ఏస్థాయిలో ఉన్నా దళితులపై చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. సమాజంలో అనేక సంఘటనలు ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చివరికి ఓ దళిత యువ అధికారి ఆత్మహత్య ఘటనలోనూ ఈ వివక్ష కొనసాగటం గర్హణీయం. ఆత్మహత్యకు పైఅధికారుల వేధింపులే కారణమని బాధితుడు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు అధికారిని నేటికీ అరెస్టు చేయలేదు.
ఉన్నతాధికారుల వేధింపుల వల్ల యువ ఇంజినీర్ దేవిశ్రీకాంత్ గత ఆగస్టు 24న ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన దేవి పోచయ్య- శ్రీలత దంపతుల కుమారుడు శ్రీకాంత్. ఉన్నత చదువులు పూర్తిచేసి 2015లో టీఎస్పీఎస్సీ చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఎంపికయ్యాడు. ఉద్యోగంలో భాగంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో క్వాలిటీ కంట్రోలర్గా విధులు నిర్వహించేవాడు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్కు చెందిన శ్రీలక్ష్మితో వివాహం జరిగింది. అంతా సక్రమంగా సాగిపోతున్న వీరి జీవితాన్ని కులదురహంకారం విచ్ఛిన్నం చేసింది. కాంట్రాక్టర్ల వద్ద లంచం తీసుకుని ఇవ్వాలని పైఅధికారిగా ఉన్న జిల్లా ఈఈ రఘువీరారెడ్డి వేధించాడు. అందుకు అంగీకరించని శ్రీకాంత్ను వేధింపులకు గురిచేయంతోపాటు 'మాలోడివైన నువ్వు దొరలాగా ప్రవర్తిస్తున్నావు' అంటూ కులం పేరుతో దూషిస్తూ అవమానికి గురిచేశాడని భార్యతో చెప్పుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సెలవు కావాలని ఈఈ రఘువీరారెడ్డిని కోరగా మంచిర్యాలలోని తన ఆఫీసుకు పిలిపించుకుని 'నువ్వు పిచ్చోడివిరా.. నీకు ఉద్యోగం ఎందుకు' అని బూతులు తిట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీకాంత్ తనకు చావాలని ఉందని సూసైడ్ నోట్ రాసి ఆగస్టు 22న భార్యకు మెయిల్ చేసి ఇంటినుండి వెళ్లిపోయాడు. 23న కుటుంబ సభ్యులు వెల్గటూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. 24న మండలంలోని గుల్లకోట శివారులోని పొలం వద్ద ఉరేసుకుని మృతిచెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఇలా ఉన్నతాధికారి కులదురహంకారం, అవినీతికి ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత యువ అధికారి 30 ఏండ్లకే తనువుచాలించాల్సి వచ్చింది. భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నేటికీ వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు కారణమైన ఈఈ రఘువీరారెడ్డిని పోలీసులు అరెస్టు చేయలేదు.
ఈ ఘోర ఘటనపై పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కేవలం బాధ్యుడైన ఈఈ రఘువీరారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి ఇప్పటి వరకూ అతన్ని అరెస్టు చేయకపోవడాన్ని మృతుడి తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళిత ఉద్యోగులపై పెత్తందార్లకు చెందిన ఉన్నతాధికారుల వేధింపుల వల్ల మరణించినప్పుడు పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించాల్సి ఉంది. బాధ్యులకు శిక్ష పడేలా చేసి కిందిస్థాయి ఉద్యోగుల్లో, వారి కుటుంబసభ్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిందిపోయి నెలలు గడుస్తున్నా అరెస్టు చేయకపోవడంపై డబ్బులు, పలుకుబడి ఉంటే ఏమీ కాదనే భావం ఏర్పడుతుందని పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఈఈ రఘువీరారెడ్డిని వెంటనే అరెస్టు చేసి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుని మరొకరు ఇలా చేయకుండా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని కోరుతున్నారు.
దళితులనే వివక్షతోనే..
దళితులు అనే వివక్షతోనే వేధింపులకు గురిచేసి నా కొడుకును పొట్టన పెట్టుకున్నారు. చనిపోయాక కూడా మాపై వివక్ష చూపుతున్నారు. ఇప్పటి వరకు నా కొడుకు చావుకు కారణమైన రఘువీరారెడ్డిని అరెస్టు చేయలేదు. రఘువీరారెడ్డిని వెంటనే అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలి. నాకొడుకులా మరెవరికీ ఇలాంటి వేధింపులు జరగకూడదని కోరుకుంటున్నా.
దేవి పోచయ్య, శ్రీకాంత్ తండ్రి
నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి
ఉన్నతాధికారి అవమానాలకు గురిచేయడంతో దేవిశ్రీకాంత్ చనిపోయి 2నెలలు దాటినా కారకులను అరెస్టు చేయకపోవడం దారుణం. తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారు. వెంటనే అరెస్టు చేసి పోలీసుల పనితనాన్ని నిరూపించుకుని శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, రూ.30లక్షల ఎక్స్గ్రేషియ ఇవ్వాలి.
నల్ల శ్యామ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్, జగిత్యాల
వారం రోజుల్లో పట్టుకుంటాం
శ్రీకాంత్ మృతికి కార ణమైన రఘువీరారెడ్డిని ప ట్టుకోవడానికి మా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు రెండుసార్లు వెళ్లారు. రెండు నెలల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు. తప్పుచేశాడని భావించి ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నట్టు భావించి కోర్టు కొట్టివేసింది. ఎంత పెద్ద వ్యక్తి అయినా తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే. మేం వారంరోజుల్లో అతన్ని పట్టుకుంటాం.
శ్రీనివాసరావు, ధర్మపురి సీఐ
- పులి లక్ష్మణ్
సెల్ : 7730900980
Authorization