దివిటీల్లాంటి గొట్టిపాడు దళిత స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లు ఆ దళితవాడలో ఆత్మగౌరవ చైతన్యాన్ని ఉగ్గుపాలతో పెంచి పోషించిన తల్లులు. ఒక్కోసారి తాగుడుకి బానిసలైన మగవాళ్లు ప్రలోభాలకు లొంగిపోయినప్పటికీ వాళ్లు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడమే కాకుండా తాగుబోతు భర్తలకి బుద్ధి చెప్పిన ధీరులు. గ్రామంలో లైసెన్స్ వున్న మద్యం దుకాణాన్ని సైతం తమ పోరాటంతో మూయించగలిగిన కార్య సాధకులు వారు. జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ ఆ దళిత వాడకు ఓ చుక్కాని వంటి వ్యక్తి. జయ భాగ్యమ్మ నాయకత్వంలోనే వారు సారా వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపారు. దాడి సందర్భంగా దళిత స్త్రీలు చూపిస్తున్న ధైర్య సాహసాలు, వారి పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమైంది. గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ, ఆ తర్వాత ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి జరుగుతున్న నిరాహార దీక్షలోనూ స్త్రీలే ప్రధాన పాత్ర వహిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జయభాగ్యమ్మ నష్టపరిహారం, పునరావాసం కోసం ప్రభుత్వమిస్తానంటున్న సౌకర్యాల మీద మండిపడ్డారు. 'మీరు డబ్బులిస్తారని, రోడ్లు వేయిస్తారని మేము వాళ్లచేత దాడి చేయించుకోలేదు. మా ఆత్మ గౌరవ సమస్యని డబ్బుతో ముడిపెట్టొద్దు' అని ఆమె కోరుతున్నారు. దళిత పురుషుల్లో కొందర్ని కమ్మ కుల పెద్దలు తాగబోసి తమపైకి తగువుకి వుసిగొల్పి దీక్షా శిబిరాన్ని మూయించి తద్వారా తమ పోరాటం మీద నీరు చల్లాలని చూస్తున్నారనీ, తాము మాత్రం ఎంతో సంయమనంతో శిబిరాన్ని నడిపిస్తున్నామని జయ భాగ్యమ్మ చెప్పారు.
మాల, మాదిగ కులాలు కలిసి సుమారు వెయ్యి గడప వున్న పెద్ద గొట్టిపాడు దళితవాడ చైతన్యానికి మారు పేరు. వారు తమపై తరతరాలుగా రుద్దిన అంటరానితనాన్ని ధిక్కరించి ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. వున్న దాంట్లో తింటూ తెల్ల గుడ్డలేసుకుని తలెత్తి తిరుగుతున్నారు. గొట్టిపాడు మాల మాదిగ కుర్రోళ్లు ఒక్కొక్కరు ఒక చురకత్తి అనొచ్చు. ఎవరన్నా చులకనగా 'అరే, వొరే' అంటే వాళ్లకి నషాళానికంటుకుంటుంది. గ్రామంలోని పెత్తందారుల ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారికి వద్ధాప్య, వితంతు పింఛన్లు రాకపోతే అధికారులను నిలదీస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు పైన ఆరా తీస్తున్నారు. 'నీరు-చెట్టు' పేరుతో మాదిగల చెరువుని కబ్జా చెయ్యడం పైన అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ జన్మభూమి కమిటీల పేరుతో కమ్మ దొరలు చేస్తున్న ఆగడాలను ఎండగడుతున్నారు. కమ్మ కులస్తులు కరెంటు పన్ను, ఇంటి పన్ను కట్టకుండా మాల మాదిగలు కట్టిన పన్ను దబ్బుతో తమ వీధుల్లో సిమెంట్ రోడ్లు వేసుకోవడాన్ని ప్రశ్నించారు. ఇంటికిద్దరు ముగ్గురు మొగపిల్లలుంటే అందరూ చదువుకుంటూ ఖర్చుల కోసం సెలవుల్లో పెయింటింగ్, ఆటో నడపడం, కరెంట్ పని, బేల్దారి పని వంటి మర్యాదకరమైన పనులన్నీ చేస్తారు. దాదాపు అందరికీ టూ వీలర్ బండ్లు, చేతిలో సెల్ఫోను వున్నాయి.
డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి ఒకటో తేదీ మధ్యాహ్నం వరకు కమ్మదొరలు మాల పల్లెపై దాడి చెయ్యడానికి ఆ దళితవాడ చైతన్యం, కమ్మ కుల పెత్తనాన్ని వారు అంగీకరించకపోవడమే అసలు కారణం. డిసెంబర్ 31 అర్ధరాత్రి మాల యువకులు బైకులపై వెళ్లి కమ్మ వీధుల్లో ఆడ పిల్లలు ముగ్గులు వేస్తుంటే అల్లరి చేశారనే నెపంతో వారిని కొట్టారు. మరసటి రోజు క్షవరం చేయించుకోడానికి మంగలి షాపుకెళ్లిన యువకుడిని చితకబాదారు. తర్వాత చర్చీకెళ్తున్న స్త్రీ, పురుషులపై దాడి చేశారు. అదేమని అడిగిన ఆడవాళ్లకు లుంగీలెత్తి చూపించి అసభ్యంగా ప్రవర్తించి ఆడవాళ్లని అవమానించే జుగుప్సాకరమైన బూతులు తిట్టి తిరిగి బాధితులపైనే పోలీసు కేసు పెట్టడం ఈ సంఘటనలో ప్రధాన అంశం.
