- శ్మశానమే ఆమె ఆస్తి అ శవమొస్తేనే కూడు....
- కాటికాపరుల జీవితం అత్యంత దుర్భరం
ఒక జీవి బతకాలంటే, మరో ప్రాణిపై ఆధారపడాలి ఇదే జీవితం. కానీ ఓ మనిషి చస్తేనే, ఇంకో మనిషి మనుగడ కొనసాగుతున్నది ఇక్కడీ టెక్నాలజీలో మనిషి ఖ్యాతి ఖండాంతరాలకు దాటింది... ఏదైనా సాధించే శక్తి నేడు మనిషి సొంతం... అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. జానెడు పొట్ట కోసం ఎప్పుడు ఎవరు చస్తారా? అని ఎదురుచూసే మనుషులు ఇంకా ఈ హైటెక్ యుగంలో మన మధ్యే ఉన్నారంటే ఈ తప్పెవరిది? స్వాతంత్య్రాన్ని కొందరికే పరిమితం చేసిన ఈ వ్యవస్థదా? లేక వీరిని కేవలం ఓటు బ్యాంకుగా మార్చిన రాజకీయ వ్యవస్థదా? ముప్పై ఏండ్లకు పైగా పీనుగుల మీద ఆధారపడి బతుకుతున్న ఈ కాటి కాపరి జీవితం ''కుల వృత్తి'' అనే మనువాదం గిరిగీసి వదిలేసిన బానిస బతుకుకు నిదర్శనం.
''ఇలలో ఎన్ని ఉన్నా కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్నా'' అనేది ఒకప్పటి సామెత. కానీ నేడు ప్రపంచీకరణ ప్రభావంలో కుల వృత్తులన్నీ ధ్వంసమయ్యాయి. ఎంతోమంది కుల వృత్తులు వదిలేసి వలసబాట పట్టారు. ఏ పనీ లేనివారు భారీ భవంతుల ముందు (వాచ్మెన్) బంట్రోతులయ్యారు. కుల వృత్తులపై ఆధారపడి కొందరు జీవిస్తున్నా కూటికెల్లక నానా అవస్థలు పడుతున్నారు. ఇది పోటీ ప్రపంచం... అప్రమత్తంగా లేకపోతే అవకాశాలు అందకుండా పోతాయి. పోయిన అవకాశం మళ్లీ తిరిగి వస్తుందని ఆశించలేం. నేడు పదో తరగతి చదివితే కండక్టరో, అటెండరో కావాలనుకుంటారు. ఇంటర్మీడియట్ చదివితే జూనియర్ అసిస్టెంట్ వంటి మంచి ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ప్రయివేటు ఉద్యోగమైనా ఆఫీసులో కూర్చొని చేసే పనులే కోరుకుంటారు. అదే 35-40 ఏండ్ల కింద ఈ చదువు చదివి ఉంటే చాలా మంచి ఉద్యోగమే తనను వెతుక్కుంటూ వచ్చేది. కానీ మెదక్ జిల్లా కేంద్రంలోని ఓ మహిళ నేటికీ కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నది. తన తాత, ముత్తాతల నుంచి నమ్ముకొని జీవిస్తున్న బ్యాగరి (కాటికాపరి) వృతిపైనే ఆధారపడి జీవిస్తున్నది. ఆమె చదువు సంధ్య లేనిదేం కాదు. 35 ఏండ్ల కిందటే ఇంటర్మీడియట్ వరకు చదివింది....
ఒక జీవి బతకాలంటే, మరో ప్రాణి పైఆధారపడాలి ఇదే జీవితం. కానీ ఓ మనిషి చస్తేనే, ఇంకో మనిషి మనుగడ కొనసాగుతున్నది ఇక్కడీ టెక్నాలజీలో మనిషి ఖ్యాతి ఖండాంతరాలకు దాటింది... ఏదైనా సాధించే శక్తి నేడు మనిషి సొంతం... అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. జానెడు పొట్ట కోసం ఎప్పుడు ఎవరు చస్తారా? అని ఎదురుచూసే మనుషులు ఇంకా ఈ హైటెక్ యుగంలో మన మధ్యే ఉన్నారంటే ఈ తప్పెవరిది? స్వాతంత్య్రాన్ని కొందరికే పరిమితం చేసిన ఈ వ్యవస్థదా? లేక వీరిని కేవలం ఓటు బ్యాంకుగా మార్చిన రాజకీయ వ్యవస్థదా? ముప్పై ఏండ్లకు పైగా పీనుగుల మీద ఆధారపడి బతుకుతున్న ఈ కాటి కాపరి జీవితం ''కుల వృత్తి'' అనే మనువాదం గిరిగీసి వదిలేసిన బానిస బతుకుకు నిదర్శనం.
