- సీఎం రిలీఫ్ ఫండ్కు లంచం అడిగిన అగ్రకులస్తులు
- ఇచ్చుకోలేమంటే భౌతికదాడికి దిగిన అధికార పార్టీ నాయకులు
అధికారం మాది, అడిగింది ఇవ్వాల్సిందే. లేకుంటే దాడులు తప్పవనే సిద్ధాంతం ఇక్కడ కొనసాగుతున్నది. 'దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డగించాడు' అన్నట్టు, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కు వస్తే కార్యకర్తలకు ముడుపులు చెల్లించందే, చెక్కు బాధితుడికి ముట్టని పరిస్థితి దాపురించింది. తన వల్ల కాదని పై నాయకులకు ఫిర్యాదు చేస్తే దళితుడు మాపై ఫిర్యాదు చేయడమేంటని ఆధిపత్య కులాల వారు బాధితుడిపై దాడికి దిగారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన రాగుల సతీష్ కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో సుమారు రూ.86 వేలు ఖర్చుచేశాడు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డ బాధితుడు ప్రభుత్వ సాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధిత మెడికల్ ఖర్చుల రశీదులతో దరఖాస్తు చేసుకున్నాడు. సుమారు ఆరు నెలల అనంతరం మే 24న సతీష్కు గ్రామంలోని మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యాకల రజనీకాంత్రెడ్డి నుండి ఫోన్ వచ్చింది. 'నీకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కు రూ.31 వేలు వచ్చింది, అది నా వద్దనే ఉన్నది, నీకు ఇవ్వాలంటే రూ.5 వేలు పట్టుకురా..' అని చెప్పాడు. దీంతో సతీష్ హుస్నాబాద్ ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుకు డబ్బులు అడుగుతున్నారని వాపోయాడు. తన కొడుకు ఆరోగ్యం బాగలేక ఖర్చులు పెరిగిపోయాయనీ, ఈ పరిస్థితుల్లో రూ.5వేలు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేనని బతిమిలాడుకున్నాడు. కానీ ఐదు నిమిషాల వ్యవధిలోనే గ్రామ సర్పంచ్ పొన్నాల శంకర్, గ్రామ సుంకరితో గ్రామ పంచాయతీ వద్దకు సతీష్ను తీసుకురావాలని, తనకు చెక్కు ఇస్తానంటూ కబురు పంపించాడు. సతీష్ అక్కడకు చేరుకోగానే అక్కడే ఉన్న అగ్రకులస్తులు 'వీడి చెక్కును ఆపండి, వీడిని ఎవడు అడిగాడు డబ్బులు..' అంటూ బెదిరించారు. గ్రామ సర్పంచ్ సర్దిచెప్పి ఆ చెక్కును సతీష్కు అందజేశాడు. అంతలోనే మ్యాకల మోహన్రెడ్డి తన కోపాన్ని అదుపుచేసుకోలేక పక్కనే ఉన్న వృద్ధుడి కర్ర లాక్కొని సతీష్పై దాడి చేశాడు. అక్కడే ఉన్న మోహన్రెడ్డి కుమారులు మ్యాకల సురేందర్రెడ్డి, మ్యాకల చంద్రశేఖర్రెడ్డిలు ముగ్గురు కలిసి బాధితుడిపై దాడి చేశారు. ఇంతలోనే గ్రామస్తులు, సతీష్ అన్న రాగుల శ్రీనివాస్కు, అతని భార్య నవనీత, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తే 'మీరు దళితులు.. మీరు కూడా మా అన్నపై ఎమ్మెల్యే పీఏకు కంప్లైంట్ చేస్తారా?' అంటూ బెదిరించారు. ఈఘటనపై బాధితుడు, వారి కుటుంబ సభ్యులు కోహెడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కోట సతీష్ విచారణ చేపట్టి మ్యాకల మోహన్రెడ్డి, మ్యాకల సురేందర్రెడ్డి, మ్యాకల చంద్రశేఖర్రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేశారు. దీంతో ఖంగుతిన్న టీఆర్ఎస్ నాయకులు ఈ కోపాన్ని దళితులకు మద్దతుగా నిలిచిన మాజీ సర్పంచ్పైన ప్రదర్శించారు. అదే గ్రామానికి చెందిన దళిత కులస్తుడు బాకూరి మహేందర్ అనే వ్యక్తిని గ్రామ మాజీ సర్పంచ్ బస్వరాజు శంకర్ కులం పేరుతో దూషించాడని మరుసటి రోజున స్థానిక పోలీస్స్టేషన్లో మరో ఫిర్యాదు చేశాడు. సతీష్కు మద్దతు తెలిపినందుకే తనపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించారని బస్వరాజు శంకర్ ఆరోపిస్తున్నాడు.
లంచం ఇస్తేనే చెక్కు ఇస్తరట!
మా వద్ద డబ్బులు లేకనే ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేశాం. అలాంటిది రూ.5 వేలు ఇవ్వమంటే ఎక్కడ నుండి ఇచ్చేది. నా కుమారుడు బాగలేక ఆస్పత్రుల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయాం. ఇలాంటి స్థితిలో లంచం అడిగి, ఇచ్చుకోలేమని బతిమాలితే మాపై దాడి చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు.
- రాగుల నవనీత, బాధితుడి భార్య
నాపై దాడి చేయడం దారుణం
గ్రామపంచాయతీకి చెక్కు ఇస్తానని పిలిపించారు. డబ్బులొస్తాయని వెళ్తే కులం పేరుతో దూషిస్తూ నాపై దాడికి దిగారు. నా భార్యను కూడా కొట్టారు. నన్ను, నా భార్యను దారుణంగా కొట్టారు. మమ్మల్ని కులం పేరుతో తిట్టారు. ఊళ్లో మా పరువు తీశారు. అధికార అహంకారంతోనే మాపై దాడి చేశారు. దళితులపై దాడులు ఆపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
- రాగుల సతీష్, బాధితుడు
చెక్కు వారివద్దకు ఎలా వచ్చింది?
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు వస్తే ఎంపీడీవో దగ్గర ఉండాలి. టీఆర్ఎస్ కార్యకర్తల దగ్గరకు చెక్కు ఎలా వచ్చింది. కక్షపూరితంగానే మా తమ్ముడిపై అగ్రకులస్తులు దాడి చేశారు. లంచం అడిగితే ఎమ్మెల్యే పీఏకు ఫిర్యాదు చేయడం తప్పా?.
- రాగుల శ్రీనివాస్, బాధితుడి అన్న
కక్షపూరితంగానే నాపై ఫిర్యాదు
దళితుడిపై కర్రలతో, కంకర రాళ్లతో దాడి చేయడం పద్ధతి కాదని బాధితుడికి అండగా నిలబడ్డాను. అందుకే నాపై వారి అనుచరుడైన బాకూరి మహేందర్తో కేసు పెట్టించారు. దళితుల అభ్యున్నతికి పాటుపడతామనే ప్రభుత్వంలో ఇలా దళితులపైనే వారి కార్యకర్తలు దాడులకు పాల్పడడం సమంజసంకాదు.
- బస్వరాజు శంకర్, మాజీ సర్పంచ్
- సొప్పరి రాములు
సెల్ : 9959003290
Authorization