బహుజన సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో కాన్షీరామ్ నిరంతరం శ్రమించి విజయం సాధించాడు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు ఒక సామాన్య మహిళ, 'చమార్' స్త్రీని మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత పూర్తిగా కాన్షీరామ్దే. ఓట్ల రాజకీయాలను నోట్లు కలుషితం చేస్తూ కార్పొరేట్ రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో 'ఒక ఓటు ఒక నోటు' అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతో ప్రచారం చేస్తూ ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని సాధించి దేశ రాజకీయాలకు సరికొత్త విలువలు నేర్పిన మార్గదర్శకుడు కాన్షీరామ్. పదవులు ముఖ్యం కాదు బహుజన సమాజ్ నిర్మాణమే నా కర్తవ్యం అని భావించేవారు. అంబేద్కర్ కలలు నిజం చేయడానికి ముందుకురికిన రాజీనీతిజ్ఞుడు. కొన్ని రాజకీయ పార్టీలు వారి వారి పార్టీ స్థాపకుల ఫొటోలను వేదిక మీద ప్రదర్శిస్తుంటే కాన్షీరామ్ మాత్రం జాతిని చైతన్యపరిచిన బుద్ధుడు, ఫూలే, నారాయణగురు, పెరియార్, అంబేద్కర్ వంటి సామాజిక విప్లవకారుల చిత్రపటాలను బహిరంగ సభల్లో ప్రదర్శించేవారు.
బడుగు బలహీన వర్గాల దాస్య విముక్తి కోసం మహాత్మా బసవేశ్వర్, మహాత్మా జ్యోతీరావుపూలే, పెరియార్ రామస్వామి నాయకర్, ఛత్రపతి సాహూజీ మహారాజ్, నారాయణ గురు, కబీర్, సంత్రవిదాస్, బిర్సాముండా, గాడ్గీ బాబా, భాగ్యరెడ్డి వర్మ, భారత రాజ్యాంగ నిర్మాత డా|| బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలైన వారు అహర్నిశలు కృషి చేశారు. అదే స్ఫూర్తితో బహుజనుల సకల సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా మహోద్యమాన్ని నడిపిన యోధుడు కాన్షీరామ్. 'ఓట్ హమారా - రాజ్ తుమారా, నహీ చలేగా.. నహీ చలేగా' అనే డైనమేట్ వంటి నినాదంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన గొప్ప వ్యూహకర్త మాన్యశ్రీ కాన్షీరామ్.
1934 మార్చి 15న పంజాబ్ రాష్ట్రం, రోపార్ జిల్లా ఖవాస్పూర్లో ఉన్న పీర్షివూర్ బంగ్లా గ్రామంలో ఒక చమార్ కుటుంబంలో కాన్షీరామ్ జన్మించారు. ఆయిదో సిక్కు గురు రాందాస్ చమార్లను సిక్కు మతంలోకి తీసుకువచ్చారు. వారిని రాందాసియాలు అనేవారు. తన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న కాన్షీరామ్ అక్కడే వివక్ష అసలు స్వరూపాన్ని ఎదుర్కొన్నారు. ఆ స్కూలులో దళిత సాధువులతో వేరే బెంచిపై కూర్పోపెట్టేవారు. కబీర్, రవిదాస్ల వంటి దళిత సాధువులతో ప్రభావితమైన ఖల్సా పంథ్, ఆర్యసమాజ్ ఉద్యమాల ప్రభావం చిన్ననాడే కాన్షీరామ్పై పడింది. రోపార్లో 1956లో బీఎస్సీ పూర్తి చేశారు. కొంతకాలం డెహ్రాడూన్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పని చేశారు. సర్వే ఆఫ్ ఇండియాలో పరీక్ష పాసైనప్పటికీ బాండ్రాసి ఉద్యోగం చేసేందుకు నిరాకరించారు. చివరకు పూణేలోని (ఈఆర్డీఎల్) ఎక్స్ప్లోజివ్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీలో సైంటిస్ట్గా చేరారు. అక్కడ అగ్రవర్ణాలు బుద్ధ జయంతి, అంబేద్కర్ జయంతి సెలవులను రద్దు చేయడంపై దళిత ఉద్యోగులు నిరసన తెలుపడం, అందులో రాజస్థానీ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని సస్పెండ్ చేయడంపై కాన్షీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పక్షాన నిలిచి పోరాడారు. అది ఆయన దళిత ఉద్యోగుల ఉద్యమాన్ని నిర్మించేందుకు కారణమైంది. ఈ ఉద్యమం తీవ్రం కావడంతో కాన్షీరామ్ ఏకంగా రక్షణ మంత్రి వైబి.చవాన్ను కలిసి పరిస్థితి వివరించారు. చవాన్ మొత్తం ఉదంతంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి సస్పెండైన ఉద్యోగికి న్యాయం జరిగేలా చేశారు. దీనితో కాన్షీరామ్ దళిత ఉద్యోగులకు ఒక హీరోగా మారారు. ఈ సంఘటనే కాన్షీరామ్ జీవితాన్ని మార్చివేసింది. అదే సమయంలో ఆయన డా|| బి.ఆర్. అంబేద్కర్ రచించిన 'అనిహిలేషన్ అఫ్ క్యాస్ట్' చదివి ఎనలేని ప్రభావానికి గురయ్యారు. అంబేద్కర్ గురించి తెలుసుకున్న కొద్దీ కాన్షీరామ్ ఏదో తెలియని మానసిక ఒత్తిడికి గురయ్యేవాడు. అంబేద్కర్కి చదువు పట్ల అంతటి కోరికకు కారణం ఏమిటి? భార్య పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పటికీ రక్త బంధాలను విడిచిపెట్టి తన జాతికోసం ఎందుకు ఇంతలా తపన పడ్డాడు! ఇవన్నీ తలచుకుని కాన్షీరామ్ చలించిపోయాడు. తన జాతి జనుల కోసం పాటుపడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించాలని, ప్రస్తుత సామాజిక వ్యవస్థపై తిరుగుబాటు చేయక తప్పదని నిర్ణయించుకున్నారు. తన జాతి జనుల కోసం పాటుపడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు కాన్షీరామ్. అంబేద్కర్ ఉద్యమాలను, గ్రంథాలను శోధించడం ప్రారంభించడమేకాక మహాత్మ జ్యోతిబాఫూలే, ఛత్రపతి సాహూమహారాజ్, నారాయణగురు, పెరియార్ రామస్వామి, వంటి నాయకుల జీవితాలను, పోరాటాలను అధ్యయనం చేశాడు.
