- సర్పంచ్ దళితుడని భోజనం నిరాకరించిన వైద్య సిబ్బంది
కుల వివక్ష అనాదిగా వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాల్లో మార్పు రావాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉంది. గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో ఇటీవల వైద్యులు వైద్య శిబిరం నిర్వహించగా, వారికి భోజన సదుపాయం తన ఇంట్లోనే కల్పించాడు గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ దళితుడు కావడంతో ఆయన ఇంట్లో చేసిన వంటను తినేందుకు వైద్యులు నిరాకరించారు. దీనిపై గ్రామ సర్పంచ్ దాసరి నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీని వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో మొత్తం 3వేల జనాభా ఉండగా, 1500 వరకు ఓటర్లు ఉన్నారు. 53 దళిత ఇండ్లు ఉండగా, సుమారు 300 ఓటర్లు ఉన్నారు. మూడు ఎస్టీ కుటుంబాలున్నాయి. ఓసీలు, బీసీలు, కలిపి మెజార్టీ కుటుంబాలు గ్రామంలో నివాసముంటున్నాయి. 1959లో గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ సింగాటం, తొలిసారిగా 2013లో దళిత సర్పంచ్కు అవకాశం కల్పించింది. అంతకు ముందు అగ్రకులాల వారే సర్పంచ్లుగా వ్యవహరించారు. గ్రామంలో వివక్ష బయటకు కనిపించని రూపంలో కొనసాగుతున్నది.
సింగాటం గ్రామంలో ఇటీవల ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామనీ, ఇందుకు 20 మంది వరకు వైద్య సిబ్బంది వస్తారనీ, గ్రామంలో షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి, ఎల్సీడీ రోగులకు ఈ చికిత్సలు అందిస్తామనీ సర్పంచ్ దాసరి నర్సింలుకు ఫోన్ ద్వారా స్థానిక ఏఎన్ఎం సుజాత తెలియజేశారు. గ్రామానికి వచ్చే ప్రభుత్వ వైద్యులకు, వైద్య సిబ్బందికి ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆ సర్పంచ్ తన ఇంట్లోనే భోజనాలు వండించాడు. 20 మంది గజ్వేల్ మండల పీహెచ్సీ పరిధిలోని సిబ్బంది సింగాటం గ్రామ పంచాయతీ వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం సమయానికి భోజనాలు చేయాలని సర్పంచ్ నర్సింలు వారిని కోరారు. అంతలోనే వైద్య సిబ్బందికి అనుమానం వచ్చింది. ''మీరు ఏంటోళ్లు? ఎక్కడ వంట చేశారు?'' అని ప్రశ్నించారు. ''నేనే సర్పంచ్ను.. వంట మా ఇంట్లోనే చేయించాను. అన్నం, కూర, పెరుగు అన్ని ఏర్పాటు చేశాను మేడం'' అంటూ గ్రామ సర్పంచ్ తెలియజేశారు. పక్కకే ఉన్న గ్రామస్తులను సర్పంచ్ ఏ కులస్తుడని అడిగి తెలుసుకున్నారు. దళితుడని చెప్ప డంతో అంతకు ముందు గ్రామ సేవకుడితో అంగన్ వాడీ కేంద్రానికి భోజ నాలు తీసుకు రావాలని కోరిన వారు ఆ తర్వాత సర్పంచ్ కులం తెలుసుకుని, భోజ నాలను తీసుకు రావొద్దని, వెంటనే గ్రామసేవకుడికి సమాచారం అందజేశారు. అక్కడి నుండి వెళ్లి అంగన్వాడీ కేంద్రంలో భోజనాలు వండించుకుని తిన్నారు. దీంతో సర్పంచ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సింగాటం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 23 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నప్పటికీ, సర్పంచ్కు ఉన్న ఎకరంన్నర అసైన్డ్ భూమిని అధికార పార్టీ నాయకులు తీసుకుని ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. గ్రామంలో 40 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎవరనేది తేల్చలేదు. గ్రామంలో చాలా మంది దళితులు పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నారు. రిజర్వేషన్ వల్లనే దళితుడు సర్పంచ్ కాగలిగాడు. అయిదు దశాబ్దాలకు పైగా అగ్రకులాలే ఆ గ్రామాన్ని పాలించాయి. గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క దళితుడికి కూడా మూడెకరాల భూమి ఇవ్వలేదు. దళితులు చాలా మంది గజ్వేల్ పట్టణానికి కూలీ నాలీ కోసం వస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా దళితులను గ్రామంలో అగ్రకుల పెద్దలు పెద్దగా జోక్యం చేసుకోనివ్వడం లేదు. గ్రామ పంచాయతీ తీర్మానాలు మాత్రం తీసుకుంటున్నారు. షాదిముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో కూడా పెద్దగా జోక్యం చేసుకోనివ్వడం లేనట్టు తెలిసింది.
