ఆమె స్వాతంత్య్ర సమరయోధుడి భార్య. స్వాతంత్య్రోద్యమంలో తెల్లవాళ్లపై పోరాట సమయంలో భర్తకు తోడునీడగా నిలిచింది. కానీ తన జీవిత చివరి అంకంలో కుల చిచ్చులో కూరుకుపోయింది. కులబహిష్కరణకు గురికావడంతో సన్నిహితులకు తెలిసిన వాళ్లకు దూరమైంది. ఆమె మరణించిన తర్వాత దహన సంస్కారాలకు కులం వాళ్లు ఎవరూ రాకపోవడంతో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చిలుకూరు గ్రామానికి చెందిన చిలివేరి గురవయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. గతంలో ఆయన చనిపోయారు. ఆయన భార్య నర్సమ్మ గత శుక్రవారం మృతిచెందింది. ఆమె కుమారుడు చిలివేరు రామలింగయ్య కులపెద్దగా వ్యవహరిస్తున్నాడు. చిలుకూరు గ్రామంలో ఉమ్మడి కుటుంబానికి చెందిన కుటుంబాలు 60వరకు ఉన్నాయి. అయితే 6నెలల క్రితం అదే గ్రామానికి చెందిన పాలివాడైన చిలివేరు ఆంజనేయులు కొంతమంది కులస్తులతో కలిసి, తానే కులపెద్దగా వ్యవహరిస్తున్నాడు. ఆయన సాక్షర భారత్ కోఆర్డినేటర్గా పనిచేయడంతో ప్రభుత్వ పథకాల విషయంలో కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో ఆ కులం వాళ్లు అతని వైపు మొగ్గుచూపారు. గ్రామంలో మిగతా కులాల పెద్దలు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. దీంతో ఆంజనేయులు ఆగ్రహం పెంచుకొని చిలివేరు రామలింగయ్య, నర్సమ్మను కులం నుండి బహిష్కరించారు. కులానికి చెందిన ఎవరైనా వారి ఇంటికి వెళ్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఆ కులానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో శుభకార్యానికి చిలివేరు రామలింగయ్య కుటుంబాన్ని ఆహ్వానించాడు. దీనిపై ఆగ్రహించిన ఆంజనేయులు కుల పంచాయితీ పెట్టి, ఆ వ్యక్తిని హెచ్చరించి, రూ.వెయ్యి జరిమానా విధించాడు. దీంతో కులం వాళ్లు బయపడి ఆయన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. శుక్రవారం రామలింగయ్య తల్లి నర్సమ్మ(102) మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు కూడా కులం వాళ్లు ఎవరూ వెళ్లవద్దని ఆంజనేయులు ఆదేశించడంతో ఆ కుటుంబాల్లో ఏ ఒక్కరూ రాలేదు. దీనిపై గ్రామపెద్దలు ఆంజనేయులుతో మాట్లాడినా, ఆ కుటుంబాన్ని బహిష్కరించాం. అక్కడికి వచ్చేది లేదని చెప్పాడు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల సహకారంతో చివరికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
సెల్: 8790271358
అతనిపై చర్యలు తీసుకోవాలి
చిలుకూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు మా కుటుంబాన్ని బహిష్కరించాడు. అతను సాక్షరభారత్ కోఆర్డినేటర్గా ప్రభుత్వ పథకాల పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో కులంలో అందరూ అతని మాట వింటున్నారు. సాక్షర భారత్ కోఆర్డినేటర్గా కుల బహిష్కరణను అరికట్టాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అతనిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలివేరు రామలింగయ్య కుమారుడు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
- చిలివేరు వెంకటేశ్వర్లు
Authorization