'కులమా! అదెక్కడ' అని ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా భారతదేశ సమాజం కుల పునాదుల నిర్మితం. అది హిందూ మత పునాదిగా ఏర్పడింది. కులానికి మూలాలు హిందుత్వంలో ఉన్నాయి. అందుకే పరిపూర్ణానందస్వామి లాంటి హిందూ పీఠాలు 'మా మూలాల్ని టచ్ చేస్తున్నారు. మా మూలాలు టచ్ చేస్తే భస్మం చేస్తామని' బెదిరిస్తున్నాయి. ప్రొఫెసర్ కంచ ఐలయ్య పదేండ్ల కింద 'నేను హిందువునెట్లయిత' అనే రచనతో హిందూ వ్యవస్థ మీద ఒక బాంబేసి హిందుత్వాన్ని కకావికలం చేసిండు. ప్రపంచ దేశాలముందు భారతదేశం హిందూ ఆధ్యాత్మిక దేశమని ప్రకటించుకోవడమే కాక ఇక్కడ మెజారిటీ ప్రజలైన దళిత, ఆదివాసీ, బీసీలను కూడా హిందువులని బుకాయిస్తున్న హిందూ ఫాసిజాన్ని ప్రశ్నిస్తూ 'నేను హిందువునెట్లయిత'తో పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేసిండు. భారత మెజారిటీ వెనుకబడిన కులాలకు ''అవును నిజమే, మేము హిందువులం కాము, మా ఆచార వ్యవహారాలు, ఆహారాలు హిందూ కట్టడిలో ఇమడవనేది'' స్పష్టమైంది. మాకు లోకల్ నమ్మకాలకు, ప్రకృతికి సంబంధించిన ఆధ్యాత్మికం అనే స్వంత అస్తిత్వ స్పృహ మొదలైంది. మనుషుల్ని పశువులకంటే హీనంగా చూసే హిందూ మతం మా మతం కాదు. మాది ఎల్లమ్మ మతం, పోచమ్మలోల్లమనే చారిత్రక భౌతిక తాత్విక అవగాహనలోకి తిరిగే ఒక క్రమం మొదలైంది. ఆవు జంతువు కాదు, బర్రె, దున్నపోతులు మావి. మాది నల్ల సంస్కృతి. మేము ఆవుల్ని తింటాం. ఆవు మాంసం మా ఆహారం. దున్నపోతులు, బర్రె మా జంతువులు. మా వ్యవసాయం, పాడి, పంటలు, అభివృద్ధి నాగరికత అంతా బర్రె, దున్నపోతులతో సాగిందనేది బర్రె మా జాతీయ జంతువని ప్రకటించడంతో హిందూత్వ జాతికి మరో బలమైన దెబ్బ. ఆవు పూజనీయం కాదు, ఆవును కోసుకొని తినడం మా సంస్కృతి, ఆహార సంస్కృతిగా విశ్లేషించడం, ఆవు గోమాత, హిందూమాత, పూజనీయం చేసి ఆవును తినడం నిషేధించి, తినేవాళ్లను చంపే ఆవు రాజకీయాలను అంగీకరించలేము. అదే కొనసాగింపులో ఈ భారతదేశానికి ఏ కుల సామాజిక వర్గాలు ఏమీ సేవ చేసినరు. ఏయే కుల సమూహాలు ఏం అభివృద్ధి చేసినరు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యమెంత, సర్వీసెంత అని 'హిందూ మతానంతర భారతదేశం' పదేండ్లనాడు ఒక చారిత్రక విశ్లేషణతో కంచ ఐలయ్య 13 అధ్యాయాలతో ఒక పుస్తకం తీసుకొచ్చాడు ఇంగ్లీషులో. దాంట్ల హిందూ కుల వ్యవస్థ వృత్తి పుట్టుక పునాదులతో వివక్షను నిర్మించిన క్రమం చెప్పాడు. అలాగే ఒక్కో కుల సమూహమైన మాదిగలు, గిరిజనులు, మాలలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, గౌడులు, యాదవులు, శూద్రులు వంటి సబ్బండ కులాలు ఈదేశానికి తమ జ్ఞానాన్నందించారు. శాస్త్రజ్ఞులుగా, ఉపాధ్యాయులుగా, ఉత్పత్తి సైనికులుగా, సామాజిక వైద్యులుగా, ఆర్థిక వేత్తలుగా, ఇంజనీర్లుగా, ఆహార ఉత్పత్తిదార్లుగా, దేశాభివృద్ధికి చాలా గొప్ప సర్వీసునందించారు అని విశ్లేషణ చేస్తూ బ్రాహ్మణ కులం ఆధ్యాత్మిక నియంతలుగా ఎలాంటి ఉత్పత్తిలో