తమ హక్కులను కాలరాసి, తమ జీవితాలకే విలువ లేకుండా చేసిన మనుస్మృతి తగలబెట్టి తీరుతామని ఆనాడు అంబేద్కర్ గర్జించాడు. అన్నట్టుగానే 1927లో డిసెంబర్ 25న దళితులతో కలిసి మనుస్మృతిని తగులబెట్టి మా మనుగడకు ప్రతిబంధకంగా మారిన ఈ సిద్ధాంతాలను కాల్చిపారేయాలని చాటిచెప్పారు. దళితులంతా నాటి నుంచి మనుస్మృతి దహన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీనిని కాషాయమూకలు జీర్జించుకోలేకపోతున్నాయి. గత డిసెంబర్ 25న కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు ఐక్యంగా ముందుకు సాగి మనుస్మృతి ప్రతులను దహనం చేయడాన్ని సహించని మతోన్మాదులు దేశభక్తిని తెరపైకి తెచ్చి ఘర్షణ వాతావరణానికి తెరలేపారు. ఈ గొడవలోకి దళిత ప్రొఫెసర్ను లాగి సోషల్ మీడియా వేదికగా బూతు పురాణం ఎత్తుకున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం.
1873 డిసెంబర్ 25న మహాత్మా జోతిరావ్ఫులే పురోహితుడు లేకుండా స్వాభిమాన వివాహం జరిపించి సామాజిక విప్లవానికి నాంది పలికారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా 1927లో అదే రోజున శూద్ర, అతిశూద్ర కులాలను, దేవాలయాలు, పాఠశాలలు, చెరువులలో భాగస్వామ్యాన్ని నిషేధించిన మనుధర్మశాస్త్ర ప్రతిని తగులబెట్టారు. స్వేచ్ఛను హరించి, అసమానత్వాన్ని పెంచి, సౌభ్రాతత్వాన్ని హత్యచేసి, అమానుషమైన కులదొంతర సమాజానికి మూలమైన ఆ శాస్త్రాన్ని ప్రతియేటా అదే రోజున బహుజనవాదులు తగలబెడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే గత నెల 25న కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు 'మనుస్మృతి' ప్రతులను దహనం చేశారు. వర్సిటీ ఎదుట ఫూలే విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేస్తుండగా మనుదూతలు జీర్ణించుకోలేకపోయారు. ఇదే అదునుగా శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాతనూ టార్గెట్ చేశారు. వర్సిటీ విద్యార్థులు భరతమాత చిత్రపటాన్ని కాల్చేస్తున్నారని సోషల్మీడియా ద్వారా ప్రచారం చేశారు. వెనువెంటనే బీజేపీ, దాని పరివారమంతా కర్రలు, రాళ్లతో విద్యార్థులపై దాడికి దిగి రణరంగం సృష్టించింది. ఏకపక్షదాడి చేస్తే ఇరువర్గాల మధ్య ఘర్షణగా చిత్రీకరించారు. ఇదే సమయంలో సుజాతను తెరపైకి తెచ్చారు. విద్యార్థులను రెచ్చగొడుతూ జాతీయతాభావాన్ని దెబ్బతీస్తున్నారని దుష్ప్రచారానికి దిగారు. వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్ర ప్రతులను తగలబెట్టినట్టు ఫొటోలు ధృవీకరిస్తున్నా.. ఏమాత్రం చెవికెక్కించుకోని కషాయమూకలు భరతమాత ముసుగును తొడిగి విస్తృత ప్రచారం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సుజాతను వారి పరివారం ఎదుట బోనులో నిలబెట్టారు. భరతమాతను అంతలా గౌరవించే కషాయమూకలు దళిత మహిళ అని చూడకుండా బూతుపురాణం మొదలుపెట్టారు. 'సుజాతను నరికేయాలి. చంపేయాలి' అంటూ మతోన్మాద మనుదూతలు దేశభక్తి ముసుగువేసి పిలుపునివ్వడం మొదలు పెట్టారు. మానసిక క్షోభకు గురైన సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసిప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలా మనువాదులకు టార్గెట్ అయిన ఆమె... ఒక ప్రభావశీల దళిత మహిళా మేధావి కావడమే కారణం. మంథని మధుకర్ కులదురంహంకార హత్య ఉదంతం, అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకులపై స్థానిక బీజేపీ పెత్తందారీ ప్రదర్శించిన పైశాచికత్వం లాంటి అనేక ఘటనలపై గర్జించారు, గర్జిస్తూనే ఉన్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన బహుజన నాయకురాలిగా మనువాద చర్యలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సేవలందిస్తున్న ఆమె 20 ఏండ్లకుపైగా ప్రజాక్షేత్రంలో ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఆమె పోరాట పటిమను అభినందించే, అభిమానించే అభ్యుదయవాదులంతా నేడు ఆమెకు అండగా ఏకమయ్యారు. మనువాదుల చర్యలను ఖండిస్తూ ధర్నాలు, నిరసనలతో మద్దతుగా నిలిచారు. దళిత, ప్రజా, వామపక్షవాదులంతా సుజాతకు అండగా ఉన్నారు. ఇంతటి ప్రభావశీలి అయిన సూరేపల్లికి మద్దతుగా ప్రజలు కదలాల్సిన సమయమిది.
ప్రజాస్వామ్యంపై దాడి
సోషల్ మీడియా ద్వారా నాపై జరిపిన దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. ఎవరి భావజాలం వారికుంటుంది. రాజ్యాంగం ప్రకారం ఎవరి భావ స్వేచ్ఛ వారు వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అప్రజాస్వామిక ఘటనలపై నేను స్పందించడమే తప్పా? దాన్ని దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో మనువాదులు దాడి చేశారు. దీనిపై ప్రజాస్వామ్యవాదులంతా స్పందించాలి.
- ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత
ప్రగతిశీల భావజాలం తప్పుకాదు
ప్రగతిశీల భావజాలం ఉండటం తప్పుకాదు. వారి వారి భావజాలాన్ని బట్టి పని చేసే హక్కు రాజ్యాంగమే కల్పించింది. భావజాలాన్ని తప్పు బడితే రాజ్యాంగాన్ని తప్పుబట్టినట్టే. చట్టాన్ని ఉల్లంఘించినట్టే.
- నరెడ్ల శ్రీనివాస్, లోక్సత్తా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
భావస్వేచ్ఛ అందిరికీ ఉంది
భావప్రకటనా స్వేచ్ఛ ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉంది. దాన్ని కాదనే హక్కు ఏ ఒక్కరికీ లేదు. భావప్రకటనా స్వేచ్ఛపై దాడి చట్టవ్యతిరేకం. రాజ్యాంగవిరుద్ధం. ఇలాంటి దాడులపై ప్రభుత్వమూ స్పందించాలి.
- సి.రామరాజు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు
- పిఎస్.రవీంద్ర
సెల్ : 9490099395
Authorization