ఒగ్గు కళ చుక్క వెలుగు కోల్పోయింది. ఒగ్గు కళారంగం దిక్కులేనిదైనది. శూద్ర కళారూపాన్ని ప్రపంచ రంగస్థలం మీద పసిడి కాంతులు పండించిన మహా కళాకారుడు ఒగ్గు కళ దిగ్గజం, సూర్యుడంత కాంతిగోళం, జానపద కళారంగ విశ్వంలో సాటిరారు మరెవ్వరు. డమరుకం.. డోలు, కండ్లముందు కదలాడే రూపం చుక్క సత్తయ్య (86). ప్రపంచస్థాయికి ఎదిగి, డాక్టరేటును సైతం అందుకున్నాడు. చదువులేకున్నా విద్యార్థులకు ఒగ్గుకథను బోధించి, ఆడించి, ఉర్రూతలూగించిన స్థాయి ఆయనది. అయినా సర్కార్ ఆధరణ లేని జీవితం. చివరి దశలో వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూసీ, చూసీ నిరాశ చెంది తనువు చాలించిన బలహీన, బడుగు బక్క కళాకారుడు చుక్క సత్తయ్య.
అసలు పేరు చౌరదిపల్లి సత్తయ్య. నెత్తిమీద తెల్లటి చారిక వల్ల ఆయన చుక్క సత్తయ్య అయ్యిండు. ఆ చుక్కే ఒగ్గు కథకు వేగుచుక్కలా ఆయనను లోకానికి పరిచయం చేసింది. పూర్వపు వరంగల్ జిల్లా లింగాల గణపురం మండలంలోని మారుమూల కుగ్రామం మాణిక్యాపురం. ఒగ్గు కథలో అతనొక మణి మాణిక్యం. నలుగురు ప్రధానమంత్రులు, ఇద్దరు రాష్ట్రపతుల చేతుల మీదుగా సన్మానాలూ, పురస్కారాలు అందుకున్నాడు. శూద్రసాహిత్యం అల్లిక నాటకం, అద్భుత గాత్రం, కథ, నృత్యం ఏకాకాలంలో అద్భుతమైన గాత్రశక్తితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసినా పద్మశ్రీ అవార్డు అందుకోని అపురూప కళాకారుడు సత్తయ్య. శాస్త్రీయ సంగీత ఒడుపులు తెలియవు. ఓనమాలు రావు. ఇంగ్లీష్ అస్సలే రాదు. అప్పటికప్పుడే ఆడ వేషం, మగ వేషం, బ్రహాన్నల వేషం, రాజువేషం వేసి కథ అయిపోగానే మాల, మాదిగలు, గౌండ్లు, గొల్ల కురుమలు, శూద్రులను అడుక్కునే కళారూపమే కదా! అగ్ర కులాలు అంటని కళారూపం కదా! అందుకేనేమో కళాకారుడిగా అడుగడుగునా వివక్షకు గురయ్యాడు. అంతిమ శ్వాసవరకు అందని పాలకుల ఫలాలు, వారి వరాలు శ్వాస వదిలిన తర్వాత సంతాప ప్రకటనలయ్యాయి. సానుభూతి వచనాలు.. ఇవి కావు నిజమైన కళాకారుడికి కావల్సిన నివాళి. బతికున్నప్పుడు బరోసా, రాజ్యమున్నది, రాజులున్నరు అనే కనీస ధీమా కలిగించాలి. ఐదు రోజుల ఒగ్గు కథ అలా వేలాది మందిని ఆనందాశ్రుస్నానాలు చేయించేది. మిలమిలలాడే కండ్లలో తృప్తి తొణికీసలాడేది. లోలోన మాత్రం పేదరికంతో బిగి కౌగిలిలో మౌనంగానే యుద్ధం చేశాడు. 13 ఏండ్ల చిరు ప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు. చిందు యక్షగానం చెప్పేవాడు. తర్వాత బీరప్ప ఒగ్గు కథను చెప్పి జనాలను మంత్రముగ్ధులను చేశాడు. తెలంగాణ ప్రతి పల్లె మూలలో కథ చెప్పిండు. ఒగ్గు కథకు పేరు తెచ్చిండు. కొంతమంది ఓర్వలేక కథ చెప్పడానికి హక్కులేదని బహిష్కరించిర్రు. కారణమేమిటంటే వారి కథలకు జనం రావట్లేదని, సత్తయ్య కథ చెబితే బాగా ఉందని జనం అక్కున చేర్చుకుంటున్నారని. బహిష్కరణకు గురిచేసినవారినే ప్రజలు బహిష్కరించారు. అయినా అగ్రకులాల వాళ్లు అడ్డంకులు సృష్టిం చేవారు. జనాలను రెచ్చగొట్టేవారు. పంచాయితీలు పెట్టించారు. అయినా ప్రజల అండతో సంవత్సరాలపాటు బహిష్కరణకు గురైనా ఎలంటి ఇబ్బందీ పడలేదు. ఇక బహిష్కరణ విధించినా లాభం లేదని గ్రహించి వాళ్లే డీలా పడిపోయారు.
