ఇటీవల సుప్రీంకోర్టు మత సాంప్రదాయాలను రాజ్యాంగ పరిధిలో పాటించాలని దేశ ప్రజలకు సూచించింది. అనాది కాలం నుండి కొందరు తమ వ్యక్తిగత జీవితాల్లో నమ్మి ఆచరించిన విషయాలు ఒక ధర్మంగా, తర్వాత కాలంలో మతంగా రూపుదిద్దుకున్నాయి. ప్రజాశ్రేయస్సుని కాంక్షించి క్రీస్తు ప్రాణత్యాగం చేయగా, బుద్దుడు సత్యాన్వేషణ కోసం రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు. మహ్మద్ ప్రవక్త తను నివసించిన సమాజంలో సాంఘీక దురాచారాలని నిర్మూలించడానికి విశేష కృషి చేశాడు. వారి బోధనలే మతగ్రంథాలుగా అవిష్కరించబడ్డాయి. అవే ప్రజల జీవన విధానాన్ని నిర్ధేశించే రాజ్యాంగ శాసనాలుగా మారాయి. తర్వాత సైన్స్ పురోభివృద్ధితో అది కూడా మానవ జీవన విధానంలో విడదీయరాని భాగంగా మారింది. వివిధ మతాలు ప్రబోధించిన విషయాలు నేడు ప్రపంచ ప్రజలందరికీ తెలిశాయంటే మనిషి రూపొందించిన అచ్చుయంత్రం వల్లే. సైన్స్ ద్వారా కనుగొన్న విశ్వ రహస్యాలని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే లోపే, మతం తాను నమ్మిన సిద్ధాంతాలని సైన్స్ పరికరాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి సులభంగా, వేగంగా, విస్తృతంగా చేరవేయగల్గింది. అనాధికాలం నుండి ఆధునిక కాలం వరకు క్రీస్తు, బుద్ధుడు, మహ్మద్ ప్రవక్త, గురునానక్, రామకృష్ణ పరమహంస, అంబేద్కర్, లింకన్, మండేలా వంటివారు వారివారి కాలాల్లో దార్శనికులుగా, యుగ పురుషులుగా కీర్తించబడ్డారు. తర్వాత అవతార పురుషులుగా మారారు. మరోవైపు హిట్లర్, ముస్సొలినీలు నియంతలుగా, లాడెన్ వంటివారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విధ్వంసాన్ని సృష్టించి చరిత్రహీనులుగా మిగిలారు.
మతాన్ని గుడ్డిగా నమ్మి కొందరు మతోన్మాదులుగా మారితే, మరికొందరు మతాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా సంఘసంస్కర్తలుగా అవతరించారు. ఇంకొందరు మతాన్ని ఎదిరించి మానవతావాదులుగా పరిగణింపబడుతున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ సృష్టిలో సకలకోటి జీవరాశిలో మనిషి మాత్రమే మతానికి ఆద్యుడయ్యాడు. చివరికి మతానికి బంధీగా మిగిలాడు. ఎందుకంటే మనిషిలేని చోట దేవాలయం లేదు. ఆలయాలు లేని చోట ప్రార్ధనలు లేవు. మత సంఘర్షణలకు అవకాశమేలేదు. మతాన్ని అనుసరించకపోయినా కార్ల్మార్క్స్, ఐన్స్టీన్, హాకింగ్, సి.వి.రామన్, పెరియార్ వంటివారు మానవాళి శ్రేయస్సుకోరారు, కాబట్టే వారు చరితార్ధులయ్యారు. మతమైనా, సైన్స్ అయినా సామాజిక న్యాయమనే కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. తమిళనాడులోని కంచిపీఠం పరమత సహనాన్ని కూడా పాటిస్తుంది. మదర్ధెరిస్సా వంటి వారు మతాన్ని అనుసరించినా సామాజిక న్యాయమనే కోణాన్ని ఆమె విస్మరించలేదు. అందుకే ఆమె 'విశ్వమాత'గా కీర్తించబడుతుంది. అక్బర్, శివాజీ వంటి చక్రవర్తులు పరమత సహనాన్ని ప్రదర్శించబట్టే అందరి మన్ననలు పొందగలిగారు. కొన్ని సందర్భాలలో సామాజిక న్యాయమనే విషయాన్ని విస్మరించిన సైన్స్ కూడా తన ఫలాలని సామాన్య జనాలకి అందించడంలో విఫలమైంది.
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే సత్యం, అహింస, ప్రేమ వంటి లక్షణాలని పునికిపుచ్చుకొని జీ వించిన వ్యక్తులు దేవుండ్లుగా కీర్తించబడుతుంటే, హింసా, నేర ప్రవృత్తిగల మానవులు దానవులుగా పరిగణింబడుతున్నారు. మతం ఒక మార్గంగా ఉన్నంతవరకు పర్వాలేదు. దుర్మార్గంగా మారితేనే మానవాళికి ముప్పు. ఎందుకంటే సైన్స్ని నడిపించేది, మతాన్ని అనుసరించేది మనిషే. కాబట్టి నేటి పాలకులు ఈ విషయాన్ని త్వరగా అర్థం చేసుకోవాలి. మతాన్నే తమ జెండా, అజెండాగా మార్చుకునే పాలకుల వల్ల మత విద్వేషాలకి ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రకృత్తి హక్కులకి భంగం కల్గి పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజలే సంయమనం పాటించి చరిత్రని పరిశీలించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది.
- ఎమ్.రాంప్రదీప్
సెల్:9492712836
Authorization