అక్కడి బాధితుల కథనం ప్రకారం దళిత యువకులు కమ్మ వారి వీధుల్లోకే వెళ్లలేదు. వాళ్లు 'హాపీ న్యూ ఇయర్' అని కేరింతలు కొట్టుకుంటూ వెళ్లింది కమ్మ వారికీ మాల పల్లెకీ మధ్యన వుండే చాకలి కులస్తులు నివసించే రోడ్డు మీదకి. అక్కడ వారు ఏదో తగిలి కిందపడ్డారు, అక్కడ కమ్మ స్త్రీలు వుండే అవకాశమే లేదు. అయినప్పటికీ దళితుల ఎదుగుదలను ఓర్వలేని కమ్మ పెత్తందారులు ఏదో ఒక నెపంతో దాడికి పాల్పడడమే కాకుండా 'మాల మాదిగ నా కొడుకులకి బండ్లు కావాల్సి ఒచ్చినాయా? మీ ఆడోళ్లు పది రూపాయలిస్తే మా బండెక్కి ఎక్కడికి రమ్మన్నా ఒస్తారురా!' అని దుర్భాషలాడి దళితవాడను వల్లకాడు చేస్తామని, గొట్టిపాడుని మరో కారంచేడుని చేస్తామని హెచ్చరించారు. ఆధిపత్యవాదులు ముందుగానే పథకం ప్రకారం బయట నుంచి తెచ్చుకున్న కర్రలు, సీసాలు, కత్తులతో వారిని చితక బాదితే కొందరు దళిత యువకులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరారు. దాడిలో వారి స్త్రీలు కూడా పాల్గొని దళితుల కండ్లల్లో కారం కొట్టడం ఇక్కడ గమనార్హం. ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణతో 35 మంది దళిత యువకులపై 354 సెక్షన్ ప్రకారం నాన్-బెయిలబుల్ కేసు పెట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసు అధికారులు స్పందించిన తీరు నిందితులను వెనకేసుకొచ్చేవిధంగా వుంది. బాధితుల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకి పంపి, అసలు ముద్దాయిలపైన బెయిలబుల్ సెక్షన్ల కింద నామమాత్రంగా కేసు పెట్టినట్టే పెట్టారు. ఇప్పుడు వారు బెయిల్పైన తిరిగొచ్చి గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధితులకు బెయిల్ మీద విడుదలైనా, స్వేచ్ఛగా ఇంటికి రాలేక పొరుగూర్లలోనే తలదాచుకుంటున్నారు.
దాడి అనంతరం గొట్టిపాడు దళితులపై రకరకాల వెలిని అమలు పరుస్తున్నారు. గ్రామంలోని కాఫీ హోటళ్లకు దళితులను రానివ్వకుండా, దళితవాడకు నీరు వదలనివ్వటం లేదు. దళితులను కూలి పనికి పిలవకుండా, గ్రామంలో వున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లల్ని రకరకాలుగా వేధింపులకు గురిస్తున్నారు. అసలు ముద్దాయిల్ని అరెస్ట్ చెయ్యకపోగా గ్రామంలో శాంతి భద్రతల పేరుతో 144వ సెక్షన్ విధించి ఇతర ప్రాంతాల వారిని, బాధితులకు అండగా వుండే ప్రజా సంఘాలవారిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. గొట్టిపాడు దళితులు తమపై జరిగిన దాడికి బెదిరిపోకుండా ప్రతిఘటించడం వారి చైతన్యానికి చిహ్నం. అరెస్టులకు, వెలివేతలకు వారు భయపడడం లేదు.