ఒగ్గు కథ రెండు కులాలకే పరిమితం. మొదట కురుమలు తరువాత యాదవులకు వచ్చేది. ఈ ఇరు కులాలను అడుక్కునే కులం సత్తయ్యది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్పపడు నా కథ విని, కళాకారుడిగా స్పందించి తెలంగాణ జానపథ కళారూపం, తెలుగు వారి విశిష్ట కళా రూపాలలో అగ్రగణ్యమైనదిగా గుర్తించి, అభిరుచి ఉన్న వారందరికీ శిక్షణ ఇచ్చి నేర్పించమని సత్తయ్యను కోరాడు. అప్పటి నుంచి ఇతరులు సైతం నేర్చుకున్నారు. సత్తయ్య ఒగ్గు కథలో అనేక ప్రయోగాలు చేశారు. ప్రతి రోజు మాణిక్యపురం నుంచి, జనగామ నుంచి ప్రయాణించి హైదరాబా ద్లోని తెలుగు విశ్వవిద్యాలయం జానపథ కళల శాఖకు అందరి కన్నా ముందే హాజరయ్యేవాడు. ఎక్కడా అలసట లేని ముఖం. విద్యార్థులు అతన్ని ప్రేమగా అలసట ఎరుగని ఆ కళాకాంతిని చుట్టుముట్టేవారు. ఒక మృదంగం కళాకారుడు సత్తయ్యకు శిష్యు డుగా చేరి అక్కడే ఆచార్యుడయ్యాడు. సత్తయ్య మాత్రం ఇన్స్ట్రక్టర్ స్థాయికన్నా దిగజారాడు. తరువాత సత్తయ్యనే సాగనంపి ఆచార్యులంతా ఆనందపడ్డా రు. అయినా పట్టు వదల్లేదు. నా కళా ప్రతిభకు ప్రజలే పట్టం కడతారని పల్లెలకేగాడు. అకుంఠిత దీక్షా దక్షతలతో కళను నమ్ముకొని కొనఊపిరి దాకా ఆ కళతో పాటే ప్రయాణం చేసిన సత్తయ్య ఈ లోకం తన వాడుగా అక్కున చేర్చుకున్నది. దీనికి కారణం ఒక తెలంగాణ శూద్ర కళారూపాన్ని దేశ విదేశాలో చాటి చెప్పి, జీవితాన్నంతా ఆ కళకే అంకితం ఇచ్చాడు. ఆ కళారూపం ప్రజలను చైతన్యం చేసింది.
