Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
మున్సిపాలిటీగా ఏర్పడితే శంషాబాద్ భాగా అభివృద్ది చెందుతుందని భావిస్తే పరిస్థితులు మరింత దిగజారాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. గణేష్గుప్త అన్నారు. శంషాబాద్లో పారిశుధ్యం, నీటి సమస్య ప్రజలు ఫిర్యాదులు బస్తీ సమస్యలపై పట్టణ టీడీపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడితే మేజర్ పంచాయతీగా ఉండి మరింత అభివృద్ధి చెందుతుందని భావించామని తెలిపారు. కానీ పరిస్థితులు గతం కంటే దిగజారాయన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో శంషాబాద్ మున్సిపాలిటీ ఆధ్వాన్యంగా తయారైందని ప్రజలు తమ సమస్యలు ఎవ్వరికి చెప్పుకున్నా పరిష్కరించే పరస్థితి లేదన్నారు. కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడితే అధికారులకు కొంత సమయం ఇచ్చి ఫిర్యాదుల ఇచ్చామన్నారు. పిర్యాదులు ఇచ్చి నాలుగు నెలలు అయినా పనులు మాత్రం జరగడం లేదని తెలిపారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు శంషాబాద్లో ఆయా బస్తీల్లో ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు చొరవ తీసుకుని వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, సానిటేషన్ వంటి అనేక సమస్యలు పరిష్కరించేవారన్నారు. పంచాయతీ పాలక వర్గం పదవి కాలం ముగిసిన తరువాత శంషాబాద్తో పాటు ఆరు గ్రామాలను శంషాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారన్నారు. అధికారులు శంషాబాద్ను స్వాధీనం చేసుకున్న తరువాత ఏ ఒక్క పనికూడా సక్రమంగా చేయడం లేదని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు స్పందించడం లేదన్నారు. జాతీయ రహదారి 44పై మాత్రమే అధికారులు పనులు చేయిస్తున్నారని శంషాబాద్లోని 22 కాలనీల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయన్నారు. మంచీనీటి కోసం ప్రజలు తిప్పలు పడాల్సి వస్తోందన్నారు. వీకర్సెక్షన్ కాలనీ, అహ్మద్నగర్ కాలమక్త బహదూర్ కాలనీల్లో పరిస్థితులు దిగజారాయన్నారు. శంషాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే మున్సిపాలిటీలో కలిసిన కొత్వాల్గూడ, చిన్నగొల్లపల్లి, తొండుపల్లి, సాతంరాయి గ్రామాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. దోమలు, ఈగలు విజృంభించి నాలుగు గంటలకే తలుపులు బిగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుందన్నారు. అధికారుల హైవే పై పెట్టిన శ్రద్ధ కాలనీల్లోని సమస్యలపై పెట్టడం లేదని వాపోయారు. ప్రతి బస్తీలో మురుగు ప్రవహిస్తున్నందున పందులు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా, టైపాయిడ్ విషజ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నారని తెలిపారు. ప్రతి కాలనీల్లో కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటున్న అధికారులు నిధులున్నా సమస్యలు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మాజీ ఎంపీటీసీ ఎండీ జహంగీర్ఖాన్ యాబై వేల రుపాయలతో ఫాగింగ్ మిషన్ ఇప్పించినా ఇప్పటికి అధికారుల ఫాగింగ్ చేయించకపోవడంలో ఆంతర్యమేంటనీ ప్రశ్నించారు. అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా టోకెన్ నంబర్ ఇచ్చి పనులు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో అధికారులు సర్పంచ్లు పనిచేయకుంటే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తున్నారని, మరి ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. మరో ఐదు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, లేని యెడల ప్రజలతో కలిసి మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎండీ జహంగీర్ఖాన్, పి. జ్ఞానేశ్వర్యాదవ్, రాచమల్ల దాసు, పి. సుదాకర్గౌడ్, పల్లెమోని కృష్ణ, ఇ. అజరు, హన్మంత్, ఎండి అజ్మత్, జె. శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, కె.శ్రీనివాస్, పి. సుభాష్గౌడ్, ఎం. పవన్, దర్శన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.