తమపై జరిగిన దాడిలో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలనీ, తమ వాడలో పోలీసు పికెట్ తొలగించాలనీ, తమపై అమలవుతున్న అప్రకటిత వెలిని నిషేధించి తమ పిల్లలు స్వేచ్ఛగా చదువుకునేలా శాంతియుత వాతావరణం కావాలని గొట్టిపాడు దళితులు గ్రామంలో రిలే నిరాహార దీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో స్త్రీలు క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. తమపై దాడి సందర్భంగా లుంగీలు ఎత్తి తమ మర్మావయాల్ని చూపించిన కమ్మ పురుషులపైన, తమ కండ్లల్లో కారం చల్లిన కమ్మ స్త్రీలపైన చర్య తీసుకోకుండా అధికారులు నిందితులను కాపాడే విధంగా వ్యవహరిస్తున్నా రని బాధిత స్త్రీలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక దివిటీల్లాంటి గొట్టిపాడు దళిత స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లు ఆ దళితవాడలో ఆత్మగౌరవ చైతన్యాన్ని వుగ్గుపాలతో పెంచి పోషించిన తల్లులు. ఒక్కోసారి తాగుడుకి బానిసలైన మగవాళ్లు ప్రలోభాలకు లొంగిపోయినప్పటికీ వాళ్లు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడమే కాకుండా తాగుబోతు భర్తలకి బుద్ధి చెప్పిన ధీరులు. గ్రామంలో లైసెన్స్ వున్న మద్యం దుకాణాన్ని సైతం తమ పోరాటంతో మూయించగలిగిన కార్య సాధకులు వారు. జొన్నలగడ్డ జయ భాగ్యమ్మ ఆ దళిత వాడకు ఓ చుక్కాని వంటి వ్యక్తి. జయ భాగ్యమ్మ నాయకత్వంలోనే వారు సారా వ్యతిరేక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపారు. దాడి సందర్భంగా దళిత స్త్రీలు చూపిస్తున్న ధైర్య సాహసాలు, వారి పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమైంది. గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ, ఆ తర్వాత ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి జరుగుతున్న నిరాహార దీక్షలోనూ స్త్రీలే ప్రధాన పాత్ర వహిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జయభాగ్యమ్మ నష్టపరిహారం, పునరావాసం కోసం ప్రభుత్వమిస్తానంటున్న సౌకర్యాల మీద మండిపడ్డారు. 'మీరు డబ్బులిస్తారని, రోడ్లు వేయిస్తారని మేము వాళ్లచేత దాడి చేయించుకోలేదు. మా ఆత్మ గౌరవ సమస్యని డబ్బుతో ముడిపెట్టొద్దు' అని ఆమె కోరుతున్నారు. దళిత పురుషుల్లో కొందర్ని కమ్మ కుల పెద్దలు తాగబోసి తమపైకి తగువుకి వుసిగొల్పి దీక్షా శిబిరాన్ని మూయించి తద్వారా తమ పోరాటం మీద నీరు చల్లాలని చూస్తున్నారనీ, తాము మాత్రం ఎంతో సంయమనంతో శిబిరాన్ని నడిపిస్తున్నామని జయ భాగ్యమ్మ చెప్పారు.
ఖైర్లాంజి, లక్షింపేట, గరగపర్రు దళితులపై దాడుల సందర్భంలాగే గొట్టిపాడు దళిత ఉద్యమం విషయంలోనూ కులం, జెండర్ అనే భావనల మధ్య వుండే వైరుధ్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈదేశంలో అనేకచోట్ల దళితులపై జరిగిన దాడుల్లో పెత్తందారీ కులాల స్త్రీలు ఒక్కసారైనా బాధిత స్త్రీల పక్కన నిలబడిన దాఖలాలు లేవు. ఖైర్లాంజి నుంచి గొట్టిపాడు దాకా ఆ విషయం స్పష్టంగానే కనిపిస్తున్నది. స్త్రీలకు కూడా కుల దురహంకారం పురుషుల్లాగే వుంటాయని ఆయా సంఘటనలు మనకి తెలియ చెప్పాయి. అయితే జయ భాగ్యమ్మ లాగా గతంలో దళిత స్త్రీలు కొందరు క్రియాశీలకంగా వున్నప్పటికీ వారిని నాయకులుగా గుర్తించడానికి దళిత పురుషులు అంగీకరించలేదు. జయ భాగ్యమ్మ చాలా కాలం నుంచి ఒక్కతే నిలబడి కొన్ని విజయాలు సాధించడం వలన ఇప్పుడామెని తమ నాయకురాలిగా వారు భావిస్తున్నారు. దళిత ఉద్యమంలో ఇదొక మంచి పరిణామంగా భావించవచ్చు. దళిత స్త్రీల భాగస్వామ్యంతోనే దళిత ఉద్యమం సవ్యంగా ముందుకెళ్తుంది.
గొట్టిపాడు దళిత స్త్రీలను చూస్తే 1920, 30వ దశకాలలో అంబేడ్కర్ నడిపిన రాడికల్ ఉద్యమంలో పాల్గొన్న మహర్ స్త్రీలు జ్ఞాపకమొస్తారు. దళిత సమాజాన్ని అంతర్గతంగా సంస్కరించడానికి ఆయన దళిత స్త్రీలపైనే ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు. వారాయన ఆశలు నెరవేర్చడమే కాక ఆయన సాగించిన ప్రజా ఉద్యమాలలో క్రియాశీలక భాగస్వాములవ్వడం చూస్తాం. గొట్టిపాడు దళిత పోరాట శిబిరాన్ని కూడా స్త్రీలు శక్తివంతంగా నడిపిస్తున్నారు. వారి పోరాట స్ఫూర్తికి జేజేలు...
- ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి
సెల్ : 9440362433
Authorization