1931జూన్ 30న చౌదరపల్లి ఆగ య్య, సాయమ్మ దంపతులకు రెండో సం తానంగా చుక్క సత్తయ్య జన్మించాడు. ఇద్దరు కుమారులు అంజయ్య, శ్రీశైలం, కుమార్తె పుష్ప ఉన్నారు. ఎవరికీ పెద్ద చదువుల్లేవు. ఉద్యోగాల్లేవు. పైగా 4 ఎకారాల వ్యవసాయ భూమి ఉందని, ఉన్న వెయ్యి రూపాయల పింఛను కూడా రద్దు చేశారు. సత్తయ్య ఒగ్గు కథల్ని క్యాసెట్లు చేసి లాభాలు పొందిన వాళ్లు క్షేమంగా ఉన్నారు. సత్తయ్య సర్కారు ఇల్లులేని తన పెంకుటిల్లే చివరకు గతి అయ్యిది. ఆయన కథను వాడుకున్న పెద్దలే తప్ప ఆయన్ను ఆదుకున్న వారు లేరు. గొప్ప కళాకారుడైనా సామాన్య సగటు రైతుగా తనకున్న భూమిని సాగు చేయాలని ఆయన భగీరథ ప్రయత్నం చేసిండు. తనకున్న వ్యవసాయ భూమిలో 36 బోర్లు వేసిండు. తొమ్మిది బావులను తవ్విండు. అయినా చుక్క నీరు పడలేదు. కన్నీళ్లే మిగిలాయి. చుక్క సత్తయ్య 12 రకాల వేషాలు వేసిండు. చీరపు కథలో జంగం బాలసంతులు, సార్థకోళ్లు మందులోళ్లు, ఫకీరు, గారడీవాడు ఇలా 12 వేషాలు వేసిండు. చేతిలోని చిన్న కండువాను గుర్రం కళ్లెంగా, పైటగా, కిరీటంగా, చీరగా, ముసుగుగా ఎన్నో రకాలుగా వాడిన నేర్పరి, బహుముఖ ప్రజ్ఞశాలి. అభినయంలో కాకలుతీరిన నర్తకి, నయన భాషల్ని అలవోకగా పలికించగలడు. కాళ్లు, చేతులు డమరుకం ధ్వనుల మధ్య రాగం గాలిగా మారిపోయి జనంపై సోకి శివసత్తులుగా మారేవారు. తన ముణివేళ్లలో జగ్గు మోగుతుంటే హావభావాలు చూసి ఆకాశమే పూలు కరిపించినట్టుగా, ఆకులు రాలినట్టుగా ఒక్కోసారి పిడుగుపడినట్టుగా నవరసాలు పలికించేవాడు. సత్తయ్య నటుడు, ప్రదర్శకుడే కాదు. వాగ్గేయకారుడు, నవరస బ్రహ్మ, హీరో, హీరోయిన్ కూడా ఆయనే. బీరప్ప వేషంలో అతన్ని చూడాలి. కండ్లలో రౌద్రం, నడుముకు కరవాలంతో కవాతు చేసినట్టు కథ ఉంటుంది. ఆ కథను సుమారు 6వేల సార్లు చెప్పారంటే ప్రజలు ఎంతగా ఆదరించారో అర్థమవుతుంది. మొత్తం 12 వేల ప్రదర్శనలు ఇచ్చినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. రాచరిక, భూస్వామ్య కాలం నుంచి అధిపత్య, మత సంస్కృతులను ఎదిరించి నిలబడగలిగిన కళలు నేడు కూనరిల్లుతున్నాయి. ప్రగతిశీల సామాజిక ఉద్యమానికి ఓ గొంగడి, చేతిలో కండువా, ఓ కర్ర, కాళ్లకు గజ్జెలు, తలకు పాగా, చుట్టుకునే ఆహార్యం ఒగ్గుకథే ఇచ్చింది. వారి నుండి ఎన్నో రాగాలు, బాణీలను ప్రజా కళారంగానికి ఇచ్చింది. బుర్రకథను నాజర్ ఏ స్థాయికి తీసుకెళ్లాడో, ఓ హరికథ సాలాది భాస్కర్రావుల్లా.. ఒగ్గుకథకు చుక్క సత్తయ్య ప్రాణం ధారపోశాడు. నీళ్లే నా ప్రార్థన అంటూ...
శరణు శరణు మాయమ్మా రాణీ
శాంభవీ రాణి.. శాంభవీ రాణి...
