ప్రజల కుల చర్చ ఆత్మగౌరవం, హక్కులు, బతుకుకోసం జరుగుతుండగా, ఆధిపత్యకులాల నేతలు మాత్రం కుల ఆధారిత రాజకీయాలు చేస్తూ, కులాలను బలపరుస్తూ, కింది కులాలు పైకులాలకు వ్యతిరేకం అన్న భావాన్ని తెస్తూ శాశ్వతంగా కులాన్ని విభజనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అట్టడుగు కులాలు పేదరికం గురించి మాట్లాడితే ఆధిపత్య కులాల పేదరికం ముందుకు తెస్తున్నారు. రిజర్వేషన్ల అమలు గురించి పోరాడితే మాకూ రిజర్వేషన్లు అని అగ్రకులాల ధనికవర్గం అగ్రకుల పేదలను ఉసిగొల్పుతున్నారు. నిజానికి అగ్రకులాల పేదలకు అణగారిన ప్రజలు వ్యతిరేకం కాదు. జనాభా, శ్రమ ఆధారంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసం ప్రయత్నిస్తున్నారు. అలా కోరుకోవడం కులవ్యవస్థను బలపర్చడమా? ఈ దేశంలో ఎవరైతే అంటరానితనం, కులవివక్ష అనుభవిస్తున్నారో దాడులకు, హత్యలకు గురవుతున్నారో, భూమి ఉద్యోగం, ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారో వాళ్లే కులవ్యవస్థ ఉండాలని కోరుకుంటారా? అసలు కులవ్యవస్థ ఉండటానికి కారకులు ఎవరు? మనిషి మనిషికి మధ్య అడ్డుగోడలు పెట్టి చదువు, సంపద, భూమి, పదవులకు అనర్హులుగా చేసి, తరతరాలుగా ఆ మట్టి మనుషులను జంతువులకన్నా హీనంగా చూస్తూ, ఊరికి ఆవలదూరం వెలివేసి నీచపు పనులు అంటగట్టి వారి కష్టాన్ని జలగల్లా పీల్చి అనందపు అంచులు చూస్తున్నదెవరు?
ఆకలితోనైనా కాలం గడుపుతున్నాము కానీ కుల ప్రస్తావన లేకుండా నేడు దినం గడవటం లేదు. అంతగా భారత రాజకీయ రంగంలో కులం పీటముడి వేసుకున్నది. చర్చ జరిగితే తప్పులేదు. ఆ చర్చ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నదనేదే ప్రశ్న? ఆ కులం భావం, ప్రయోజనం తమకు అనుకూలంగా ఉంటే ఒకరకంగా అనుకూలంగా లేకుంటే మరోరకంగా ఉంటే ఆ చర్చవల్ల ప్రయోజనాలు ఏమిటన్నది ప్రశ్న? కుల చర్చ కులసమస్య పరిష్కారం కోసం జరగాలా లేదా కులాన్ని తమ భావజాలానికి ఆధిపత్యానికి అనుకూలంగా నిత్యం కులాన్ని బతికిస్తూ మనుషులను విడదీసే ప్రయత్నం చేయాలా అనే విషయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరమున్నది.
అణగారిన ప్రజల కుల చర్చ ఆత్మగౌరవం, హక్కులు, బతుకుకోసం జరుగుతుండగా, ఆధిపత్యకులాల నేతలు మాత్రం కుల ఆధారిత రాజకీయాలు చేస్తూ, కులాలను బలపరుస్తూ, కింది కులాలు పైకులాలకు వ్యతిరేకం అన్న భావాన్ని తెస్తూ శాశ్వతంగా కులాన్ని విభజనకు ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అట్టడుగు కులాలు పేదరికం గురించి మాట్లాడితే ఆధిపత్య కులాల పేదరికం ముందుకు తెస్తున్నారు. రిజర్వేషన్ల అమలు గురించి పోరాడితే మాకూ రిజర్వేషన్లు అని అగ్రకులాల ధనికవర్గం అగ్రకుల పేదలను ఉసిగొల్పుతున్నారు. నిజానికి అగ్రకులాల పేదలకు అణగారిన ప్రజలు వ్యతిరేకం కాదు. జనాభా, శ్రమ ఆధారంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసం ప్రయత్నిస్తున్నారు. అలా కోరుకోవడం కులవ్యవస్థను బలపర్చడమా? ఈ దేశంలో ఎవరైతే అంటరానితనం, కులవివక్ష అనుభవిస్తున్నారో దాడులకు, హత్యలకు గురవుతున్నారో, భూమి ఉద్యోగం, ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారో వాళ్లే కులవ్యవస్థ ఉండాలని కోరుకుంటారా? అసలు కులవ్యవస్థ ఉండటానికి కారకులు ఎవరు? మనిషి మనిషికి మధ్య అడ్డుగోడలు పెట్టి చదువు, సంపద, భూమి, పదవులకు అనర్హులుగా చేసి, తరతరాలుగా ఆ మట్టి మనుషులను జంతువులకన్నా హీనంగా చూస్తూ, ఊరికి ఆవలదూరం వెలివేసి నీచపు పనులు అంటగట్టి వారి కష్టాన్ని జలగల్లా పీల్చి అనందపు అంచులు చూస్తున్నదెవరు?
