Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటు కాని సెంట్రల్ లైటింగ్
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంతో పాటు కడ్తాల్ మండల కేంద్రంలోని మైసిగండి, విఠాయిపల్లి గ్రామాలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మూడేండ్ల క్రితం శ్రీశైలం-హైదరాబాద్ రహదారిని జాతీయ రహదారిగా మార్చి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఆయా చోట్ల రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా చేసి డివైడర్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో డివైడర్లకు అనువుగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటువల్ల జాతీయ రహదారిపైగల ఆయా గ్రామాలకు శోభ ఏర్పడటంతో పాటు ప్రయాణికులకు బాటసారులకు అనుకూలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. బర్రెకొని తలుగు కొనడానికి భయపడట్టు అన్న సామెతగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు ఏర్పాటు చేసినప్పటికీ సెంట్రల్ లైటింగ్ కోసం రూ.లక్షల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడడం సరికాదంటున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారిపై చాలా చోట్ల వీధి దీపాలు లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఆమనగల్, కడ్తాల్, మైసిగండి, విఠాయిపల్లిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు గురించి పలుమార్లు స్థానిక నాయకులు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సంబంధిత ఉన్నత అధికారులకు విన్నవించారు. అయినా సంబందిత శాఖలో స్పందన కొరవడింది. ఇదే విషయమై స్థానిక మండల స్థాయి అధికారులు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఆయాగ్రామాల ప్రజలు కోరుతున్నారు.