Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ నియోజవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు కురువ నందున వర్షాభావ పరిస్థితులవల్ల రాబోయే రోజుల్లో మంచి నీటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ పనులకు ప్రాధాన్యతనిచ్చి పట్టణంలో సక్రమంగా నీరు సరఫరా అయ్యేలా మున్సిపల్, మిషన్ భగీరథ, మంజీరా నీటి సరఫరా అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి సరఫరాకోసం అవసరమైన నీటి విడుదలకు వారం రోజుల్లో పనులు పూర్తిచేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ అధికారులు ప్రతిరోజు 6 ఎమ్ఎల్డీ నీటిని విడుదల చేస్తే వికారాబాద్ నియోజక వర్గంలో దినం తప్పించి దినం సరఫరా చేయుటకు వీలు పడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెంచేందుకు జిల్లాలోని కోట్పల్లి, సర్పంపల్లి, నంది వాగు ప్రాజెక్టులతో మిషన్ కాకతీయ పథకం కింద మరమ్మతు పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. శివారెడ్డిపేట చెరువులో కూడా లోతు పెంచాలన్నారు. మధ్య మధ్యలో గల మట్టి దిమ్మలను తొలగించి నీటి సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఖాళీ బిందెలతో మహిళలు కనబడకుండా వారం రోజుల్లో కొత్తగడి, అలంపల్లిలోని నీటి సమస్యతో పాటు నియోజకవర్గంలో దినం తప్పి దినం నీటి సరఫరా అయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్, ప్రజారోగ్య డీఈ సత్యనారాయణ, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్తో పాటు డీఈలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.