Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
భారతదేశం యువతలో ప్రతిభకు కొదవలేదని, ప్రతిభను గుర్తించి, వారికి నైపుణ్యాన్ని అందించడం ద్వారా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పోటీని తట్టుకునేలా నైపుణ్యాభివృద్ధి జరగాలన్నారు. ఆ దిశగా యువతకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించి, పద్మ అవార్డు గ్రహీతలకు చిరు సత్కారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. భారతదేశానికి యువశక్తే ప్రధాన బలమని కార్పొరేట్ రంగం, ప్రయివేటు, స్వచ్ఛంద సంస్థలు తోడుగా నిలిస్తే మరిన్ని అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చున్నారు. ప్రతిభను గుర్తించడం, ఆ వ్యక్తికి మాత్రమే దక్కిన గౌరవం కాదని సాధించిన విజయాలను, నడిచిన బాటను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుని ఏడు దశాబ్దాలుగా సాహిత్య సేవ చేస్తున్న శ్రీ భాష్యం విజయసారథి, నాలుగు దశాబ్దాలుగా మట్టితోనే మట్టిని సారవంతం చేస్తూ అద్భుత వ్యవసాయ ఫలితాలు అందుకుంటున్న చింతల వెంకట్ రెడ్డి, అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్న కుమారి పీవీ సింధు వంటి వారిని స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మానించడం శుభపరిణామమన్నారు. సమాజసేవలో 2001లో నెల్లూరులోని వెంకటాచలంలో స్థాపించినప్పటినుంచీ స్వర్ణభారత్ ట్రస్ట్ నెల్లూరుతో పాటు హైదరాబాద్, విజయవాడ చాప్టర్ల ద్వారా 250కి పైగా ప్రముఖ ఆస్పత్రుల నేతృత్వంలో వైద్య శిబిరాలను నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. దేశంలో అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో స్వచ్ఛతపై చైతన్యం తీసుకురావడం, పట్టణాల్లోని ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టు నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఉచిత వైద్య శిబిరంలో 438 మంది వైద్య సహాయం పొందారని ట్రస్ట్ యాజమాన్యం వారు తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్టు చైర్మెన్ కామినేని శ్రీనివాస్, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు చిగురుపాటి క ష్ణప్రసాద్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, యశోద ఆసప్రత్రి చైర్మెన్ జీఎన్ రావుతో పాటు పద్మ అవార్డు గ్రహీతలు శ్రీ భాష్యం విజయసారథి చింతల వెంకట్ రెడ్డి, కుమారి పూసర్ల వెంకట సింధుతో పాటు వైద్యులు, వివిధ రంగాల ప్రతినిధులు, స్వర్ణభారత్ ట్రస్టు నైపుణ్యాభివృద్ధి కేంద్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.