పరాయి పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం కావాలని కాంక్షించి ఎందరో మహానుభావులు జాతీయోధ్యమంలో పాల్గొన్నారు. ఎన్నో రకాల పోరాటాలు చేశారు. భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు, కోమురంభీమ్, ఝాన్సీలక్ష్మీబాయి వంటివారు ఎందరో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. కానీ బ్రిటీష్తో ప్రాణాలకు తెగించి పోరాడిన కొందరి పేర్లు చరిత్రలో కనుమరుగయ్యాయి. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన పోరాట యోధుల పేర్లు చరిత్రలో వెతుక్కోవాల్సిన పరిస్థితి నేడు దాపురించింది. అందులో జల్కారిబాయి కోరి ఒకరు. 1857 సిపాయి తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధ దళంలో ఈమె ప్రముఖపాత్ర పోషించింది. ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని మహిళా విభాగంలో సైనికురాలు.
1827 నవంబర్ 22న ఝాన్సీ సమీపంలోని భోజ్లా గ్రామంలో జల్కారిబారు జన్మించింది. ఆమె తండ్రి సదోవాసింగ్, తల్లి ధన్యా. కానీ కొందరు రచయితలు ఆమె తండ్రి మూల్ చంద్, తల్లి జమునాదేవిగా పేర్కొన్నారు. భోజ్లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, ధన్యా దంపతులైన నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన జల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా నిలిచింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న జల్కారిబారుపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్సింగ్ను వివాహం చేసుకున్న జల్కారిబాయి , తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి 'దుర్గావాహిని' మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.
కోరి కులానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. వారు ఒకప్పుడు ఈ దేశ పాలకులని తెలుస్తుంది. శోభా అసుర్ మహారాజ్ కోరి కులానికి చెందిన పాలకుడు, గౌతమ బుద్ధుడి భార్య యశోధర్ కూడా కోరి కులానికి చెందినదే. అయితే ఇలాంటి వీర యోధులను యుద్ధంలో ఓడించి వారిని బానిసలుగా చేసుకున్నారు. చోలోరియాగా కూడా పిలవబడే జల్కారిబాయి ఆమె తల్లిదండ్రుల ఏకైక సంతానం. తల్లిని కోల్పోయిన ఆమెను తన తండ్రి చాలా జాగ్రత్తగా, ఎంతో ప్రేమతో పెంచాడు. జల్కారిబాయి ఒక బలమైన, సాహసోపేతమైన, అందమైన అమ్మాయి. 12 సంవత్సరాల వయస్సులో ఆమె అటవీ ప్రాంతంలో పశువులను మేపుతుండగా ఆమెపై ఓ పులి దాడి చేసింది. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న గొడ్డలి కూడా జారిపడిపోయింది. అయినా ఆమె ధైర్యంగా తన చేతిలో ఉన్న కర్రను పులి దవడలోకి దూసి చేతితో దవడలను వేరుచేసి చంపింది. ఈఘటనలో ఆమెకు కూడా కొన్ని గాయాలై, బట్టలన్నీ నలిగిపోయాయి. అడవి ప్రాంతంతోపాటు పరిసర ప్రాంతాలైన ఝాన్సీ పట్టణంలోనూ ఈ వార్త సంచలనం సృష్టించింది. ఆమె చిన్నతనం నుంచే ధైర్యంతో ఇలాంటి సాహసాలు ఎన్నో చేసినట్టుగా కొన్ని పుస్తకాల ఆధారంగా తెలుస్తున్నది.
జల్కారిబాయి కోరి మల్లయోధురాలు, గుర్రపు స్వారీ, కత్తి సాములో రాటుదేలిన మనిషి. విలువిద్యలోనూ అనుభవం ఉంది. పూరణ్సింగ్ అనే కోరి కులస్తుడు ఝాన్సీ ప్రధాన ద్వారం వద్ద ఒక సాధారణ సాలిడార్, కామన్ ఆపరేటర్. జల్కారిబాయి పూరణ్సింగ్ను 1843లో వివాహమాడింది. ఒకరోజు రాణివాసంలో జరిగే వేడుకలకు భర్తతో కలిసి జల్కారిబాయి వెళ్లింది. అక్కడ ఆమె మాట తీరు, ధైర్య సాహసాలను తెలుసుకొని, జల్కారిబాయి గొప్ప ధైర్యవంతురాలుగా గుర్తించి ఆమెను తమ రాజ్యంలోని మహిళా సైనికులకు శిక్షణ ఇచ్చే విభాగంలో ఝాన్సీలక్ష్మీబాయి చేర్చుకుంది. కుస్తీ, విలువిద్య, గుర్రపుస్వారీ, ఇతర శారీరక వ్యాయమాలపై మహిళా సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు జల్కారిబాయి అంగీకరించింది. ఆనాడు తరచూ బ్రిటీష్ సైన్యం ఝాన్సీ రాజ్యంలోకి చొరబాటుకు యత్నిస్తుండేది. ఈ చొరబాట్లను జల్కారిబాయి సైన్యం ధైర్యంగా తిప్పికొడుతుండేది.
ఝాన్సీకి కొడుకు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడు భర్త రాజు గంగాధర్రావు అనారోగ్యం పాలై 12 నవంబర్ 1853న రాజు మరణించాడు. ఆనాడు బ్రిటీష్ నియమాల ప్రకారం ఏ రాజ్యానికైనా వారసుడు లేకపోతే ఆ రాజ్యం బ్రిటీష్ ఆధీనంలోకి వెళ్లిపోతుంది. కానీ రాజుగారి దూరపు బంధువైన దామోదర్రావును 19 నవంబర్ 1853న దత్త పుత్రుడిగా ప్రకటించారు. వారసత్వ దత్త పుత్రుడిని బ్రిటీష్ ప్రతినిధి వార్డ్ డల్హౌసీ తిరస్కరించాడు. అయినా తన రాజ్యాన్ని బ్రిటీష్ వశం కాకుండా రక్షించుకునేందుకు 1856 వరకు అనేక రకాలుగా బ్రిటీష్ ప్రభుత్వానికి వినతులు సమర్పించింది. వాటన్నింటినీ బ్రిటీష్ ప్రభుత్వం తిరస్కరించింది. రాజ్య రక్షణకు విధిలేని పరిస్థితుల్లో 1857లో ఝాన్సీ తిరుగుబాటు శంఖం పూరించింది. అప్పటికే బ్రిటీష్ సైన్యం ఝాన్సీ రాజ్యంలోకి ప్రవేశించింది. ఝాన్సీకి రాజభరణం ప్రకటించిన బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటు బావుట ఎగురవేయడంతో దేశద్రోహిగా ముద్రవేసి శిక్షించాలని నిర్ణయించారు. ఈపరిణామాలతో బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఝాన్సీ సైన్యం సిద్ధమైంది. 25 మార్చి 1858న ఝాన్సీ సైన్యంలోని ఫిరంగి దళం యుద్ధం ప్రారంభించింది.
సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించిన జల్కారిబాయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటీష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటీష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా రాణిని జల్కారిబాయి తప్పించింది. బ్రిటీష్ మూకలు రాణిని వెంబడించకుండా జల్కారిబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటీష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ జల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటీష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా..? అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. జల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన అనేకమంది నేడు క్షేత్రస్థాయిలో జల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలిచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, 'ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం'గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమిక పోషించిన ఘనత జల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్ఖండ్ ప్రాంతంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన జల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.
సెల్ : 8639518341
బోడ మహేశ్వరి
Authorization