ఇటీవల ఇండోనేషియాలోని జకర్తాలలో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 4-400 మీ. రిలే ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన సరితా గైక్వాడ్ భారతీయ రెండో గిరి పుత్రిక. ఇప్పటికే మహిళల హెప్టాద్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి గిరిజన ఆసియాడ్ అథ్లెట్గా స్వప్న బర్మన్ రికార్డు కెక్కింది విధితమే. కనీస సౌకర్యాలకు నోచుకోని ఓ గిరిజన కుగ్రామం నుండి వచ్చిన నిరుపేద గిరిపుత్రిక సరిత అత్యున్నత వేదికపైకి చేరుకోవడానికి కొండంత ఆత్మ విశ్వాసంతో అలుపెరుగని పోరాటమే చేసింది. ఈయేటి ఆసియా క్రీడలలో స్వర్ణ పతకం సాధించిన పరుగుల బంగారు కొండ సరితను ఆసియా గిరిజన ముత్యం అనడం సముచితం.
సరితా గైక్వాడ్ జీవన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆమె గుజరాత్లోని ప్రకృతి అందాల విరబోత అయిన డంగ్ జిల్లా కరాడి అంబా అనే కొండ ప్రాంతంలో జన్మించింది. కేవలం 45 కుటుంబాలే నివసించే ఆ కొండ కోనల్లోని గిరిజనులది మౌలిక వసతుల లేమితో కూడిన నిత్య జీవన పోరాటం. ఇంటర్నెట్ సంగతి అటుంచితే కరాడి అంబా గ్రామానికి బస్సుసౌకర్యం సుదూరమైనా సరైన రోడ్డు కూడా లేదు. ఈ స్థితి నుంచి వెలుగులోకి వచ్చిన సరితతో ఫోన్లో మాట్లాడాలన్నా, ఆమె ఫోన్ చేయాలన్నా సెల్ సిగల్ కోసం కొండెక్కాల్సిందే. నలుగురు పిల్లలను పెంచడమే భారమైన సరిత తల్లిదండ్రులు లక్ష్మణ్ బారు, రేణూ గైక్వాడ్లు రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీలు. అమ్మానాన్నలు నిరక్షరాస్యులైన విపత్కర పరిస్థితుల్లోనూ క్రీడల గురించి ఆమె ఆలోచించడం యాదృచ్ఛికమే. ఆర్థికంగా ఆమె అనేక అడ్డంకులు ఎదుర్కొన్నా తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈనాడు సరితను దేశానికి బంగారు కొండగా నిలిపిందన్నది నిస్సందేహం. సరితను ఆసియాడ్ పసిడి పతాక విజేతగా నిలిపిన ఆమె క్రీడా స్ఫూర్తి వెనుక గిరిజన నిజ జీవన పరిస్థితులే ముఖ్య కారణంగా కన్పిస్తాయి. గుజరాత్ స్విట్జర్లాండ్గా పిలుచుకునే అందమైన ప్రదేశం డంగ్. డంగ్ పరిసరాల్లోని కరాడి అంబా లాంటి కొండల మధ్య నివసించే గిరిజనులది నిత్య జీవన పోరాటం. వర్షాకాలం వస్తే వారికి బాహ్య ప్రపంచం అంటే తెలియదు. స్వగ్రామంలో నీటి కొరత వల్ల తాగునీటి కోసం సరిత చిన్నప్పటి నుంచే కొండలు ఎక్కేది. పసి వయస్సులోనే కష్టాలకోర్చి నిలిచింది. ఇలా శారీరక, మానసిక ధృడత్వాన్ని పోగు చేసుకుంది. ఓసారి బంధువుల ఇంట్లో టీవీలో ఆటల పోటీలు చూసి క్రీడలపై మక్కువ పెంచుకున్నది. పాఠశాల స్థాయిలో ఖోఖో ఆడేది. డిగ్రీలో ఆమె టాలెంట్ను గుర్తించిన కోచ్ అజిమోన్ అథ్లెటిక్స్ వైపు మళ్లిం చాడు. రన్నింగ్పై మెళకువలు నేర్చుకున్నది. బూట్లు లేకుండానే పరుగుపందెంలో పాల్గొన్నది. కానీ తన ఆర్థిక పరిస్థితిని చూస్తే తినడానికి సరైన తిండి, బూట్లు కూడా కొనలేని స్థితిలో కళాశాల యాజమాన్యం సరితకు అండగా నిలిచింది.
2012లో సరిత స్పోర్ట్స్ అథారిటీ శిక్షణా కార్యక్రమానికి ఎంపికైంది. తదుపరి 2014లో పటియాలలోని జాతీయ శిబిరంలో అవకాశం దక్కించుకుంది. గుజరాత్ ప్రాధికార సంస్థ నిర్వహించిన 400 మీటర్ల పరుగు ట్రయల్స్లో 1ని.1 సెకను టైమింగ్ను నమోదు చేసుకొని గుజరాత్ క్రీడల అకాడమీలో ఆమె ప్రగతి సాధించింది. 2016లో జాతీయ అథ్లెటిక్స్ చాంఫియన్ షిప్స్లో రజతం సాధించింది. లఖ్నప్లో జరిగిన ఓపెన్ అథ్లెటిక్స్ చాంఫియన్ షిప్స్లో 400 మీ.లో కాంస్యం, 400 మీ. హార్డల్స్లో రజతంతో మెరిసింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన సరితకు కామన్వెల్త్ క్రీడలలో అవకాశం దక్కినా అపజయం పాలైంది. ఆ అపజయాన్ని విలువైన అనుభవంగా మార్చుకొని ఈయేటి ఆసియా క్రీడలలో స్వర్ణ పతకంతో మెరిసింది. డంగ్ ఎక్స్ప్రెస్గా పేరు తెచ్చుకున్న సరితా గైక్వాడ్ ఇదే ప్రతిభతో త్వరలో టోక్యోలో జరుగబోయే ఒలింపిక్స్లో తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.
- గుమ్మడి లక్ష్మినారాయణ
సెల్ : 9491318409
Authorization