'ఏ జంతు జాలానికీ, పక్షిజాతులకూ లేని కులం మనుషులకు ఎలా వచ్చింది. ఏ దేశంలో లేని కులం భారతదేశానికి ఎలా వ్యాపించింది' అని ప్రశ్నిస్తూ కులానికి మానవశాస్త్ర పరిణామ దృష్టితో వ్యాఖ్యానించిన వ్యక్తిగా అంబేద్కర్ను చెబుతారు. అలాంటి మహనీయుడు సైతం తనపైనే వివక్ష ప్రదర్శిస్తారని ఊహించి ఉండడు. ఆయన విగ్రహాలే మనుషుల మధ్య ఒకమాదిరి ఘర్షణ వాతావరణానికి దారితీస్తాయని పసిగట్టకపోయి ఉండొచ్చు. విగ్రహాలుంటే వానలు పడవని ఒకచోట.. ఆధిపత్య వర్గాల ఇండ్ల మధ్య పెట్టరాదని మరోచోట... అసలు గాంధీ విగ్రహం పక్కనే నిలపొద్దని ఇంకోచోట.... ఇలా ఏవేవో కారణాలతో 'అంబేద్కర్'కు అవమానాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ దళితులు ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తుండటం నిజామాబాద్ జిల్లాను ఆవేదనకు గురిచేస్తోంది.
ఇస్సపల్లి.. రేకులపల్లి... ఈ రెండు గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రతిష్ఠాపన కోసం దళితులు పెద్ద పోరాటమే చేశారు. ఐక్యంగా కొనసాగించిన ఆత్మగౌరవ పోరాటంలో ఎన్ని అడ్డంకులెదురైనా కడవరకూ ఒక్కటిగా నిలిచి గెలిచారు. సంఘటితంగా అనుకున్నది సాధించామని యావత్ సమాజానికి స్ఫూర్తి రగిల్చారు. రేకులపల్లి దళితుల పోరాటం గడిచిన వారం రోజులకే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల బోర్గాం(పి)లో అంబేద్కర్కు మరో అవమానం ఎదురైంది. పంచాయతీ సమీపంలో స్థలం లేదనే పేరుతో ఊరుచివర పెట్టుకోవాలంటూ అగ్రకులస్తులు అడ్డుతగిలారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని దళితులు, జిల్లావ్యాప్తంగా దళిత సంఘాలు మరోమారు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. మోపాల్ మండలం బోర్గాం(పి) గ్రామంలో దాదాపు 7వేల జనాభా ఉంటుంది. బీసీ, ఓసీ కులస్తులు మోజార్టీగా ఉండగా 130 దళిత కుటుంబాలు, ఇతర కులస్తులు జీవిస్తున్నారు. నిజామాబాద్ పక్కనే వుండటం, స్థానిక ప్రభుత్వ పాఠశాలకు మంచి గుర్తింపు కూడా ఉండటంతో గ్రామం కాస్త అభివృద్ధి దిశగానే నడుస్తోంది. సర్పంచ్ కూడా దళితుడే. ఈ నేపథ్యంలో ఊళ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటామని గ్రామస్తులు కొన్ని నెలలుగా కోరుతున్నారు. దీంతో గత నెల 3వ తేదీన నిర్వహించిన గ్రామసభలో అందరి సమక్షంలోనే తీర్మానించారు. గ్రామపంచాయతీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ప్రతిష్ఠించుకోవచ్చునని సూచించారు. దీనికి అందరూ అంగీకరించారు. సరిగ్గా మూడురోజుల తర్వాత భూమిపూజ చేస్తుండగా.. కొందరు వీడీసీ సభ్యులు, మాజీ సర్పంచులు (అందరూ అగ్రవర్ణాలే) అక్కడికి చేరుకున్నారు. ఊరందరి సమక్షంలో భూమిపూజ చేద్దామని నమ్మించారు. దీంతో అదేరోజు దండోరా వేయించి గ్రామస్తులందరూ అంబేద్కర్ విగ్రహ భూమిపూజకు రావాలని ప్రకటించారు. మరుసటి రోజు వందల సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. భూమిపూజకు సిద్ధమౌతున్న క్రమంలో 'నడిఊళ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టరాదు. గ్రామపంచాయతీ (జీపీ) వద్ద స్థలం సరిపోదు. వాహనదారులకు ఇబ్బందులు వస్తాయి. ఊరవతల గల హైదరాబాద్ రోడ్డులో పెట్టుకోండి' అంటూ కొంతమంది మాటమార్చారు. దీంతో కంగుతిన్న దళితులు అయోమయానికి గురయ్యారు. కొన్నాళ్లపాటు ఈ సమస్య వెలుగులోకి రానివ్వకుండా అగ్రకులస్తులు జాగ్రత్తపడ్డారు. ఈనేపథ్యంలో గత బుధవారం 'నవతెలంగాణ' దృష్టికి రాగా మరుసటి రోజు సమస్య వెలుగులోకి వచ్చింది. అంతకుముందు రోజే గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు అనువైన, విశాలమైన, అసౌకర్యవంతమైన స్థలం ఉండాలని, ప్రస్తుతం జీపీ ఎదుట లేదంటూ ఆటంకాలు సృష్టించడం ప్రారంభించా రు. తదనంతరం మంగళవారం సాయంత్రం అంబేద్కర్ యువజన సంఘం, దళిత సంఘాల నాయకులు నిజామా బాద్ ఇన్చార్జి కలెక్టర్ రవీందర్రెడ్డిని ఆశ్రయించారు.