ఆధిపత్య కులాలు, అణగారిన కులాల ఏ ఒక్క చైతన్యాన్ని తట్టుకోలేరు. చదువు, ఉద్యోగం, ప్రశ్నించడం భాష, తిండి, వేషాధారణలో మార్పును స్వాగతించరు. మనం చెప్పిందే, కింది కులాలు ఆచరించాలి. చైతన్యంతో ఉండకూడదు అని మనువాద భూస్వామ్య భావజాలంతో ఆధిపత్యకులాలు ఉన్నాయి.
కానీ.. కాలం మారుతున్నది. బడుగులకు బతుకులు ఇట్లెందుకున్నదో అది అర్థమవుతున్నది. అందుతున్న అరకొర చదువైనా చైతన్యానికి ఆయుధమవుతున్నది. దిగువ ఉద్యోగమైన దిశలను చూపిస్తున్నది. ఈ చైతన్యమే ఆధునిక మనువాదులను కలవరపెడుతున్నది.
అందుకే బీఎల్ఎఫ్కే అధికారం అన్న నినాదం వెగటు పుట్టిస్తున్నదని, నాయకులంతా స్వార్థపరులని, ఎవరికో చెంచాలుగా మారి, వాళ్ల కులాల మనోభావాలను, భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆధిపత్యకులాలు ఆవేదన చెందుతున్నారు. ప్రతిభ లేకున్నా, విద్య, ఉద్యోగం, పదవులలో వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ వారు చేస్తున్న విధులకు, వారి కులాలకు న్యాయం చేయడం లేదని వాపోతున్నారు. కులాంతర వివాహాలు, కలిసికట్టు భోజనాలు మాల మాదిగ కులాలే ఇచ్చిపుచ్చుకోవడం లేదు. ఇక అగ్రకులాలను అడిగే హక్కెక్కడిదని అంటున్నారు. అంటే కులవ్యవస్థకు కారణం మాల మాదిగలేనా? వారిమధ్య బేధాలు పోవాలన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం అవసరం లేదు. వారి మధ్య వివాహాలు జరిగితే కులవ్యవస్థ నిర్మూలన జరిగినట్టేనా?
అవును... ఈ దేశంలో కొన్నేండ్ల తరబడి చదువు, సంపద, భూమి పదవులకు దూరంగా నెట్టబడి ఉన్నవారు నేడు స్వాతంత్య్రం పుణ్యమా అని డా||బిఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దయాదాక్షిణ్యాలతో 72 సం||రాల కాలంలో కొంతమంది చదువు, ఉద్యోగం, పదవులు, ఉపాధి పొందుతున్నారు. వారిలో కొంతమంది మధ్య, ఎగువ తరగతి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, అదే కులం వారి అభివృద్ధికి పనికొచ్చే ఆలోచన, ఆచరణలు కాకుండా స్వీయమానసిక, స్వార్థపర చింతనలూ చేయొచ్చు. ఆధునిక భావ, ఆచరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మనువాద పాలకులకు చెంచాలుగా ఉండి ఉండవచ్చు. అయినంత మాత్రాన అట్టడుగు కులాల ఆర్థిక సామాజిక వెనుకబాటుకు మనువాద పాలకవర్గాలు కాదా ?