మెదక్ జిల్లా కేంద్రంలో ఊరి చివరన బొందల గడ్డ. అక్కడికి వెళ్లగానే గేటు వద్ద ఓ చిన్న గది. గేటు దాటి లోపలికెళ్తే ఆ గదిలో ఓ కుటుంబం తమ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నది. వారికి ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆస్తిపాస్తులేమీ లేవు. ఆ గదే వారికి దిక్కూమొక్కు. ఆ ఇంటి పెద్ద దిక్కు పేరు సుజాత. బ్యాగరి సుజాత అంటే అందరూ గుర్తు పడతారు. ఆమె తమ తాత, ముత్తాల నుంచి కుల వృత్తిగా వచ్చిన బ్యాగరి వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నది. సుజాత చదువుకుంది. ఇంటర్మీడియట్ వరకు మెదక్లోని బాలికల కళాశాలలో చదివిన ఆమె జీవితం అప్పటి వరకు తోటి అమ్మాయిల్లాగే సాఫీగా గడిచింది. అమ్మా నాన్నలు కాటికాపరులుగా ఉంటూ కుటుంబాన్ని పోషించేవారు. తాత ముత్తాతల నుండి సంక్రమించిన ఈ కుల వృత్తే, వీరికి జీవనాధారం. అయితే1992లో తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచి జీతమే కాదు, ఇంతకంటే మంచి జీవితం లభించేది. కానీ కులం ఆమెను కుల వృత్తిని మాని బయటకు రానివ్వలేదు. ఇంటర్ చదువుతున్నప్పుడే అప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇటు కుల వృత్తిలోనా, లేక ఉద్యోగం చేయాలా? అని ఆలోచించుకోలేదు ఆమె. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురైన ఆమె వృత్తిని తాము వదిలిపెడితే ఎలా? అనే ఆలోచన ఆ చట్రం నుంచి బయటపడనివ్వలేదు. మరో ఆలోచనే లేకుండా తాత ముత్తాల నుండి వచ్చిన కాటికాపరి వత్తిని 35 ఏండ్లుగా చేస్తూనే ఉంది. బొందల గడ్డకు శవమొస్తే ఆ రోజు కూలి దొరుకుతుంది. లేకుంటే పూట గడవడం కష్టం. ఇలా ఆమె జీవితాన్ని కుల వృత్తి పేరుతో తనకు తానే అంకితం చేసుకుంది. మగ వారితో సమానంగా బొందలు తవ్వుతూ తన జీవన పోరాటాన్ని కొనసాగిస్తోంది. కాటికాపరి కుటుంబానికి చెందిన వ్యక్తినే పెండ్లి చేసుకొని సంసారం సాగిస్తున్నది.
బతుకును భారంగా మోస్తూ...
బొందల గడ్డకు శవాన్ని తీసుకొచ్చేందుకు ఓ సమయమంటూ ఉండదు. శవం రాగానే హుటాహుటిన వెళ్లి బొంద తీయాలి. దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి. శవ ఖననం పూర్తయ్యే వరకు దగ్గరుండి ఏర్పాట్లు చూడాలి. ఇంతా చేస్తే వీరికొచ్చేది శవానికి వెయ్యి రూపాయల వరకే. ఈ వృత్తిపై వీరితోపాటు మరో రెండు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వచ్చిన దాంట్లో ముగ్గురు పంచుకోవాల్సిన పరిస్థితి. దీంతో చాలీచాలని స్థితిలో కుటుంబ పోషణ భారంగా మారింది. మరోవైపు అనాథ శవాలు వస్తే వాటిని ఎవరూ పట్టించుకోరు. పోలీసులు తీసుకొస్తే ఏమీ ఆశించకుండా ఖననం చేయాల్సి వస్తుంది. అనాథ శవాలకు ఎవరు డబ్బులివ్వరు. అయినా సుజాత ఆ శవాలకు దహన సంస్కారాలు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆ కాటికాపరుల కుటుంబం పస్తులతో కాలం వెల్లదీస్తోంది, ఎవరైన చనిపోతేనే నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లే దుస్థితి, దీంతో మనసు చంపుకొని, గుండెను రాయి చేసుకొని, ఎప్పుడు ఎవరు చస్తారా? అని ఎదురుచూడటం వీరి రోజు వారి దినచర్యలో భాగమైంది.
కష్టమొస్తే బతుకు కకావికలం
ఈమెకు ముగ్గురు పిల్లలు. పాప నాగరాణి 7వ తరగతి వరకు చదివింది. ఆమెకు ఇప్పుడు సుమారు 20 ఏండ్లు దాటాయి. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో ఆ అమ్మాయి మానసిక రోగిగా తయారైంది. తలకు బలమైన గాయం కావడంతో, ఏ విషయాన్నీ ఎక్కువగా గుర్తుంచుకోలేని దుస్థితి. కానీ తన బిడ్డకు పెండ్లి చేయాలని ఆ తల్లి ఆరాటపడుతున్నది. మనసున్న మారాజులు దయ తలిస్తే తన బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టి కన్న రుణం తీర్చుకుంటానని ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతున్నది. ఇద్దరు కొడుకులు కూడా 7వ తరగతి వరకే చదివి మానేశారు. ప్రస్తుతం వారు కూడా తల్లికి ఆసరాగా తట్ట, పార చేతబట్టి తమవంతు సాయం చేస్తూ కుల వృత్తినే కొనసాగిస్తున్నారు.
శ్మశానమే ఆమె ఇల్లు
35 ఏండ్లుగా సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అధికారులు, ప్రజా ప్రతినిధుల కాళ్లా, వెళ్లా పడి తన గోడు చెప్పుకుంది. అయినా ఈ విధి వంచితురాలి బాధ వారెవారికీ పట్టలేదు. దీంతో ముగ్గురు పిల్లలతో కుటుంబం రోడ్డున పడింది. ఈ పరిస్థితుల్లో శ్మశాన వాటికలో ఉన్న చిన్న రూములోనే ఆ కుటుంబం తలదాచుకుంటున్నది. ఆ చిన్న రూములోనే ఐదుగురు సహజీవనం చేస్తున్నారు. ఇది ఆమె ఒక్కదాని గాధ కాదు. కాటి కాపరుల కష్టాలకిది ఒక మచ్చుతునక. సమాజానికి ఇదో మాయని మచ్చ. ఈ దుస్థితి లేని సమాజం కోసం కదలటమే పాలకులను నిలదీయటమే మార్గం. అడుక్కుంటే రావు హక్కులు. పోరాడితేనే వస్తాయి.
- కె.కె.
సెల్ : 9666011107
Authorization