నల్లగొండ డెస్క్
దళితుల చైతన్యంపై అగ్రకులాల అణచివేత కొనసాగుతోంది. దళిత యువకులు విద్యావంతులైనప్పటికీ వారి ప్రశ్నించే గొంతుకను నొక్కి వేసేందుకు కుట్ర జరుగుతోంది. అనాధిగా దళితులపై అగ్రవర్ణాల ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. దళితులు రాజకీయంగా ఎదగడాన్ని అగ్రకులాలు ఓర్వలేక, అణిచివేత, నిరంకుశ విధానాలపై, అన్యాయాలపై దళితులు ప్రశ్నిస్తే.. వారిని లక్ష్యంగా తీసుకొని కుట్రపూరితమైన కేసులు పెట్టడం, భయబ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఇటీవల జరిగిన తాజా సంఘటనతో మరో దళితులపై వివక్ష విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రవర్ణాలతో బీసీలు ఏకమై దళితుల పట్ల చూపిస్తున్న వివక్షను తెటతెల్లం చేస్తున్నది. గ్రామంలో ఇటీవల దసరా పండుగ సందర్భంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని బీసీలు కొట్టడంతో మరుసటి రోజు గ్రామంలో పంచాయతీ నిర్వహించి బీసీ కులాల వారిని తప్పు అన్పించి క్షేమాపణ చెప్పించారు. అనంతరం మరుసటి రోజు దుర్గామాత ఊరేగింపు ఉత్సవాల్లో సదరు దళిత యువకుడు ఉత్సవాల్లో పాల్గొనడానికి రాగా బీసీ కులాలకు చెందిన యువకులు అడ్డు చెప్పడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణతోపాటు వాగ్వివాదం జరగడంతో బీసీలంతా స్థానిక మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో ఎస్సీలపై ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్సీలు, పోలీస్స్టేషన్కు వచ్చి తమపై కూడా జరిగిన అన్యాయమైన దాడులపై ఫిర్యాదు ఇవ్వబోగా సీఐ ఫిర్యాదు తీసుకోకుండా నిరాకరించిన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్సీలలో ఈ సంఘటనతో ప్రమేయం లేనివారిపై కూడా బైండోవర్ కేసులు నమోదు చేయడంతో దళితులు భయబ్రాంతులకు లోనవుతున్నా రు. దీంతో స్థానిక మాదిగ వర్గానికి చెందిన వారంతా నల్లగొండ డిఎస్పీని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో డీఎస్పీ స్పందించి నార్కట్పల్లి సీఐకి కేసు బాధ్యత అప్పగించి త్వరితగతిన కేసు విచారణ చేపట్టవల్సిందిగా ఆదేశించారు. సీఐ ఈనెల 30న గ్రామాన్ని సందర్శించి విచారించనున్నట్టు బాధితులైన దళితులకు హామీ ఇవ్వడంతో వారంతా స్థానిక తహ శీల్దార్ సిహెచ్ విశాలాక్షికి సైతం వినతిపత్రం అందజే శారు. అనంతరం తహశీల్దార్ గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి ఈనెల 30 గ్రామంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో అందరి సమక్షంలో కేసును విచారించనున్నట్టు ఆమె తెలిపారు.
నివురుగప్పిన నిప్పుల్లా
సాంఘిక బహిష్కరణ
బీసీలంతా ఏకమై మరో ఒక్క ఉప కులమైన మాల సామాజిక వర్గం వారితో మాట్లాడి వారితో సహా బీసీలు గ్రామంలోని మాదిగలను ఎలాంటి సహాయ సహకారాలు చేయవద్దని, వ్యవసాయ, ఇతర పనులకు వారిని పిలువకూడదని, వృత్తిపరమైన సేవలందించకూడదని, వారితో మాటమంతి జరపకూడదని, వారిని సాంఘికంగా బహిష్కరించాలని తీర్మానం చేసుకొని ఎవరైన తీర్మానం అతిక్రమిస్తే రూ.50వేలు జరిమానా విధించేలా తీర్మానం చేశారు. దీంతో నాటి నుండి ఎస్సీలతో గ్రామానికి చెందిన ఇతర కులాల వారు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని ఎస్సీలు చెబుతున్నారు. ఈ తీర్మానం విషయం చట్టపరంగా నేరమవుతుందనే ఉద్దేశ్యంతో ఇలాంటిదేమి లేదని బయటకు తెలియనివ్వకుండా ఎవరికివారే సాంఘిక బహిష్కరణ అమలు చేస్తున్నారు. దీంతో గ్రామంలోని మాదిగలకు ఇతర కులాల వారి నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందడం లేదని, కనీసం మాట్లాడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ఈ నెల 30న విచారణ...
గ్రామంలో తలెత్తిన ఎస్సీ, బీసీల ఘర్షణ సంఘటనపై ఈనెల 30న ఉన్నతాధికారులైన పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామంలో విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగానే నార్కట్పల్లి సీఐ, మండల తహశీల్దార్ 30న ప్రత్యేక గ్రామసభ నిర్వహిస్తున్నట్టు టాంటాం వేయించి సంఘటనకు సంబంధించిన అంశంపై పూర్తి విచారణ జరిపి కులవివక్షపై అవగాహన కల్పించనున్నారు. గ్రామంలో ఎన్నడూ లేని విధంగా కులవివక్ష ఏర్పడడం, పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమైనప్పటికీ కులవివక్ష చూపించడమనేది చట్టపరమైన నేరంగా భావిస్తూ దాని నివారణకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. గ్రామంలో ఎస్సీ, బీసీల మధ్య ఘర్షణ పూరితమైన వాతావరణం నెలకొనడంతో ఇరువర్గాలపై సీఐ బైండోవర్ కేసులు నమోదు చేశారు. దళితుల్లో ఐదుగురిపై, బీసీల్లో ముగ్గురిపై బైండోవర్ కేసు నమోదు చేయడంతో గ్రామంలో భయానక పరిస్థితి ఏర్పడింది.
సాంఘిక బహిష్కరణ నేరం...
పెద్దకాపర్తి గ్రామంలో దళితులపై గ్రామంలోని ఇతర కులాల వారు మూకుమ్మడిగా సామాజిక బహిష్కరణ చర్యలకు పాల్పడడం చట్ట వ్యతిరేకం. బీసీలు ఎవరికి వారే ఎస్సీలపై సాంఘిక బహిష్కరణకు పాల్పడుతూ వారిని తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఈ సంఘటన ఉన్నత స్థాయి అధికారులు ఆర్డీఓ, డీఎస్పీ విచారణ జరిపి అవగాహన కల్పించాలి. బీసీ, ఎస్సీల మధ్య ఎప్పుడూ లేని విధంగా ఘర్షణ వాతావరణం నెలకొనడం, తద్వారా సామాజిక బహిష్కరణ అమలుకావడం వంటి చర్యల వెనుక రాజకీయ కుట్ర దాగివుంది. అగ్రవర్ణాల అవకాశవాదం లేకపోలేదు. దీనిపై పూర్తి విచారణ జరిపి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా శాంతి నెలకొల్పే విధంగా కుల వివక్షత, దాని పరిణామాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
-జిట్టా నగేశ్, కువ వివక్షపోరాట సంఘం జిల్లా నాయకులు
Authorization