుతున్న ఉద్యమకారులు
- ప్రాధాన్యత లేక.. పదవులు రాక మనోవేదన
- మంత్రులు మొదలుకుని మండలాధ్యక్షులు, మార్కెట్ పదవులూ వలసొచ్చినోళ్లకే
- నామినేటెడ్ పదవులకూ నోచుకోని వైనం
- తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాల మీద వేసుకుని మోసినోళ్లు... ఉద్యమ కారులుగా ఎన్నో కేసులు, మరెన్నో చీత్కారాలు.. హేళనలు.. నాటి అధికార పార్టీల నుంచి చీదరింపులు. బెదిరింపులు బరించినోళ్లు వారు. తెలంగాణ వస్తే ఈ చీదరింపులు, బెదిరింపులకు పాల్పడినోళ్ల నోళ్లు మూయిస్తామన్న ఆత్మస్థైర్యం నింపుకున్నోళ్లు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇక తమ కలసాకారమైందన్న తరుణంలోనే అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రమక్రమంగా ఉద్యమకారుల ఆశలపై చినుకులు పడుతున్నాయి. చివరకు ఉద్యమ పార్టీలో తమ స్థానం ఎక్కడో అని వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కుటుంబాన్ని వదిలి స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన ఉద్యమకారులకు టీఆర్ఎస్లో ఒరిగిందేమీటి? వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసిందెవరూ...? అన్న ప్రశ్నలకు బుధవారం తాండూరు టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలోనే తమకు జరగుతున్న అన్యాయాన్ని, ఉద్యమకారులకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికిపాల్పడిన టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు అయుబ్ఖాన్ ఉదాంతం బహిర్గతం చేస్తుంది.
రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీలో రోజుకోప్రాంతంలో ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పార్టీలో తమకు జరుగుతున్నఅన్యాయాన్ని వేధికలపై గుర్తు చేస్తూనే ఉన్నారు. వరంగల్సభకు ముందు ఇహ్రీంపట్నంలో జరిగిన సన్నాహక సమావేశంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈసీశేఖర్గౌడ్ ఉద్యమ కాలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఇస్తున్న ప్రధాన్యతను గుర్తు చేస్తూ ఇది సరైన పద్ధతి కాదని చురకంటించారు. తరువాత మండల పార్టీ అధ్యక్ష పదవులను ఉద్యమ నాయకులను పక్కకు నెట్టి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వెనుక వచ్చిన నాయకులకే కట్టబెట్టారు. ఈ సందర్భంగా కూడా ఉద్యమకారులు గుర్రుగా ఉన్నారు. అటు మహేశ్వరం నియోజకవర్గంలోనూ ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నంటే ఉంటూ 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన కొత్త మనోహన్రెడ్డికి సైతం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్లో చేరిన తరువాత ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. దాంతో ఇటీవల కొత్తమనోహన్రెడ్డి సైతం ముఖ్యకార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి తన ప్రాభల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమనాయకులు, కార్యకర్తలను సమీకరించే పరిలోపడ్డారని చెప్పాలి. ఇక మొదటిసారిగా నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ల విషయంలోనూ ఉద్యమకారులకు అన్యాయమే జరిగింది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తన అనుచరులకే ఇప్పించుకున్నారు. ఇటు మండలాధ్యక్ష పదువులు, అటు మార్కెట్ పదవులూ వరించకపోవడంతో ఉద్యమకారులు ఆత్మస్తైర్యం కోల్పోతున్నారు. ఇదే తరుణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో తమ ఆందోళనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
అందులో భాగంగానే తాండూర్లో జరిగిన సమావేశంలోనూ అయుబ్ఖాన్ ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి మంత్రి మహేందర్రెడ్డి సమక్షంలోనే ఒంటిపై కిరోసిన్పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 40 శాతం గాయపడిన ఆయనను వెంటనే అంబులెన్స్లో నగరానికి తరలించారు. చికిత్సను అందజేస్తున్నారు. అధికార పార్టీలో కొనసాగుతున్న ఆరనిజ్వాలలను ఆపేందుకు పార్టీ నాయకత్వం ముందుకు రావాలని కార్యకర్తలు వేడుకుంటున్నారు.