కరుణ జూడు కన్నా తల్లీ.. గంగాభవానీ... ఘనకల్పవల్లీ
పుట్టినాది గంగతల్లి... ఈ పుడమీలోన.. ఈ పుడమీలోన....
ఈ నీటిలోనే సకల జీవరాశి పెరిగినాది గంగాదేవి
ఇలా ప్రపంచానికి ప్రాణావసరమైన గంగను తలుచుకుని ప్రార్థించిన తర్వాత పంచ భూతాలను ప్రార్థిస్తా అనేవాడు. ఒ కథలో ఒక తల్లి కొడుకును కోల్పోతుంది. అతన్ని చంపుతారు. అప్పుడు...
కారేటి రక్తం కడువల్లా నింపి
పారేటి రక్తం పటువల్లా నింపి
చిల్లేటి రక్తం చిప్పల్లా నింపి
రాలేటి రక్తం రేకల్లా నింపి
పొర్లేటి రక్తం పొత్తిల్లా నింపి
దొర్లేటి రక్తం దోసిల్లా నింపి
ఇలా శోకంతో పాడుతుంటే జనమంతా ఏడ్చేవారు. ఓ రాక్షసిని సంహరించి కసితో ఇలా పాడుతాడు.
కనుగుడ్లు చప్పరించి...
నాలుక నజ్జుడు చేసి
కార్జాలు కమలదీసి
గుండెలు కుమలదీసి
దొబ్బలు దోరనాలు వేసి
పేగులు పెడ జెజ్జరాలు వేసి
ఇలా కసితో అడుగులు వేస్తుంటే చూడాలి. అల్లిక సాహిత్యం అంటరానిదయ్యింది. లిఖిత సాహిత్యం నిచ్చెనెక్కి కూర్చుంది అనేవాడు. కదురు, కవ్వం, కర్రు కదులుతుంటే కరువెక్కడే అనేవాడు. ఇప్పటికైనా ఏలేటోళ్లు వీటిని ఎదకద్దుకోవాలే అనేవాడు. ''నా దగ్గరకు బండారు దత్తాత్రేయ వచ్చి అదిగో పద్మశ్రీ, ఇదిగో అంటూ ఊరించాడు. ఊరించి, ఊరించినా ఊపిరిపోయేదాకా రాదు'' అన్నాడు. అన్నట్టుగానే ఊపిరికూడా పోయింది. ''నాలాంటి అడుక్కునే కులపోళ్లకు గోసి, గొంగడిగాళ్లకు ఆవార్డులివ్వరు. ఆచార్యులే అడుగడుగునా అడ్డుపడుతారు'' అన్నట్టే జరిగింది. సీపీఐ(ఎం) తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా జన జాతర నిర్వహించినప్పుడు ఘనంగా సన్మానం జరిగింది. వందలాది ప్రేక్షకుల చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ఇంత గొప్ప జానపద కళాకారుల బతుకులు గడిచే మార్గం కోసం ప్రజా ఉద్యమాలు ఆలోచనలు చేయవలసిన తరుణం ఇది. ప్రజా కళలను ఎత్తిపట్టడం ప్రజా కళారంగం బాధ్యత అయ్యింది. ప్రజా సాంస్కృతికోద్యమంలో గ్రామీణ జానపద కళాకారులకు అండగా ఉందాం. తెలంగాణ కళలను, జన సంప్రదాయాలను పట్టించుకో ని పాలకులను నిగ్గదీద్దాం. ఒగ్గులను మోగిస్తూ డమరుక విన్యాసాలు చేస్తూ తెలంగాణ కళారూపాలకు జీవం పోద్దాం. ఇది చుక్క సత్తయ్యకన్న తెలంగాణ నేలలో ప్రజా సాహిత్యం, ప్రజా కళలు, ప్రజా కళాకారులు ఆత్మ గౌరవం తొణికీసలాడినప్పుడే. అదీ చుక్క సత్తయ్యకు ఇచ్చే నిజమైన నివాళి.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343
Authorization