ప్రతిభ లేనివారికి చదువు, ఉద్యోగం, పదవులిస్తున్నారనీ, అందుకే ఈ దేశం వెనుకబడి పోతున్నదని ఆధిపత్యకులాలు బాధపడితే.. ఇన్నేండ్ల స్వాతంత్య్రం, దానికన్నా ముందు ఈ దేశంలో రాజ్యాల పరిపాలనలో కొనసాగుతున్న అగ్రకుల పాలకులు, ఈ దేశాన్ని ఇంతటి దౌర్భాగ్యస్థితికి ఎందుకు నెట్టారో... ఆధిపత్య కులాలకు అంటరానితనం నేరమనీ, కులవివక్ష పాటించకూడదని మనిషి, సాటిమనిషిని పరమ పవిత్రంగా, సమానంగా చూడాలని ఎందుకు నేర్పించలేదో?. హత్యలు, దాడులు, పేదరికం ఎందుకు నివారించలేదో.. మనువాదులకు, పాలకులకు అర్థం కావలసిన అవసరమున్నది. ''దడిగట్టుకున్న సమాజమే కులం. కుల రహిత సమాజం ఏర్పడాలంటే వృత్తి, కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలతోపాటు కులవ్యవస్థకు ఆధారభూతమైన శాస్త్రాలను నిర్మూలించాలన్నారు అంబేద్కర్. కానీ ఆయన చెప్పిన ఏ ఒక్క విషయాన్నైనా పాలకులు అమలు చేస్తున్నారా ? చేయడంలేదు. సరికదా ఆయన ఏ వ్యవస్థతో సంఘర్షణ పడ్డారో, అవమానించబడ్డారో ఆ వ్యవస్థనే మరింత బలోపేతం చేస్తున్నారు.
కులాలకు చేయూతనిస్తున్నామనే ముద్దు పలుకులతో కుల సమాజాన్ని ఇంకా దడిగడుతున్నారు. గురు 'కులాలు' గొర్రెలు, పందులు, చేపలు, రాయితీల వంటి నానా రకాల పథకాల పాట్లు పడుతున్నారు. కులాలకు ఆత్మగౌరవ భవనాలంట? పూజారులకు మత గురువులకు నేరుగా జీతాలంట.. మరి దాంట్లో రిజర్వేషన్లు అమలు చేయొద్దా? అవి శాశ్వత ఉద్యోగాలా? వారికి మాత్రమేనని రాజ్యాంగంలో రాసుకొని ఉందా? కులాల వృత్తి పవిత్రంగా భావించేవాళ్లు బాపనోళ్లు రాజ్యాన్ని ఎందుకు ఏలుతున్నారో, చెప్పులు తయారు చేసే లాభదాయకమైన వృత్తి అగ్రకులాలు ఎందుకు కైవసం చేసుకున్నారో.. వ్యవసాయం చేసే కోమటి వ్యాపారం ఎందుకు చేస్తున్నారో..?
కులవ్యవస్థ నిర్మూలన జరగాలంటే కులం పేరుతో అణచబడ్డ, వెలివేయబడ్డ వర్గాలకు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సమానత్వం రావాలి. ఒక్కరికో, ఇద్దరికో ఉద్యోగాలు ఇచ్చి, పదవులిచ్చి, పథకాలిచ్చి మేమే అంబేద్కర్ కన్నా గొప్పవాళ్లమని ఆధిపత్యకులాల మనుధర్మవాదులు భజనపరులచే, చెంచాలచే ప్రకటింపచేసుకుంటున్నారు. మనుషుల మధ్య కుల విభజన చేసిందెవరు? నియమాలు పెట్టింది అధిపత్య కులాల వాళ్లేకదా ! ఏ సాంస్కృతిక మార్పైనా.. వినిమయతత్వం, అనుకరణ అన్నీ ఆధిపత్యకులాల నుంచేగా కింది కులాలకు చేరుతున్నది.
నేడు అణగారిన వర్గాలు ఆర్థిక సామాజిక రాజకీయ, రంగాలలో సమానత్వం, సామాజిక న్యాయానికై ఒక్కటవుతున్నారు. ఆధిపత్య కులాలు, మనువాద పాలకుల బాధంతా అదే. అందుకే బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మేధావులు, యువకులు, విద్యావంతులు ఐక్యంగా కదలాలి.
- దయ్యపు రాధాకృష్ణ
సెల్ : 7730877841
Authorization