కుల ప్రాతిపదికన విభజించబడి అస్తవ్యస్తంగా ఉన్న సమాజాన్ని మార్చాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదని, నిజాయితీతో కూడిన సమరశీల శక్తిగా ఎదగడానికి బ్రహ్మ చర్యం పాటించాలని కాన్షీరామ్ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ''బహుజన సమాజమే నా కుటుంబం. బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన మహోన్నత సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా జీవిత లక్ష్యం'' అనే నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారు. భుజాన ఒక సంచితో పాత సైకిలుపై కాళ్లకు చెప్పులు లేకుండా ఊరూరు తిరిగి కరపత్రాలు పంచుతూ, ఆకలి, దాహం మర్చిపోయి ముంబాయి, దుర్గి, రాయపూర్, ఒస్తర్, నాగపూర్, నాందేడ్, పూనే, జబల్పూర్, బిలారు మొదలగు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు.
1965 నుంచి 1971 వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయడానికి రాత్రి పగలు అకుంఠిత దీక్షతో కృషి చేశాడు. ఆర్పీఐలో వచ్చిన విభేదాలతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఉద్యమాన్ని కొనసాగించారు. బోధించు, పోరాడు, సమీకరించు నినాదంతో 1978 డిసెంబర్ 6న 'వెనుకబడిన కులాల, మైనారిటీ ఉద్యోగుల సమాఖ్య' (బామ్సెఫ్) స్థాపించారు. తాము పుట్టిన కులంలోని అట్టడుగున ఉన్న తమ సోదరుల కోసం తాము కొంత పాటుపడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కృషితో వచ్చిన రిజర్వేషన్ల వల్ల లాభం పొందిన వారిని ఏకం చేశారు. ఐదు సంవత్సరాల పాటు కాన్షీరామ్ ఉద్యోగుల సమీకరణకు తీవ్రంగా కృషి చేసాడు. కాన్షీరామ్ ఈఉద్యమాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించాడు. కాన్షీరామ్ కార్యకర్తలు ప్రజలను విస్తృత పరిధిలో నమోదు చేయించడం, సచివాలయ నిర్మాణం, సంస్థాగత నిర్మాణం, ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు, సహోదరత్వం, దత్తత, వైద్య సహాయం, సలహాలు, సాహిత్య శాఖ, పరిశోధనాశాఖ, స్వచ్ఛంద కార్యకర్తల దళం ఏర్పాటు చేశారు.
సామాజిక పరివర్తన ధ్యేయంగా 1981 డిసెంబర్ 6న దళిత అణగారిన వర్గాల పోరాట సమితి (డీఎస్ 4) స్థాపించారు. ఉత్తర భారతదేశంలో ఒక సంచలనాత్మక సామాజిక విప్లవాన్ని సృష్టించారు. ఇందులో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరారు. ''చిన్న చిన్న సాధనాలను పెద్ద ఎత్తున ఉపయోగించి పెద్ద సాధనాల వారిని ఓడించండి'' అంటూ కాన్షీరామ్ యువతకు పిలుపునిచ్చాడు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు 'సమానత్వం కోసం' సైకిల్ ర్యాలీ నిర్వహించిన కాన్షీరామ్ 1982లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో సంస్థ పోటీ చేసి 4వ స్థానాన్ని సాధించింది. 1930లో డా||బి.ఆర్. అంబేద్కర్ తొలిసారిగా ఓటు హక్కు లభించాక ''మీరు వెళ్లి మీ ఇంటి గోడలపై రాయండి, ఈ దేశానికి మేము పాలకులం కాబోతున్నాం'' అని పేర్కొన్నారు. ఈ నినాదాన్ని తీసుకుని 14 ఏప్రిల్ 1984న బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. కాన్షీరామ్ ఏ కొత్త కార్యక్రమం మొదలు పెట్టినా అది అంబేద్కర్ పుట్టిన రోజున గానీ, మరణించిన రోజున గానీ చేస్తారు. ఎందుకంటే ఆ రెండు రోజులు బహుజనులకు ప్రధానమైనవని ఆయన భావించేవారు.
