Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల విధానాల వల్లనే కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని సాయిరాం మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఐ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తారని, క్రమేణా ఎన్నికల విధి విధానాల వల్లే కమ్యూనిస్టుల ప్రభావం తగ్గుతుందన్నారు. నెహ్రూ నాటి కాలంలోనే కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీచేసిన వారికి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన సంఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు ప్రజల్లో బలంగా ఉండటం వలన కమ్యూనిస్టుల ప్రాభల్యం అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఎన్నికలంటేనే డబ్బు మద్యమని అన్నారు. అధికార కాంక్షతో పార్టీలు అనేక హామీలు గుప్పించిందని, అధికారం వచ్చాక హామీలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షాలను అదిమి పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ఫిరాయింపులను ప్రోత్సాహిస్తూ శాసనసభ, పార్లమెంటు సభా పక్షాలను విలీనం చేసినట్టు ప్రకటనలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్లేషణాత్మక కథనాలను పరిశోధనాత్మక వార్తలను ప్రచురించిన పత్రికలపై పాత్రికేయులపైన కక్షపూరితంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి, వారి శ్రేయస్సుకు నిరంతరం ప్రభుత్వాలపైన కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉంటారన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి నాయకులు పానుగంటి పర్వతాలు, మండల కార్యదర్శి శీను నాయక్ నాయకులు జంగయ్య, విఠల్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గిరి గౌడ్, నియోజకవర్గ కార్యదర్శి పవన్ చౌహాన్, మండలం కార్యదర్శి శివ, వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.