ఉన్నతాధికారుల విచారణ ప్రారంభం
ఈ నెల 1వ తేదీన 'గాంధీ పక్కన అంబేద్కర్కు చోటులేదంట' అనే శీర్షికన నవతెలంగాణ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో దళిత సంఘాలు పెద్దఎత్తున స్పందించాయి. అడ్డంకులు సృష్టిస్తే బోర్గాం(పి) మరో 'రేకులపల్లి'ని తలపిస్తుందని హెచ్చరించాయి. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనతో అధికారులు సైతం కదిలొచ్చారు. నిజామాబాద్ ఆర్డీవో, ఇన్చార్జి డీఆర్వో వినోద్కుమార్, డీపీవో కృష్ణమూర్తి, ఏసీపీ ఆనంద్కుమార్లు శుక్రవారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. ప్రతిపాదించిన స్థలాన్ని, గ్రామపంచాయతీని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు కొనసాగించారు. అనంతరం పంచాయతీ పాలకులు, వీడీసీ సభ్యులతో చర్చలు జరిపారు. దళిత, ఎంబీసీ నాయకులను లోనికి అనుమతించలేదు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి సైతం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అందరూ సహకరించాలని కోరారు. అధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు. 30 ఏండ్లుగా గ్రామానికి మంచి పేరున్నదని, ఈ గొప్పతనాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. అయితే చర్చల్లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అధికారులు మధ్యలోంచి వెళ్లిపోయారు. అదేరోజు సాయంత్రం ఇరువర్గాల నుండి ఐదుగురు చొప్పున ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. వేరే స్థలంలో పెట్టుకోవాలని వీడీసీ, తీర్మానం ప్రకారమే చేయాలని దళితులు భీష్మించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సమస్య ఎటూ తేలకపోవడంతో నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. ఆర్అండ్బీ రోడ్లపై విగ్రహాలకు అనుమతి లేదని, జీపీ, గ్రామస్తుల నిర్ణయం మేరకు మాత్రం పెట్టుకోవచ్చునని ఆర్డీవో తెలిపారు. ఈ విషయమై కలెక్టర్కు నివేదిస్తామని, ఉన్నతాధికారుల సూచన మేరకు నడుచుకోవాలని డీపీవో కృష్ణమూర్తి సూచించారు. అయితే ఉన్నతాధికారులు సరైన నిర్ణయం ప్రకటించకపోతే జిల్లావ్యాప్తంగా దళిత, అంబేద్కర్, యువజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధంకానున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఇంటింటికీ కరపత్రాల పంపిణీతో దళితుల్లో చైతన్యం దిశగా నాయకులు చర్చిస్తున్నారు. వీడీసీ అడ్డుతగిలితే త్వరలో చలో బోర్గాం(పి) ఎదుర్కోవాల్సిందేనని దళితులు ముక్తంకంఠంతో భీష్మిస్తున్నారు.
- బి. రాజు
సెల్ : 7095603635
వీడీసీపై కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లాలో రోజురోజుకూ గ్రామాభివృద్ధి కమిటీల ఆగ డాలు పెరుగుతున్నాయి. అ యినా ప్రభుత్వం నిమ్మకు నీ రెత్తినట్టు వ్యవహరిస్తోంది. అ నేక ప్రాంతాల్లో బహిష్కరణ లు దాడులు జరుగుతూనే ఉన్నా సర్కారుకు పట్ట డం లేదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలను అడ్డు కుంటూ పెత్తందార్లు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధి కారులు వెంటనే జోక్యం చేసుకొని వీడీసీపై చర్యలు తీస్కోవాలి. లేదంటే పోరాటాలు తప్పవు.
గంగాధరప్ప, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నిజామాబాద్
ఇది ఆత్మగౌరవ సమస్య
గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే భూమిపూజ చేశారు. గాంధీ విగ్రహానికి లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వస్తోంది. జిల్లావ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలపై అవమానాలు, దాడులు జరుగుతున్నాయి. బోర్గాం(పి)లో జీపీ వద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టనీయకపోతే అది రాజకీయ, ఆత్మగౌరవ సమస్యకు దారితీస్తుంది. చివరకు ఆందోళనలు కొనసాగుతాయి.
దండివెంకట్, ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కొత్త నాటకమాడుతున్నరు
గ్రామసభలో తీర్మానం మేరకే భూమిపూజ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ స్థలం లేదని కొత్త నాటకం ఆడుతున్నరు. ఇది సరికాదు. ముందే ఈ అభ్యంతరాలు తెలిపివుంటే మరో పరిష్కారమార్గం చూసేవాళ్లం. తీరా ప్రతిష్ఠాపనకు సిద్ధమైన తర్వాత స్థలం లేదని చెప్పడం అందరి మనోభావాలను దెబ్బతీస్తోంది. గ్రామస్తుల కోరిక మేరకు రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఏర్పాటుకు అందరూ సహకరించాలి.
చిలుక సాయిలు, బోర్గాం(పి) సర్పంచ్
దళితులను అవమానించినట్టే
గాంధీ పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం తప్పా. తీర్మానించిన తర్వాత స్థలం లేదని చెప్పడం సరికాదు. విగ్రహాన్ని పెట్టనీయకపోవడం దళితు లందర్నీ అవమానించినట్టే. విగ్రహ ప్రతిష్ఠాపనకు అడ్డుపడితే జిల్లావ్యాప్తంగా ఉద్యమిస్తాం. సమస్యకు కారణమైన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి. అధికారులు స్పందించి దళితులకు న్యాయం జరిగేలా చూడాలి.
సుంకరి మోహన్, మాలమాహానాడు జిల్లా అధ్యక్షుడు
Authorization