భాగస్వామ్యం కాకుండా మెజారిటీ కులాలచే వెట్టి చేయించుకొని బతికారు. మనువాదంతో వారికి చదువు మానవ హక్కులు, వారి ఆత్మ గౌరవాలకు సంబంధించిన మానవ విలువల్ని దూరం చేసిన కులం బ్రాహ్మణ కులంగా విశ్లేషించాడు. ఆ క్రమంలోనే కోమటికులంను సామాజిక స్మగ్లర్లుగా చారిత్రకంగా విశ్లేషణ చేశాడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య. ఈ చారిత్రక విశ్లేషణల్ని స్వచ్చందంగా ఒప్పుకొని ఆ తప్పిదాల్ని పునరావృతం కాకుండా ఆత్మ పరిశీలన చేసుకునే ఒక ప్రజాస్వామ్య సంస్కృతి మన కుల అజమాయిషీ సమాజానికి లేదు. ప్రజాస్వామ్య పరిపక్వతలు కుల సమాజంలో కల్పించవు. అందుకే కొందరు దాడులకు పాల్పడుతున్నారు. ఆడవాళ్ల చేత బూతులు తిట్టిస్తున్నారు. ఇంకా అప్రజాస్వామికమైన (ఐలయ్య బొమ్మల్ని తొక్కించటం, మూత్రం పోయించటం) నిరసనలు చేయిస్తున్నారు. ఇంకోపక్క పీఠాధిపతుల్ని తమ ఏజెంట్లుగా మీడియా చర్చలకు పంపిస్తూ విషయం మీద చర్చ చేయకుండా రచయితని విదేశీ ఏజెంటు అని, క్రిష్టియన్ ఏజెంట్ అని బురద జల్లిస్తున్నారు. ఇంకా వీరి నాయకుడు టిజి.వెంకటేష్ అయితే రోడ్డు మీదే ఉరేస్తామని రెచ్చగొట్టాడు. 'భావ ప్రకటన స్వేచ్ఛను బ్యాన్ చేయలేమనే సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికీ, చారిత్రకారులకూ, మేధావులకూ విజయంగా భావించవచ్చు. అందుకే టిజి.వెంకటేష్ ప్రెస్మీట్ పెట్టి తను రెచ్చగొట్టిన దురుసు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోక తప్పలేదు. కంచ ఐలయ్య విశ్లేషణతో అందరూ ఏకీభవించాలన్న బలవంతం ఏమీ లేదు కదా! నచ్చని వారు లేదా విభేదించేవారు ఆ పుస్తకాన్ని ఖండిస్తూ మరో పుస్తకం రాయవచ్చు. పత్రికలలో వ్యాసాలు రాయవచ్చు. అంతేతప్ప తనకు నచ్చని భావాలు ఎవరూ వ్యక్తీకరించవద్దనటం, రాయవద్దనటం అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం. అదే సుప్రీంకోర్టు చెప్పిన సారాంశం. 'మా మనోభావాలు దెబ్బతిన్నయి' పుస్తకాన్ని నిషేధించాలని కోర్టులకు, గొడవలకు పోతున్నరు. కానీ దాదాపు 90శాతంగా ఉన్న మా బడుగు, బలహీన వర్గాలను మనుధర్మ శాస్త్రాల నుంచి పురాణాల్నిండా, సాహిత్యాల్నిండా నిత్య జీవితంలో మమ్మల్ని మా కులాల్ని అడుగడుగునా అవమానిస్తున్నప్పుడు దెబ్బతిన్న మా మనోభావాల గురించి మాట్లాడిండ్రా? ''మమ్మల్ని మనుషులుగా బతకనివ్వని మీ మనుధర్మ శాస్త్రాల్ని, పురాణాల్ని నిషేధించండి ముందు'' అని మెజారిటీ జనం సమాయత్తమవుతున్నరు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దళితులూ, గిరిజనులూ, వెనుకబడిన తరగతుల సమూహాలు విస్తృతంగా సభలు, సమావేశాలు పెట్టి హిందుత్వ ఆధిపత్య రాజకీయాలతో తలపడుతున్నయి. ఈ సందర్భంగా యావద్భారతదేశంలో అణచివేతకు గురవుతున్న జనం హిందుత్వంమ్మీద చేసే రచనలు, చరిత్రలు, ప్రతిఘటనలు రేపటి నూతన రాజ్యానికి సాంస్కృతిక పునాదులు కావాలి. కుల రహిత సమాజానికి బాటలు వేయాలి.
- జూపాక సుభద్ర
సెల్ : 9849905687
Authorization