ఔను.. దళితులు గెలిచారు..! 'అంబేద్కర్' కోసం చేసిన ఆత్మగౌరవ పోరాటంలో అడ్డంకులెదురైనా ఐక్యంగా నిలిచారు. ఒక్కటిగా ముందుకు సాగుతూ అనుకున్నది సాధించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణ పెత్తందారీతనం కేవలం పదుల కుటుంబాలతోనే మొదలైన ప్రతిఘటన రాష్ట్ర నలుమూలల నుండి మేధావులను, యువతను రేకులపల్లికి రప్పించింది. వేలాది మంది సాక్షిగా జాతి సమగ్రతకు జీవితాన్ని త్యాగంజేసిన మహానుభావుడిని 'జై భీం.. జై భీం..' ధ్వనుల నడుమ ప్రతిష్ఠించారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా అగ్రకులతత్వం అడ్డుకున్న వైనం ఆలస్యంగా వెలుగుజూసిన విషయం విధితమే. గ్రామ బస్టాండ్ సమీపంలో విగ్రహం పెట్టుకుంటామనే దళితుల విన్నపం మేరకు గ్రామ పాలకవర్గం తీర్మానం చేసి గత సెప్టెంబర్ 13న భూమిపూజ చేసింది. అయినప్పటికీ అగ్రకులస్తులు కొందరు అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భూమిపూజ అనంత రం నిర్మాణ పనులు ప్రారంభమైనా వారం రోజుల తర్వాత జరిగిన గ్రామసభలో పెత్తందార్లు అభ్యం తరం తెలిపారు. 'నడి ఊర్లో మాలోడి విగ్రహం ఎలా పెట్టుకుంటారు, విగ్రహం ఉంటే వర్షాలు పడవు, ఊరికి అరిష్టం, కరువు వస్తది' అంటూ విషప్రచార పర్వానికి తెరలేపారు. నడిఊర్లో కాకుండా ఊరి బయట పెట్టుకోవాలంటూ దళితులను బెదిరించారు. రాకపోకలకు అంతరాయం కలుగుతుందని జనాలను ప క్కదారి పట్టించారు. అనంత రం దళిత కాలనీకి చెరువు నుండి నీళ్లు రాకుండా పైపు లైన్లు ధ్వంసం చేశారు. పరిస్థి తి చినికిచినికి గాలివానలా మారడం, నెల రోజులు గడు స్తున్నా వివాదం సద్దుమణ గకపోవడంతో 'నవతెలంగాణ' దృష్టికి వచ్చింది. దీంతో ఈ నెల (అక్టోబర్) 8వ తేదీన 'అంబేద్కర్ విగ్రహముంటే వానలు పడవంట' అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి పోలీసు యంత్రాంగం కదిలింది. రాష్ట్ర నలుమూలల నుండి మేధావులు, యువత.. దళితుల కు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రవీందర్రెడ్డి, ఏసీపీ ఆనంద్ కుమార్, మండల తహసీల్దార్ రమేష్లకు దళితులు ఫిర్యాదు చేశారు. తదనంతరం పోలీసు ఉన్నతాధి కారులు స్పందించి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయతీ తీర్మానం, సర్పంచ్ భూమిపూజ చేసిన తర్వాత వివాదం ఎలా తలెత్తిందని వీడీసీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ ఆనంద్కుమార్ నేరుగా వెళ్లి సర్పంచ్ సోఫియా బేగం, గ్రామస్తుల సమక్షంలో విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. గొడవకు కారణమైన ప్రవీణ్రెడ్డి ప్రస్తుతం జైళ్లో ఊచలు లెక్కబెడుతుండటంతో దళితుల్లో భరోసా ఏర్పడింది.
'చలో రేకులపల్లి'తో దద్దరిల్లిన గ్రామం
నవతెలంగాణ వరుస కథనాలతో స్పందించిన దళిత నాయకులు, విద్యావంతులు, సైనిక్ దళ్ సభ్యు లు అక్టోబర్ 23న 'చలో రేకులపల్లి'కి పిలుపునిచ్చా రు. ఈ పిలుపుతో చేయిచేయి కలిపిన దళితులు ఆయా జిల్లాలు, గ్రామాల నుండి పెద్దఎత్తున తరలివ చ్చారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి విద్యార్థులు సైతం వచ్చి తమ గళాన్ని వినిపించారు. దళిత నాయకులు సావెల్, గట్టుమీది మాణిక్యం, రచయిత రేంజర్ల రాజేశ్ ఆధ్వర్యంలో సుమారు 2800 మంది గ్రామానికి చేరుకుని నిన దించారు. గ్రామంలో సభ ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాత మహోన్నతను చాటిచెప్పారు. రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహనీయుడు నిర్మించిన రాజ్యాంగం నీడలో నేడు యావత్ భారతదేశం ఉన్నదని, ఆయన నిర్మించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవ్వరు చేసినా ఉపేక్షించొద్దని పిలుపునిచ్చారు. దళితులపై జరుగు తున్న అన్యాయాలను అందరూ సమిష్టిగా పోరాడి ఎదుర్కోవాలని ఉత్తేజ పరిచారు. అదేరోజు సాయం త్రం 5 గంటల ప్రాంతంలో వేలాది మంది నడుమ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టారు. త్వరలోనే ప్రజా యుద్ధ నౌక గద్దర్ వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించను న్నట్టు తెలిసింది. అప్పటివరకు ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతిరోజూ పదిమంది దళితులు రాత్రిపూట పహారా కాస్తున్నారు.
అడ్డొస్తే పోరాడుతూనే ఉంటాం
సామాజిక పరివర్తన, సామాన్యుల హక్కుల కో సం పోరాడిన బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డు కోవడం శోచనీయం. అలా ంటి వారెవరైనా కఠినంగా శిక్షించాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హక్కులు వారికి చెంద కుండా అడ్డొస్తే సహించేది లేదు. ఎంతవరకైనా తెగిస్తాం. పోరాడుతూనే ఉంటాం.
గట్టు మాణిక్యం, ఆర్మూర్ డివిజన్ దళిత ఐక్య సంఘం అధ్యక్షుడు
గాంధీ విగ్రహాలు ఎలా పెట్టారు?
మహాత్మాగాంధీ విగ్రహాలు గ్రామాల్లో ఎవరి అనుమతి తీసుకుని పెడుతున్నారు? దీనికి అగ్రవర్ణాలు సమాధానం చెప్పాలి. చరిత్రలో నిలిచిపోయే రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడి విగ్రహాన్ని పెట్టేందుకు అనుమతి కావాలా..? అంబేద్కర్ దళితుడు కాబట్టి అడ్డుకుంటున్నారు. అగ్రవర్ణాల వివక్షను నిర్మూలించే దిశగా ఉద్యమిస్తాం.
రేంజర్ల రాజేష్, రచయిత, గాయకుడు
ఐక్యతతోనే సాధ్యమైంది
రేకులపల్లి గ్రామస్తుల ఐక్యతతోనే సాధ్యమైంది. ఈ ఐక్యతను కొనసాగిం చాలి. కుల వివక్ష వంటి విషయాలు ఎదురైతే ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు అవసరం.
గంగాధరప్ప, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నిజామాబాద్
- మహ్మద్ అజ్మత్
సెల్ : 9492209286
Authorization