'ఆల్ ఇండియా దళిత మహిళా అధికార మంచ్' వాళ్లు ఈ మధ్య సావిత్రి బాయిపూలే పూణె యూనివర్సిటీలో దళిత్ ఉమెన్ స్పీక్ అవుట్ (దళిత మహిళ మాట్లాడుతున్నది) క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే ఉమెన్స్ స్టడీస్ సెంటర్తో కలిసి సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయం. భారతదేశ వ్యాప్తగా చాలా రాష్ట్రాల ముఖ్య దళిత మహిళల్ని, వారి నాయకత్వాన్ని, వారి పోరాటాన్ని ఆస్తిత్వాలు, వారు నిర్మించుకుంటున్న ఆధునిక దార్శనీకతలు చాలా అద్భుతమైనవిగా కనిపించినవి. ఇవన్నింటి దశ దిశ రాజ్యాధికారమైన దృష్టి కూడా చాలా ఆదర్శనీయం. ఇన్నాళ్లు మాట్లాడే అవకాశం లేక ఇంట్ల బైట కేవలం సేవకు, ఎట్టి పనుల్లో మగ్గిపోయిన అంటరాని మహిళలచే మాట్లాడించడం మంచి విషయం. ''దళిత మహిళల గొంతులు విస్తరించాలి. శక్తులు కూడగట్టుకోవాలి. జీవితాల్ని మార్చుకోవాలి. దేశమంతా విభిన్న భాషల్లో, సంస్కృతులతో బతుకుతున్న అంటరాని తనాలు వెట్టి జీవితాలు మాత్రం ఒక్కటిగానే ఉన్నయి. భిన్న గొంతుల్ని అల్లుకుంటూ అలుముకుంటూ రాజకీయాధికారాల వైపు మల్లుదాం'' అనే ఎజెండాలతో సాగిన ఈ సదస్సు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ తాత్వికంగా అంటరాని జెండర్ దృక్పథాలతో పునాది ఆధునిక మిళితంగా సెషన్స్ నడిచినయి. తరతరాలుగా మా దళిత మహిళలు కేవలం చాకిరి, వెట్టి జేసుడేగాని మాకు మాట్లాడే అవకాశమే లేదు. ఈ కులస్వామ్య, మగస్వామ్య వ్యవస్థలో పురాణాల్నించి, ఇతిహాసాలు, కావ్యాల నుంచి ఇప్పటి ఆధునిక సాహిత్యాల దాకా మా అంటరాని జెండర్లను అంటుకోలే. ఎవరి గోస వారిదే. ఎవరూ ఎవర్ని ఉద్దరించాలని చూడ్డం, ఎదురు చూడకూడదని అర్థమైది. అందుకే మాట్లాడాలి. ఎవరి హక్కుల కోసం వారే పోరాడాలి. ఇతర ఉద్యమ సామాజిక శక్తుల సంఘీభావాలను కూడగట్టుకోవాలి అని అర్థమైంది. ఇప్పటిదాకా వచ్చిన పురాణాల సాహిత్యాల నుంచి ఇప్పటిదాకా రికార్డులుగా వచ్చిన సాహిత్యాల్లో దళిత మహిళలు ఎట్లా బత్కిండ్రు అనేది చూడము. మా దళిత మహిళలు ఏమి తిన్నరు, ఏమి తాగిర్రు, ఏం బట్ట కట్టిర్రు, ఏమాడుకున్నరు, ఏం పాడుకున్నరు, మా వ్యతిరేకతలు, మా నిరసనలు, మా బతుకులు, భాగ్యాలు అన్ని అన్నింటిని అవచ్యం చేసిన ఈ కొన్ని ఉద్యమాలు, మరికొన్ని రకాల సాహిత్యాలు.
మా మాటలు పబ్లిగ్గా రావాలి. అది గూడెం పబ్లిక్, ఊరు పబ్లిగా మా మాటలు బైటికి దాటాలి. కొండలు, గుట్టలు, కోటలు దాటాలి. అనే నినాదంతో దళిత మహిళలు మాట్లాడుతున్నరు అనే సదస్సుకు ఆంధ్ర, తెలంగాణ నుంచి దాదాపు 20 మందిమి పోయినం పూణేకి. పూణే అనంగానే మొదటి మహిళా టీచర్ మాకు చదువు నేర్పిన చదువులమ్మ సావిత్రిబాయి పూలే సంస్కరణలన్నీ ఆ పూణేలో పరుచుకున్నట్టుగా కనిపించింది. జ్యోతిరావు పూలేతో కల్సి ఆమె నిర్మించిన ఆధునిక దార్శనికతలు ఎంతగా విస్తరించినయో సావిత్రిబాయి పూలే మహిళా అధ్యయన కేంద్రం చెప్పింది. నిజానికి దేశంలో ఉన్న యూనివర్సిటీల్లోని మహిళా అధ్యయన కేంద్రాలు దాదాపు సవర్ణ మహిళాధిపత్యంలోనే ఉన్నయి. ఏవో ఒకటి అర బహుజన మహిళల చేతుల్లో ఉన్నయి. ఈ సదస్సులో బన్వారీదేవి కనిపించడం ఒక ఉద్వేగం. ప్రభుత్వంలో ఏఎన్ఎంగా పనిచేస్తూ బాల్య వివాహాల రిపోర్టులో రాజపుత్రుల సంఖ్య కూడా చేర్చి ఇచ్చినందుకు రాజపుత్లచే సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన విశాఖ గైడ్లైన్స్ నుంచి పనిచేసే స్థలాల్లో మహిళా రక్షణ చట్టం వచ్చింది. తర్వాత అమెరికాలో పుట్టి భారతదేశ పరిశోధకురాలిగా ఉంటూ కుల జెండర్ వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ రచనలు చేసిన గెయిల్ ఆమ్విత్, మరాఠి రచయిత్రి ఉర్మిళా పవర్, బుద్దిస్టు రచయిత్రి రమాపాంచాల్, రాష్ట్రీయ దళిత మహిళా ఆందోళన్ రజినీతిలక్, ముప్పయేండ్ల నుంచి దళిత మహిళల కోసం పని చేస్తున్న రూత్ మనోరమ, ఆశా కొత్వాల్, బెర్నాడ్ ఫాతిమా, పూలే అంబేద్కరిస్టు, ఉమెనిస్టులు రేఖారాజ్, దమ్మా సింగిని రమాగోరక్, గ్రేస్ బాను, మోనికా విన్సెంట్, సింధియా స్టఫెన్ లాంటి అనేక దళిత మహిళా నాయకుల్లొచ్చారు. యంగ్ దళిత్ మహిళలు, రీసెర్చ్ స్కాలర్స్ పెద్ద ఎత్తున వచ్చారు. రచయిత్రులు, కళాకారులు వాళ్ల వాళ్ల స్థానిక కళలతో, గ్రూపులు, గ్రూపులుగా హాజరై వాళ్ల కళల్ని సినిమాలనీ, డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. కానీ రెండు రోజులు మాత్రమే జరగడం వల్ల అన్ని సెషన్స్ కళలు, వారి డాక్యుమెంటరీలను, వారి స్వీక్ అవుట్స్ది అన్నింటినీ చూడలేకపోయాం. ఓ పది రోజులైనా జరిగితే బాగుండేది. చివరికి సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే వాళ్ల సామాజిక కుటీరాన్ని చూడటం గొప్ప అనుభూతి. ముక్తసాల్వే బాగ యాదొచ్చింది. సదస్సంతా ఉద్వేగభరితం.
- జూపాక సుభద్ర
సెల్ :9849905687
Authorization