Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసంపూర్తి వంతెనలు..
- శిథిóలమైనరోడ్లతో చింతకుంట గ్రామస్తుల వెతలు
- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
- ప్రభుత్వాలు మారినా తీరని సమస్యలు
నవతెలంగాణ-ధారూర్
మండలంలోని హరిదాస్పల్లి, చింతకుంట గ్రామాల ప్రజల సమస్యలు దశాబ్దాలుగా తీరడం లేదు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్నా, అభివృద్ధికి నోచుకోకపోవడం లేదని పేర్కొంటున్నారు. గ్రామంలోని ప్రజలకు మండల కేంద్రానికి, ఇతర ప్రాంతాలకు వెళ్లటానికి రెండురోడ్లు నిర్మితమై ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే హరిదాస్పల్లి మీదుగా వికారాబాద్, తాండూర్ ఆర్ఆండ్బీ రోడ్డుకు కలిపి తారురోడ్డు నిర్మించారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉండే చింతకుంట గ్రామం మీదుగా వేసిన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు నిర్మించిన ప్రస్తుతం శిథిలావస్థలో గుంతల మయంగా ఉన్నాయి. ఈ రోడ్డు గుండానే ఎక్కువమంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం హరిదాస్పల్లి, చింతకుంట గ్రామాలకే కాకుండా మండలంలోని మైలారం, నాగారం, తరిగోపుల, అంతారం, వివిధ తండాలను కలుపుకొని రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాంత రోడ్లు, వంతెనలు పూర్తి చేయాలని ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావటానికి అతి దగ్గరగా ఉండే చింతకుంట పానాదిని విస్తరించి తారు రోడ్డుగా అభివృద్ధ్ది పరిస్తే ఆయా గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని కోరుతున్నారు. అప్పటి ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ నుంచి రోడ్డు, వాగుపై వంతెన నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు మంజూరు చేసింది. పనులను చేజిక్కించుకున్న గుత్తెదారు చింతకుంట గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర నామమాత్రంగా తారు రోడ్డును నిర్మించారు. వాగుపై వంతెన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్ గోడలు వేసి పనులను అసంపూర్తిగా వదిలేశారు. దీంతో మండల కేంద్రానికి దగ్గర అవుతుందని, పానాదిని విస్తరిస్తే తమ రవాణ సౌకర్యం మెరుగుపడుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అసంపూర్తిగా వదిలివేసిన వంతెనతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పలుమార్లు మండల సర్వ సభ్య సమావేశంలో ప్రస్తావించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దశాబ్దాలు గడుస్తున్నా ఎక్కడి సమస్య అక్కడే ఉంది. మండల కేంద్రానికి రావటానికి మూడు కిలోమీటర్లే ఉన్నా అసంపూర్తి వంతెన కారణంగా హరిదాస్పల్లి మీదుగా ఉన్న తారు రోడ్డుగుండా అదనంగా ఆరు కిలోమీటర్లు ఎక్కవ ప్రయాణిస్తున్నారు. వరదలు వస్తే చింతకుంట
సమీపంలోని అసంపూర్తి వంతెనతో రాకపోకలు పూర్తిగా నిలిచి పోతాయి. గతంలో వరదలు వచ్చి వాగులో కొట్టుపోయిన సందర్భాలూ ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి వంతెన, శిథిలమైన రోడ్డుతో సతమతమవుతున్నామని పలుమార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తెలియజేసినా స్పందించటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పలు గ్రామాలకు ఉపయోగపడే వంతెన, రహదారిని మెరుగుపరచాలని ఆ దిశగా పనిచేసే నాయకులకే తమ మద్దతు ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి వంతెన నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నారు.