అది రాష్ట్రంలోనే పేరుగాంచిన గుడి. దాని వార్షిక ఆదాయం సుమారు 3 కోట్లు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ విహారయాత్రకు వచ్చిన భక్తుల లిస్టులో ఆ ఆలయ సందర్శన కూడా ఉంటుంది. ఇంతపేరున్న ఆలయంలో అణగారిన కూలాల పట్ల వివక్ష చూపుతున్నారు.
కర్మన్ఘట్ అభయాంజనేయ ఆలయం ఆదాయ వనరుల విషయంలో రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉన్నది. ఈ ఆలయానికి భక్తులు మన రాష్ట్రం నుండే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి కూడా వస్తుంటారు. ఈ ఆలయం ఆధీనంలో విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. కానీ ఇక్కడ కుల వివక్ష కోరలు చాచింది. ఆలయ కమిటీలో దళితులు చేరకుండా బుసలు కొట్టి తరిమేసింది. ఎండోమెంట్ వారి నిబంధనల ప్రకారం ఆలయ కమిటీలో తప్పకుండా కనీసం ఒక దళితుడికి అవకాశం ఇవ్వాలి. కనీసం మహిళనైనా కమిటీలో సభ్యులుగా ఉండాలి. ఈ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఆధిపత్య కులాలతో కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా దళితులు వ్యతిరేకించారు. ఆ కమిటీలో తమకూ అవకాశం కల్పించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఆధిపత్య కులాలు తమకు అనుకూలంగా ఉండే ఓ దళిత మహిళను కమిటీలో చేర్చుకున్నారు. ఆమెనే మహిళా కోటా కింద, దళిత కోటా కింద చూపించే ప్రయత్నం చేశారు. దీనిని దళితులు అంగీకరించకపోవడంతో తిరిగి మరో మహిళకు అవకాశం ఇచ్చారు. 18 మందితో కమిటీ వేసేందుకు నిర్ణయించగా 16మంది ఆధిపత్య కులాల వారే ఉండటం గమనించదగిన విషయం. ఈ ఆలయ పరిధిలో ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున్న జాతర సాగుతుంది. ఆ సందర్భంగా ఆలయానికి మొక్కులు, ఇతర కానుకల రూపంలో మంచి ఆదాయం వస్తుంది. ఈ ఆలయానికి వచ్చే ఆదాయాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఆలయ వర్షికోత్సవం సందర్భంగా లెక్కిస్తారు. భూములను రెంటుకు, కౌలుకు, ఇచ్చారు. వీటి ద్వారా కూడా భారీగానే ఆదాయం వస్తున్నది.
రాజకీయ వత్తిళ్లే కారణమా?
ఈ ఆలయ కమిటీ నియామకంలో రాజకీయ జోక్యం ఎక్కువైం దనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిటీ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి రాష్ట్ర మంత్రికి దగ్గరి బంధువు కావ డంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతున్నది. మరోవైపు ఆలయ కమిటీలోకి అమ్యామ్యాలు ము ట్టజెప్పిన వారినే సభ్యులుగా తీసుకున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఆలయ కమిటీ సభ్యులుగా ఉండదలిచిన వారు అభ్యర్థన పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇలాంటిదేమీ అక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ సభ్యులుగా ఎన్నికైన వా రంతా దరఖాస్తు చేసుకున్నారని ఆలయ పాలక మండలి చెబుతున్నది. ఈ కమిటీ నియామకంలో పారదర్శకత లేదంటూ దళిత సంఘాల నాయకు లు, స్థానిక దళితులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ఆ డివిజన్ కార్పొరేటర్ తదితరులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కానీ ఆ ఆలయ కమిటీలో తమ ప్రమేయం లేదంటూ దళితులకు ఆ నాయకులు మొహం చాటేశారు.
కమిటీలో దళితులకు అవకాశం ఇవ్వాలి
ఈ ఆలయ ధర్మకర్తల కమిటీలో అధికార పార్టీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ఎండోమెంట్ నిబంధనల ప్రకారం మహిళలకు, దళితులకు కమిటీలో అవకాశం ఇవ్వాలి. కానీ స్త్రీ, ఎస్సీ కోటా కలిపి ఒక్కరికే ఇచ్చారు. దీనిపై ప్రశ్నిస్తే నాకేం తెలియదని ఎవరికి వారు తప్పించుకుంటున్నారు. ఈ విషయమై హోంమంత్రికి, ఎమ్మెల్యేకు, కార్పొరేటర్కు ఫిర్యాదు చేశాం. ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలు చేసే వారిని కూడా కమిటీలోకి తీసుకున్నారు. కచ్చితంగా ఈ కమిటీ ఏర్పాటులో వివక్ష చూపారు. తక్షణమే కమిటీలో మరికొంతమంది దళితులకు అవకాశం కల్పించాలి.
- కంఠం సైదులు, తెలంగాణ వికాస సమితి కోఆర్డినేటర్, రంగారెడ్డి జిల్లా
నిబంధనలన్నీ పాటించాం
ఆలయ కమిటీ ఏర్పాటులో ఎలాంటి వివక్ష లేదు. నిబంధనల ప్రకారమే ఆలయ ధర్మకర్తల కమిటీని నియమించాం. ఈ కమిటీలో దళితులకు అవకాశమిచ్చాం. మహిళలకు కూడా అవకాశమిచ్చాం. ఇంకా వివక్ష ఎక్కడ చూపారో ఆరోపణలు చేసే వారికే తెలియాలి. మేం మాత్రం ఎండోమెంట్ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం.
- అంజనారెడ్డి, ఆలయ ఈవో, కర్మన్ఘట్ అభయాంజనేయ ఆలయం
- ఓగోటి కిరణ్కుమార్
సెల్ : 8639518341
Authorization