సెల్ : 9490094428
నాయిని యాదగిరి
గ్రామాల్లో ఇంకా వివక్ష ఉంది
గ్రామాల్లో ఇంకా వివక్ష కొనసాగుతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల్లో మార్పు రావడం లేదు. మీదో కులం మాదో కులం అంటూ ఇంకా చర్చించుకోవడం కనిపిస్తుంది. అధికారులే సర్పంచ్ను అవమానించడం బాధాకరం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కేసు నమోదు కాకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు.
- సందబోయిన ఎల్లయ్య, కేవీపీఎస్ నాయకులు
నా భూమి లాక్కున్నారు..
గ్రామంలో 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని వదిలేసి నాకు ఉన్న ఎకరంన్నర భూమిని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి తీసుకున్నారు. ఈ విషయంపై గడ అధికారికి కూడా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయడం లేదు. ప్రస్తుతం సాగు చేసుకునేందుకు ఎలాంటి భూమి లేదు. భోజనం చేయకుండా నన్ను అవమానించిన వారిపై ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు.
- దాసరి నర్సింలు, గ్రామ సర్పంచ్, సింగాటం
దళితులకు భూములివ్వాలి
గ్రామంలో దళితులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. దీంతో పనుల్లేక గజ్వేల్కు వెళ్లి కూలీ నాలీ చేసుకుంటున్నాం. గ్రామంలో సీసీ రోడ్లు, బిల్డింగ్ పనులు చేస్తుండ్రు. కానీ పని చూపడం లేదు. సర్కార్ మా గురించి ఆలోచించాలె.
- పెంటయ్య, సింగాటం
నా దృష్టికి రాలేదు
ఈ విషయం నా దృష్టికి రాలేదు. దళితుడిని అవమానపర్చడం సరైంది కాదు. ముందుగా సమాచారం ఇచ్చినందుకు వంట చేయడం సర్పంచ్ బాధ్యత, ఆయన బాధ్యతను నిర్వర్తించినప్పుడు, వైద్య సిబ్బంది ఇలా నిరాకరించడం నా దృష్టికి రాలేదు. సింగాటం గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 140 మందికి పరీక్షలు నిర్వహించాం.
డాక్టర్ లింగారెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి, అహ్మదీపూర్
దళితులకు ఇండ్లు ఇయ్యాలె
గ్రామంలో నిర్మిస్తున్న 40 ఇండ్లను దళితులకు కేటాయించాలె. దళితులు గూన ఇండ్లలోనే బతుకీడ్చుతున్నారు. భూమిని కూడా సర్కార్ గుంజుకుంటుందన్నారు. మా పోరగాన్లకు ఉపాధి కూడా లేదు. గ్రామంలో బతకాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం దళితులను పట్టించుకోవాలి.
- మాల నర్సింలు, సింగాటంగ్రామాల్లో ఇంకా వివక్ష కొనసాగుతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల్లో మార్పు రావడం లేదు. మీదో కులం మాదో కులం అంటూ ఇంకా చర్చించుకోవడం కనిపిస్తుంది. అధికారులే సర్పంచ్ను అవమానించడం బాధాకరం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కేసు నమోదు కాకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు.
Authorization