1984 నుంచి జరిగిన ఎన్నికలలో బీఎస్పీ తన అభ్యర్థులను నిలబెడుతూ జాతీయ పార్టీలకు గట్టిపోటీ ఇస్తూ ముందుకు సాగింది. 1987 ఆగష్టు నుంచి 1988 ఆగష్టు 15 వరకు ఒక సంవత్సరం పాటు బీఎస్పీ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అంటరానితనం, అత్యాచారాలు, అమానుషత్వం, అన్యాయాలు, అభద్రత అసమానతలను తొలగించడానికి, కాంగ్రెస్, బ్రహ్మణీయ శక్తుల అమానుషత్వాన్ని ప్రశ్నించడానికి ఉద్యమ కార్యాచరణ తయారు చేశారు. 1988 సెప్టెంబర్ 17న పెరియార్ జన్మదినాన్న సామాజిక పరిణామ ఉద్యమంగా ప్రారంభించాడు. 'మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుంటే గద్దె దిగిపోండి అనే నినాదంతో కాన్షీరామ్ 1989లో ఉద్యమం చేసాడు. వ్యవసాయ కూలీల కోసం కిసాన్ మజ్దూర్ ఉద్యమాన్ని చేసాడు. అంతేకాకుండా సఫాయి మజ్దూర్ ఆందోళన, చేతి వృత్తికారుల ఆందోళన, భాగీదారి ఆందోళన వంటి ఉద్యమాలు నడిపాడు. 1989 మార్చి 15న ఢిల్లీలో గొప్ప బహిరంగ సభ, ప్రదర్శన నిర్వహించి బహుజనులకు హక్కులు ఎంత అవసరమో పాలకులకు తెలియజేసాడు.
1993లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, సంకీర్ణ కూటమి విజయం సాధించి ములాయం సింగ్ ప్రభుత్వంలో బీఎస్పీ సభ్యులు మంత్రులుగా ఉండటం విశేషం, బహుజన సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో కాన్షీరామ్ నిరంతరం శ్రమించాడు. విజయం సాధించాడు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఒక సామాన్య మహిళ, 'చమార్' స్త్రీని మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఘనత పూర్తిగా కాన్షీరామ్దే. ఓట్ల రాజకీయాలను నోట్లు కలుషితం చేస్తూ కార్పొరేట్ రాజకీయాలు కొనసాగుతున్న తరుణంలో 'ఒక ఓటు ఒక నోటు' అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతో ప్రచారం చేస్తూ ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని సాధించి దేశ రాజకీయాలకు సరికొత్త విలువలు నేర్పిన మార్గదర్శకుడు కాన్షీరామ్. పదవులు ముఖ్యం కాదు బహుజన సమాజ్ నిర్మాణమే నా కర్తవ్యం అని భావించేవారు.
దేశ రాజకీయాల్లో కాన్షీరామ్ ప్రవేశం గొప్ప సంచలనం. అంబేద్కర్ కలలు నిజం చేయడానికి ముందుకురికిన రాజీనీతిజ్ఞుడు. అన్ని రాజకీయ పార్టీలు వారి వారి పార్టీ స్థాపకుల ఫొటోలను వేదిక మీద ప్రదర్శిస్తుంటే కాన్షీరామ్ మాత్రం జాతిని చైతన్య పరిచిన బుద్ధుడు, ఫూలే, నారాయణగురు, పెరియార్, అంబేద్కర్ వంటి సామాజిక విప్లవకారుల చిత్రపటాలను బహిరంగ సభల్లో ప్రదర్శించేవారు.
ఉద్యమంలో తీరిక లేకుండా తిరగడం వల్ల ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్లు ఎంత వారించినా ఆరోగ్యాన్ని లెక్క చేసేవాడు కాదు. నా జాతిజనుల కోసమే ఈ జీవితం అని క్షణం తీరిక లేకుండా పని చేశాడు. మధు మెహం శరీరాన్ని తినుకుంటూ వచ్చేసింది. 2003లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 2004లో మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. అక్టోబర్ 9, 2006 కాన్షీరామ్ తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. ఈ దేశాన్ని పాలించడమే లక్ష్యంగా రాజ్యాధికారం వైపు వెళితేనే బహుజనులకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టంగా వివరించిన వారు కాన్షీరామ్. ఆయన మరణించినా ఆయన ఆశయం మరణించలేదు. కాబట్టి ప్రజలంతా కుల నిర్మూలన దృక్పథంతో తమ కుల అస్థిత్వాన్ని పక్కనపెట్టి బహుజన అస్థిత్వాన్ని సాధించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
- డా|| సోమేశ్వర్ బోనకుర్తి
సెల్ : 9293762428
Authorization